BHNG: భువనగిరి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ఆర్సేటీ) శిక్షణా కేంద్రాన్ని సోమవారం కిసాన్ నగర్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువత, మహిళలు శిక్షణా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
NLG: తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల్, కొమరంభీం, మంచిర్యాల, నాగర్కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు వస్తాయని తెలిపింది.
SRD: కంగ్టి మండలం తడ్కల్ రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమం ఉంటుందని ఏఈవో హన్మండ్లు సోమవారం తెలిపారు. మంగళవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శాస్త్ర వేత్తలు నేరుగా రైతుల సందేహాలకు సమాధానాలిస్తారని పేర్కొన్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి ప్రతి వారం ఒక అభ్యుదయ రైతు తమ వ్యవసాయ అనుభవాలను, రైతులతో పంచుకొనే అవకాశం ఉంటుందన్నారు.
HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ, శ్రీ చైతన్య మోడల్ స్కూల్ ఎదురుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత రోడ్డును జేసీబీతో తవ్వేసి, కొత్తగా కాంక్రీట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఆ దారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రోడ్డు నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండడంతో, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
KMM: కల్లూరు మండల MROగా కే.బ్రహ్మేశ్వరరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ విధులు నిర్వర్తించిన పులి సాంబశివుడు ఖమ్మం కలెక్టరేట్కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో బ్రహ్మేశ్వరరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని, పెండింగ్లో ఉన్న రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
WGL: నర్సంపేట మండలంలో నిర్వహించిన డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ సర్వసభ్య సమావేశంలో జిల్లా మాజీ అధ్యక్షుడు గుంటి రామచందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకు సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. విద్యా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
JGL: వెల్గటూర్ మండలంలోని పాశిగామ గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణ కోసం సోమవారం ఉచిత పశు టీకాల కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 33 ఆవులు, ఎడ్లు, 56 గేదెలకు టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శిరీష, ఉపసర్పంచ్ భూమయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు. పశువైద్య సిబ్బంది సంధ్య, నాగరాజు, అంజి టీకాలు నిర్వహించగా, డా. పీ. శ్రీప్రియ పర్యవేక్షించారు.
NRML: ఖానాపూర్ పట్టణంలోని శాంతి నగర్లో కడారి శివ కుమార్, శిరీష దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి రెండేళ్ల కుమారుడు కడారి బన్నీ కొంతకాలంగా తీవ్రమైన మూత్ర సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని అవసరమైన వైద్య సహాయం అందించేందుకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ ముందుకొచ్చారు.
JN: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సమస్యలపై 232 దరఖాస్తులు రాగా వాటిని కలెక్టర్ స్వయంగా స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
KNR: చొప్పదండి మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ సిబ్బందిని సొంత పనులకు వినియోగిస్తున్నారని బీజేపీ నాయకుడు తాడూరి శివకృష్ణ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సిబ్బందితో పాటు మున్సిపల్ వాహనాలను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకుంటున్నారని, దీంతో పట్టణంలో పారిశుద్ధ్య పనులు దెబ్బతింటున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు.
MHBD: నెల్లికుదురు మండలం రామన్నగూడెం, కాచికల్ గ్రామాల్లోని ద్విచక్ర వాహనదారులు ఏప్రిల్ 02 నుంచి హెల్మెట్లు ధరించాలని ఎస్సై చిర్ర రమేష్ బాబు గ్రామస్తులకు సూచించారు. రెండు గ్రామాల్లోని ద్విచక్ర వాహనదారుల ఇళ్లకు ఎస్సై తన సిబ్బందితో కలిసి వెళ్లి హెల్మెట్లు పెట్టుకోని వాహనాలు నడపాలని, హెల్మెట్లు ధరించని వారికి గ్రామాల్లోకి ప్రవేశం లేదన్నారు.
WGL: ప్రజావాణి కార్యక్రమంలో సమస్య పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్కు వచ్చిన ఓ వృద్ధురాలు క్యూలైన్లో నిలబడి ఇబ్బందిపడుతున్నది గమనించిన కానిస్టేబుల్ వెంటనే స్పందించాడు. ఆమెకు కూర్చోవడానికి కుర్చీ ఏర్పాటు చేసి సహాయం అందించాడు. ఈ చర్యతో అక్కడున్న వారంతా అతని మానవత్వాన్ని ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
SDPT: బెజ్జంకి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గైనకాలజీ, దంత, చర్మ, ఎముకలు, కంటి వైద్య నిపుణులు రోగులకు సేవలందిస్తారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఉచిత చికిత్స, మందులు అందుబాటులో ఉంటాయని వైద్యాధికారి డా. మాధురి తెలిపారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
NGKL: బల్మూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని సర్పంచ్ శిరీష, డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ తారా సింగ్ ప్రారంభించారు. ఈ శిబిరంలో 220 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
MDK: రామాయంపేట మండలం ఆర్. వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ ఉమా సంజీవరెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. గ్రామంలోని బస్సు షెల్టర్ శిథిలావస్థకు చేరి ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన ఆమె, ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా సొంత ఖర్చుతో మరమ్మతులు చేయించారు. షెల్టర్ను పూర్తిగా బాగు చేయించి, ఆకర్షణీయమైన రంగులు వేయించి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చారు.