KNR: చొప్పదండి సింగిల్ విండో ఆధ్వర్యంలో కందుల కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే సత్యం ప్రారంభించారు. రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆయన అన్నారు. చొప్పదండి సహకార సంఘం ఆధ్వర్యంలో మార్కుఫెడ్ ద్వారా వ్యవసాయ మార్కెట్ కమిటీ క్వింటాకు రూ. 8000 చొప్పున కందులు కొనుగోలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
NGKL: నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్న మహమూదా బేగం నిజాయితీపై ప్రశంసలు వస్తున్నాయి. నాగర్ కర్నూల్ వనపర్తి రూట్లో నడుస్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికురాలు ఫోన్ మరిచిపోయి బస్సు దిగిపోయింది. ఈ విషయం గమనించిన కండక్టర్ ఫోన్ను బస్టాండ్ కంట్రోలర్ సురేష్కు అప్పగించారు. అనంతరం బాధితులకు సమాచారం అందించి ఫోన్ అందజేశారు.
MDK: చేగుంట మండలంలో గృహ అవసర గ్యాస్కు ఎటువంటి కొరత లేదని తహసీల్దార్ శివప్రసాద్ తెలిపారు. చేగుంట గ్యాస్ ఏజెన్సీ కేంద్రంలో ఇవాళ ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్ముందు అవసరాలకు కావలసిన గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. గ్యాస్ విషయంలో ఎవరు భయబ్రాంతులకు గురికాకూడదని, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు.
SRD: కంగ్టిలోని లక్ష్మణ సమేత సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 51వ వార్షికోత్సవ వేడుకలు శనివారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో మహాగణపతి పూజ, పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. గోపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో శ్రీ రామనామ భిక్ష కార్యక్రమం చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని, గురువర్యుల ఆశీస్సులు పొందారు.
SDPT: నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల రూ.300కోట్ల నిధులతో పూర్తి చేశామన్నారు.
ASR: నందిగరువు మాట–మంతి కార్యక్రమంలో భాగంగా పాడేరు పర్యటనకు వచ్చిన డిప్యూటీ పవన్ కళ్యాణ్కు గిరిజన ఉద్యోగుల సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మసాడా ఈశ్వరరావు మాట్లాడుతూ.. జీవో నం.03 స్థానంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామక చట్టాన్ని అమలు చేసి 100 శాతం ఆదివాసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.
WGL: రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ రేపు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా, రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ప్రమాణస్వీకారం మహోత్సవానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆమె పిలుపునిచ్చారు.
AKP: ఎలమంచిలి మండలం పులపర్తి జనసేన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు తినిపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి తన సొంత నిధులతో ఎంతోమందిని ఆదుకున్నట్లు పేర్కొన్నారు
VZM: రెవెన్యూ ఉద్యోగుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం పట్టణ కార్యదర్శి పి. శంకరరావు అన్నారు. బొబ్బిలిలో శనివారం ఆయన మాట్లాడారు. రెవెన్యూ ఉద్యోగులు చేసిన తప్పులకు భూరికార్డులను సరి చేసుకునేందుకు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని చెప్పారు. భూరికార్డుల్లో తప్పులను సరి చేయాలంటే డబ్బులు అడుగుతున్నారని ఆయన ఆరోపించారు.
SKLM: మాదక ద్రవ్యాలపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని జిల్లా ఏఎస్పీ కేవీ రమణ శనివారం తెలిపారు. ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో మెగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 650 ఇళ్లలో తనిఖీలు చేశారు. 456 వాహనాలను పరిశీలించగా 58 వాహనాలను సీజ్ చేశారు.16 అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఘనా విద్యార్థుల ఆధ్వర్యంలో శనివారం ఘనా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని ఘనా హైకమిషనర్ గౌరవ ప్రొఫెసర్ క్వాసి ఒబిరి-డాన్సో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల సరసన నిలుస్తోందని అన్నారు.
ప్రకాశం: రెడ్డిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPO), ప్రధాన మంత్రి పంట బీమా పథకం (PMFBY), వాతావరణ ఆధారిత పంట బీమా పథకం (RWBCIS), కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పథకాల గురించి రైతులకు సమగ్రంగా వివరించారు.
సత్యసాయి: రొద్దంలోని విజయలక్ష్మి ఇండేన్ గ్యాస్ గోదామును జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదాములోని ఎల్పీజీ సిలిండర్ల నిల్వలను స్వయంగా పరిశీలించి స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. నిల్వలు, రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించారు. గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
SRPT: గ్యాస్ సిలిండర్ బుకింగ్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ నరసింహ హెచ్చరించారు. కేవైసీ అప్డేట్, సబ్సిడీ పేరుతో వచ్చే నకిలీ లింకులు క్లిక్ చేయవద్దని, తెలియని వ్యక్తులతో ఓటీపీలు పంచుకోవద్దని సూచించారు. బుకింగ్ కోసం అధికారిక యాప్లు మాత్రమే వాడాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్కు ఫిర్యాదు చేయాలని కోరారు.
NZB: ‘ప్రజా పాలన- ప్రగతి పణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్పల్లిలోని నర్సరీని ఎంపీడీవో లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రత పెరుగుతున్నందున మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించి, అవి ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.