ELR: నూజివీడులోని కృష్ణాయూనివర్సిటీ పరిధిలో గల డాక్టర్ ఎంఆర్ అప్పారావు పీజీ సెంటర్లో ఇటీవల నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్లో ఎంపికైన 21 మంది విద్యార్థులకు రిక్రూట్మెంట్ లెటర్స్ శనివారం అందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ నవీన లావణ్య లత మాట్లాడుతూ.. చదువులో ప్రగతి సాధించడం, పోటీలలో నైపుణ్యత ప్రదర్శించడంతో బంగారు భవిత ఏర్పడుతుందన్నారు.
ప్రకాశం: సింగరాయకొండ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయం శనివారం వినియోగదారులతో కిక్కిరిసింది. ఏజెన్సీలో సిలిండర్ల కోసం ప్రజలు క్యూ కట్టారు. ఇరాన్ యుద్ధ ప్రభావంతో ముడి చమురు ధరలు పెరిగి, మున్ముందు గ్యాస్ కొరత మరింత తీవ్రమవుతుందనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. ఈ భయంతో జనం గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరుతున్నారు.
VZM: విజయనగరం రైల్వే ప్రయాణికులకు ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు శనివారం బయలుదేరవలసిన విశాఖపట్నం-దుర్గ్(20830) వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2:50 గంటలకు బదులు సాయంత్రం 4:45 గంటలకు బయలుదేరుతుందని వెల్లడించింది. ట్రాక్ పై జరుగుతున్న పలు అప్ గ్రేడ్ పనులు కారణంగా రీ షెడ్యూల్ చేస్తున్నట్లు తెలిపింది.
అన్నమయ్య: ఐపీఎల్ సీజన్ ప్రారంభం సందర్భంగా శనివారం గాలివీడు ఎస్సై నరసింహారెడ్డి యువతకు హెచ్చరికలు జారీ చేశారు. క్రికెట్ను వినోదంగా మాత్రమే చూడాలని, బెట్టింగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. బెట్టింగ్స్ వల్ల ఆర్థిక, మానసిక నష్టాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. గాలివీడులో ప్రత్యేక నిఘా ఉంచామని, బెట్టింగ్స్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కోనసీమ: కొత్తపేట మండలం వాడపాలెం గ్రామ శివారు బండారుపేట వద్ద శనివారం ప్రమాదం జరిగింది. రెండు ఆటోలు, ఒక కారు ఒకదానినొకటి ఢీకొనడంతో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
CTR: చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ పుట్టపర్తి నారాయణ చార్యులు జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ సిబ్బందితో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఆయన 15 భాషల్లో ప్రావీణ్యం సాధించడం అరుదైన విషయమని కొనియాడారు. తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని వెల్లడించారు.
KRNL: పెద్దకడబూరులో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగిన బయోలాజికల్ సైన్స్ పరీక్షకు KGBV పాఠశాలలో 135 మందికి గానూ 133 మంది హాజరు కాగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. AP మోడల్ స్కూల్లో 257 మందికి గాను 249 మంది హాజరు కాగా, 8 మంది గైర్హాజరయ్యారు. ZP పాఠశాల 254 మందికి గాను 249 మంది హాజరు కాగా, ఐదుమంది గైర్హాజరైనట్లు MEO భాషా తెలిపారు.
SKLM: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శనివారం కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధిపై ఇద్దరు నాయకులు చర్చించారు. ఈ సందర్భంగా తమ తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులు, ప్రజలకు అందిస్తున్న సేవల గురించి పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.
W.G: భీమవరం ఫిట్ జోన్ జిమ్లో దాసరి చందు మిత్రబృందం శనివారం వికలాంగ మహిళకు వీల్ చైర్ అందజేశారు. విజ్ఞాన వేదిక అధ్యక్షులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ.. చందు యువకులకు బాడీ బిల్డింగ్తో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా భాగస్వాములను చేయటం అభినందనీయం అన్నారు. చందు మాట్లాడుతూ.. కొత్త పూసలమర్రుకు చెందిన కనుమూరి విజయలక్ష్మికి ఈ వీల్ చైర్ అందజేశామన్నారు.
PPM: సీతానగరం బస్ స్టాండ్ వద్ద గురువారం బస్సులో నుంచి జారిపడ్డ మహిళ శనివారం ఉదయం మృతి చెందినట్లు మృతుని కుటుంబ సభ్యులు తెలిపారు. రామభద్రపురం గొల్లవీధికి చెందిన కొయ్యాన లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజ ముగించుకుని వెళుతుండగా ప్రమాదం జరిగినట్టు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం కోసం విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు.
TPT: ఈనెల 30న సీఎం తిరుపతి, నాయుడుపేట పర్యటనతో పాటు గవర్నర్ 30, 31 తేదీల్లో తిరుపతి–తిరుమల పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. పర్యటన సజావుగా, భద్రంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమీక్షలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు పాల్గొన్నారు.
నంద్యాల ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో శనివారం స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో సుగుణశ్రీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థల్లో చెత్త నిర్వహణను శాస్త్రీయంగా, క్రమబద్ధంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. నంద్యాల మండలంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు.
NLR: జిల్లా కేంద్రంలోని బాలాజీనగర్, ఏసీ నగర్లో ఉన్న వీధి శునకాలను ఏబీసీ సెంటర్కు తరలించారు. నగరంలో కుక్కల బెడద ఎక్కువ అవ్వడంతో పలు కాలనీల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురు కమిషనర్ వై.ఓ. నందన్కు సమాచారం ఇవ్వగా.. ఆయన ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తక్షణమే 10 వీధి శునకాలను పట్టుకుని ఏబీసీ సెంటర్కు తరలించారు.
CTR: చిత్తూరు జిల్లాలో ఇవాళ్టి వరకు జిల్లాలో 15,78,617 మంది ఓటర్లు ఉన్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో జిల్లాలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
ATP: ఏఎఫ్ ఏకాలజీ సెంటర్లో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించినట్లు ఆ సంస్థ డైరెక్టర్ మల్లారెడ్డి శనివారం తెలిపారు. టెన్త్, డిగ్రీ, ఐటిఐ, చదివి 19 నుంచి 35 సంవత్సరాల వయసు మధ్య కలిగిన యువతీ, యువకులు అర్హులన్నారు. 12 ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న 500కు పైగా ఉద్యోగాల భర్తీకి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.