MNCL: సామర్థ్యానికి మించి వాహనంలో పశువులను తరలిస్తున్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. జైపూర్ SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. కౌటాల నుంచి సిద్దిపేట సంతకు ఒకే వాహనంలో 8 ఆవులు, ఒక ఎద్దు, 5 దూడలను కిక్కిరిసిగా తరలిస్తుండగా, ఇందారం వద్ద రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు. హోంగార్డు రమేశ్ ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ATP: పదో తరగతి పరీక్షల వేళ ఫోన్ చూడొద్దు అని మందలించడంతో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల వివరాల మేరకు.. కంబదూరు మండలం గుండ్లపల్లి కాలనీకి చెందిన మాధవి(15) రీల్స్ చూస్తుండగా తల్లిదండ్రులు మందలించారు. పరీక్షలకు చదువుకోవాలని సూచించారు. మనస్తాపానికి గురైన బాలిక విష గులికలు తీసుకోవడంతో చనిపోయింది.
W.G: ఉగాది పర్వదినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు 30 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించాలని జిల్లా ఫ్యాప్టో ఛైర్మన్ విజయరామరాజు, సెక్రటరీ జనరల్ ప్రకాశం కోరారు. ఎన్నికల హామీ మేరకు పీఆర్సీ కమిషనర్ను నియమించి, పెండింగ్లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేయాలని మంగళవారం వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు తీపి కబురు అందిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
KNR: రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) డ్రోన్ అకాడమీలో మార్చి 20 నుంచి 26 వరకు 6 రోజుల పాటు డ్రోన్ పైలట్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. డ్రోన్ వినియోగం, సేఫ్టీ, పంటలపై స్ప్రేయింగ్ విధానాలను వివరించనున్నారు. ఆసక్తి గల జిల్లా రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.
MBNR: గండీడ్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు ఈ వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చికిత్సలు చేస్తామన్నారు.
ATP: ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగ శక్తి పథకాన్ని బుధవారం నుంచి అమలు చేయనున్నట్లు గుంతకల్ ఆర్టీసీ డిపో మేనేజర్ ఖాజావలి తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు జీరో చార్జి ఉచిత టికెట్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. దివ్యాంగులకు జారీచేసిన బస్ పాస్ ఐడి కార్డులను చూపించాలన్నారు.
SRPT: చిలుకూరు మండలం ఆచార్యులగూడెం కోదండ రామాలయ కమిటీలు కుల వివక్ష జరుగుతుందని ఫిర్యాదుతో తహసీల్దార్ ధ్రువ కుమార్ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సమయంలో వాగ్వాదం జరగడంతో ఈనెల 24 తేదికి వాయిదా వేశారు. న్యాయం జరగకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడతామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
RR: షాద్నగర్ పరిసర ప్రాంతాల్లో కార్లు అదుపుతప్పి రోడ్డు పక్కకు పడిపోతున్న ఘటనలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. బైపాస్ రోడ్డులో ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కన బురదలో పడిపోయింది. కార్లు వరుసగా అదుపుతప్పి పడిపోవడం వెనక కారణాలు ఏమిటి అనే దానిపై స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, ఇటీవలే చెరువులో ఓ కారు పడిపోయిన విషయం తెలిసిందే.
KDP: రేణిగుంట రైల్వే అండర్ బ్రిడ్జిను మార్చి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు RDO భాను ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. 50 ఏళ్ల కాలం నాటి బ్రిడ్జి కావడంతో మరమ్మతులు అవసరమని రైల్వే శాఖ నిర్ణయించిందన్నారు. కరకంబాడి రోడ్, కొత్త బైపాస్ మార్గాల్లో వాహనాలు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ మార్గంలో కడప వాహనదారులు వెళ్తుంటారు కాబట్టి గమనించాలన్నారు.
బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ చౌదరి నటించిన రూరల్ డ్రామా ‘సుమతీ శతకం’ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, మార్చి 19, 2026 నుంచి ప్రముఖ ప్లాట్ఫారమ్ ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో శైలీ చౌదరి హీరోయిన్గా, టేస్టీ తేజ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సాయి సుధాకర్ నిర్మించారు.
WNP: పానగల్ మండలం నిజామాబాద్ గ్రామానికి చెందిన 5 ఏళ్ల రిషికేష్ అరుదైన స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సకు రూ.30 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఆర్థిక స్తోమత లేక దాతల సాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. సాయం చేయదలచిన వారు 93986 68985, 93926 54657 నంబర్లను సంప్రదించాలని కోరారు.
ASR: జిల్లాలోని పీహెచ్సీల వైద్యాధికారుల అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని జిల్లా ప్రోగ్రాం మానిటరింగ్ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పీ.రాంబాబు, ఉపాధ్యక్షులుగా మణిదీపరెడ్డి, నిఖిల్, కార్యదర్శిగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని డీఎంహెచ్వో డా.కృష్ణమూర్తి అభినందించారు.
CTR: జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాన్ని ఈనెల 21వ తేదీన నిర్వహించనున్నట్లు జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవికుమార్ నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు జడ్పీ కార్యాలయంలో సమావేశం ప్రారంభమవుతుందని వెల్లడించారు. 1 నుంచి 7 స్థాయి సంఘాలతో ఆర్థిక, ప్రణాళిక, గ్రామీణాభివృద్ధి, విద్య, వ్యవసాయం తదితర అంశాలపై సమావేశం ఉంటుందని వివరించారు.
HYD: సికింద్రాబాద్ నుంచి వెళ్లే అనేక రైళ్లలో ఆక్యుఫెన్సీ రేషియో పెరుగుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే గుర్తించింది. ఈ మేరకు ఒక్కోసారి స్పెషల్ రైలులను సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా పేర్కొంది. పండుగ సమయాల్లో ప్రతి ఏడది 6 శాతం వరకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుండగా, సాధారణ పరిస్థితుల్లో 4 శాతం వరకు పెరుగుతున్నట్లు ఓ రిపోర్టులో వివరించారు.
NLG: అధిక వడ్డీ పేరుతో రూ.40 కోట్లు వసూలు చేసిన కేసులో నాగార్జునసాగర్ పోలీసులు వాడిత్య భీమా, రమేశ్, శేఖర్, సురేష్ను అరెస్ట్ చేశారు. నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ సంస్థలతో మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి మొబైళ్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిని కోర్టులో హాజరు పరిచారు. కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.