NDL: బండి ఆత్మకూరు మండలం పార్నపల్లి పాఠశాలలో సోమవారం శక్తి టీం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అమ్మాయిలు అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హెడ్ కానిస్టేబుల్ డీఎన్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, రఫీలు పాల్గొని శక్తి యాప్ వినియోగాన్ని వివరించారు. ఆపదలో ఈ యాప్ ద్వారా తక్షణ సహాయం పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో జనకాపూర్ వద్దగల క్రీడా మైదానాన్ని అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ హరితకి DYFI, KVPS ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. అనేక మంది క్రీడాకారులు క్రీడలలో నైపుణ్యం కలిగి ఉండి సరైన క్రీడ మైదానం లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మైదానాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారులకు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు.
బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 35 మంది అర్జీదారులు తమ సమస్యలను ఎస్పీ బీ. ఉమామహేశ్వర్కి వినిపించారు. అర్జీలను చట్టపరిధిలో పరిశీలించి, సంతృప్తికరంగా పరిష్కరించాలని ఆయన పోలీస్ అధికారులను ఆదేశించారు.
సత్యసాయి: చిలమత్తూరు మండలం దేమకేతిపల్లి ఎస్సీ కాలనీలో ఇవాళ సివిల్ రైట్స్ డే నిర్వహించారు. హిందూపురం రూరల్ సీఐ జనార్ధన్ ప్రజలకు సామాజిక న్యాయం, సమానత్వం, పౌర హక్కులపై అవగాహన కల్పించారు. కాలనీ వాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చట్టపరమైన రక్షణలు అందరికీ సమానమని, బాధితులకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
KDP: ఒంటిమిట్టలో ఏప్రిల్ 1న జరిగే సీతారామ కళ్యాణోత్సవం నేపథ్యంలో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి హెలిప్యాడ్, TTD అతిథి గృహం, ఆలయ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన దృష్ట్యా భద్రత, వసతి, రూట్ మ్యాప్పై అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.
HNK: శాయంపేట రైతు వేదికలో బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తహాసీల్దార్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని, త్వరలో చేపట్టబోయే హౌస్-టు-హౌస్ సర్వే ద్వారా డబుల్ (బోగస్) ఓటర్లను గుర్తించి తొలగించాలన్నారు.
చిత్తూరు రూరల్ మండలానికి చెందిన కూటమి సర్పంచులకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన సన్మానం నిర్వహించారు. ఏప్రిల్ 2తో పదవీకాలం ముగియనున్న సందర్భంగా లక్ష్మీనగర్ కాలనీలోని కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్లో శాలువాలు కప్పి సత్కరించారు. గ్రామాల అభివృద్ధికి, కూటమి విజయానికి చేసిన సేవలను ఎమ్మెల్యే ప్రశంసించారు.
BDK: బూర్గంపాడు మండలం, సారపాకకు చెందిన షేక్ మున్వర్పై గంజాయి అక్రమ రవాణా కేసుల్లో పీడీయాక్ట్ నమోదు చేశారు. పలు కేసుల్లో ప్రమేయం ఉండడంతో అతనిపై నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అడ్వైజరీ బోర్డు ఆదేశాల మేరకు ఏడాది పాటు నిర్బంధం విధించారు. మాదక ద్రవ్యాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు.
ఇండియన్ హెర్క్యులస్గా పేరొందిన కుస్తీ వీరుడు కోడి రామమూర్తి నాయుడు రిఫరెన్స్ ‘పెద్ది’ చిత్రంలో ఉండటంపై ఆసక్తి నెలకొంది. ఓటమి ఎరుగని ఆయన చరిత్రపై సినిమా తీస్తే తెలుగోడి సత్తా దేశమంతా తెలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఏనుగు బరువును మోసిన వీరుడి బయోగ్రఫీయే పెద్ది సినిమానా అనే చర్చ నడుస్తోంది. ఇదే నిజమైతే ఈ వీరగాథ వెండితెరపై మన చరిత్రను ఎలా చాటి చెబుతుందో చూడాలి.
NZB: వేల్పూరు మండలం మోతె గ్రామంలోని BC కాలని గొల్ల బండలు ఏరియాలో ఉన్న మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలకు బస్టాప్ సౌకర్యం లేకపోవటం వలన ఇబ్బందులకు గురవుతున్నారు అన్ని యువకులు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యర్థం బస్సు షెల్టర్ ఏర్పాటు చేసుకోవటానికి అనువుగా ఉన్న స్థలాన్ని కేటాయించమని గ్రామ సర్పంచ్ రమేష్ రెడ్డి, ఉప సర్పంచ్ పరంజ్యోతిలకు వినతి పత్రం అందజేశారు.
ప్రకాశం: పొన్నలూరు మండలం నాగిరెడ్డిపాలెం గ్రామ సమీపంలో సోమవారం RTC పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి పొలాలలోకి దూసుకు వెళ్ళింది. ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మంది సురక్షితంగా బయటపడ్డారు. స్టీరింగ్లో సాంకేతిక లోపం తలెత్తి బస్సు మలుపు తిరగలేదని బస్సు డ్రైవర్ తెలిపాడు. బస్సు కందుకూరు నుంచి కనిగిరికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి సోమవారం శ్రీకారం చుట్టారు. ట్రాక్ పరిసర ప్రాంతాల్లో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చుట్టుగుంట, కొరిటిపాడు వాకింగ్ ట్రాక్లకు పెండింగ్ పనులను ఈ ఏడాది ముగిసేలోపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.
PLD: పెదకూరపాడులో సంవత్సర కాలంగా సర్పంచులకు గౌరవ వేతనాలు ఇవ్వటం లేదని ముస్సాపురం సర్పంచ్ తిరుపతమ్మ ఆవేదన చెందారు. పంచాయతీ కార్యాలయానికి రావద్దని హుకుం జారీ చేయడంతో ఇంతవరకు రాలేదన్నారు. వ్యవసాయ కూలీ పనులకే పోతున్నానని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. రెండవ తేదీతో పంచాయతీ సర్పంచుల పదవి కాలం ముగుస్తుందని ఇప్పటికైనా తమ వేతనాల బిల్లు కార్యదర్శి పెట్టాలని కోరారు.
MNCL: దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభలకు తరలి రావాలని ఆ సమితి జిల్లా కార్యదర్శి పోచయ్య కోరారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలో ఆ సమితి నాయకులతో సమావేశం నిర్వహించారు. మందమర్రి పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో డీహెచ్పీఎఫ్ జిల్లా మహాసభలు ఏప్రిల్ 2న జరగనున్నాయని వెల్లడించారు. ఆ మహాసభలకు అందరూ రావాలని ఆయన కోరారు.
HYD: ఎన్నో కులాలు, ఎన్నో మతాలు, ఎన్నో భాషలకు నెలవైన ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తికి సమానమైన హక్కులున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. వారు మాట్లాడుతూ.. కొంతమంది మానవత్వాన్ని మరచి ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో ప్రవర్తిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాలంటే ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరమన్నారు. యావత్ రాష్ట్రం ఈ చట్టాన్ని స్వాగతిస్తుందన్నారు