డయాబెటిస్ రోగులు ఏ పండు తినాలన్నా ఎక్కడ షుగర్ లెవెల్స్ పెరుగుతాయోనన్న భయం వెంటాడుతుంది. అయితే కొన్ని ఫ్రూట్స్ తీయగా ఉన్నా షుగర్ని కంట్రోల్ చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యాపిల్, కమల, కివీ, జామలో షుగర్ని కంట్రోల్ చేసే పోషకాలు ఉన్నాయని వివరిస్తున్నారు. అయితే మామిడి, అరటి, లిచీ, ద్రాక్షలకు దూరంగా ఉండమే మంచిదంటున్నారు.
ధ్యానం చేయడానికి అవకాశంలేని వారికి దాని ప్రయోజనాన్ని అందించే ప్రక్రియే నిద్రకాని గాఢ విశ్రాంత స్థితి. మంద్రమైన సంగీతం వినడం. కళ్లు మూసుకుని మేను వాల్చడం వంటి చర్యలతో 10-20 నిమిషాల పాటు విశ్రాంత స్థితిలోకి వెళ్తే ఒత్తిడి హార్మోన్గా పిలిచే కార్టిసాల్ తగ్గి ఆనంద హార్మోన్ డోపమైన విడుదలవుతుంది. నాడీ వ్యవస్థ పునరుత్తేజం చెందుతుంది.
గుడ్డులోని తెల్లసొనతో చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. బాగా బీట్ చేసిన గుడ్డు తెల్లసొన, 3 టేబుల్ స్పూన్ల హెన్నా పొడి, టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెను గిన్నెలో వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుతూ పేస్ట్లా చేసుకోవాలి. దాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసి 45 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఈ సమస్య తగ్గుతుంది.
బాదంపప్పును నానబెట్టి పొట్టు తీసి తింటేనే పూర్తి ప్రయోజనం లభిస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. బాదం పొట్టులో ‘టానిన్లు’ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి బాదంలో ఉండే పోషకాలను, ముఖ్యంగా జింక్ వంటి ఖనిజాలను శరీరం గ్రహించకుండా అడ్డుకుంటాయి. పొట్టు తీస్తే ఈ పోషకాలు సులభంగా జీర్ణమవుతాయి. కాబట్టి, రాత్రంతా నానబెట్టి బాదంను.. మరుసటి రోజు పొట్టు తీసి తినడం శ్రేయస్కరం.
ముఖంపై మొటిమలు, మచ్చలను తగ్గించడంలో కలబంద కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కలబంద గుజ్జు, పసుపు, రోజ్ వాటర్ గ్రైండర్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అందులో కొంచెం శనగపిండి వేసి మరోసారి మిక్సీ పట్టుకుని.. ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసి 20 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
బెల్లం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. పరగడుపునే తింటే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో బెల్లం తీసుకుంటే మలబద్దకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఖాళీ కడుపుతో తింటే రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరిగి రక్తహీనత దూరమవుతుంది. దంతాల ఆరోగ్యానికి, ఇమ్యూనిటీ బూస్ట్, బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది.
విజేతలందరూ అత్యంత ప్రతిభావంతులు, అరుదైన నైపుణ్యాలున్నవారేమీ కాదు. వారు మనందరిలాంటి వారే. కానీ వారి ప్రత్యేకత ఏంటంటే అతిగా ఆలోచిస్తూ కూర్చోకుండా, ఏదో ఒక లక్ష్యాన్ని ఎంచుకుని దాని మీదే దృష్టిపెడతారు. కొన్నాళ్లకు అది విసుగ్గా అనిపించినా, ఆశించిన ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేకపోయినా వదిలిపెట్టకుండా స్థిరంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. చివరకు అనుకున్నది సాధిస్తారు.
మన సంపాదన పెరుగుతుంటే.. దృష్టిపెట్టాల్సిన కొన్ని అంశాలు.. 1. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచాలి2. నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి3. తల్లిదండ్రుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి4. నేర్చుకునే అంశాలపై ఖర్చుపెట్టాలి5. జీవనప్రయాణాన్ని మెరుగుపరచుకోవాలి6. చక్కటి గృహవాతావరణాన్ని ఏర్పరుచుకోవాలిఈ అంశాలన్నీ మన ఆరోగ్యంతోపాటు మన ఉత్పాదకతను పెంచుతాయి.
ప్రేమ అనేది అడిగి తెచ్చుకునేది కాదు, అది సహజంగా ఎదుటివారి మనసులో పుట్టాలి. ప్రేమించమంటూ వారిని బతిమలాడి, బలవంతం చేసినా ఆ బంధం ఎక్కువకాలం నిలవదు. ఎలా ఉన్నామో అలాగే మనల్ని అంగీకరించే వారితోనే ప్రేమ బంధం ఏర్పడాలి. ఇతరుల గౌరవం, ఇష్టాన్ని పొందడానికి ప్రయత్నించాలి తప్ప, వారి ప్రేమ కోసం ఎప్పుడూ అడగకూడదు. నిజంగా ప్రేమించేవారు తామంతట తామే వెతుక్కుంటూ వస్తారు.
తిప్పతీగలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. తిప్పతీగతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆస్తమా, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. మొఖంపై మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
రోజూ కనీసం 10 నిమిషాలు యోగా చేస్తే మంచి లాభాలు పొందవచ్చు. శారీరకంగా దృఢంగా ఉంటారు. కండరాల సామర్థ్యం పెరుగుతుంది. బలహీనంగా ఉన్న కండరాలు బలంగా మారుతాయి. శరీరం సరైన బ్యాలెన్స్ను పొందుతుంది. తూలి పడిపోకుండా ఉంటారు. వృద్ధాప్యంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది. కానీ, యోగా చేసేవారికి ఈ సమస్య రాదు. శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో ఉండే కండరాలు సైతం దృఢంగా మారుతాయి.
క్రమశిక్షణతో వ్యాయామం చేయడాన్ని శిక్షలా భావించకండి. అది మిమ్మల్ని మీరు బాధపెట్టుకునే ప్రక్రియ కాదు. మీకు స్వేచ్ఛను ప్రసాదించే దివ్య సాధనం. అలసట, బద్ధకం, అనారోగ్యాల నుంచి మీకు విముక్తి కలిగించి, రోజంతా తరగని ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది. క్రమశిక్షణతో ఉండటానికి మీకేమీ ఖర్చు కాదు. కానీ దాన్ని పాటించకపోతేనే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
కొత్తిమీర జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆకులను నమలడం లేదా వాటి నీరు తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరలో ఉండే విటమిన్ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు రాకుండా పనిచేస్తుంది. కొత్తిమీరలోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
‘టీ’ని తిరిగి వేడి చేయడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. అదనంగా యాసిడ్లు పెరుగుతాయి. దీంతో కడుపుబ్బరం, కడపులో మంట వస్తుంది. టీ పెట్టి, కొద్దిసేపు అలా వదిలేశాక తాగితే దానిలో బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశాలూ ఎక్కువే. ఇది అజీర్తికే కాదు ఒక్కోసారి జీర్ణ సంబంధ సమస్యలకీ దారితీయొచ్చు. కాబట్టి.. టీ తాగేవారు అప్పటికప్పుడు చేసుకుని తాగండి. మిగిలితే పారబోయండి.
ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం, మానసిక రుగ్మతలను నయం చేయడంలో ప్రోత్సాహం ఇవ్వడమే దీని ఉద్దేశం. శారీరకంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని ఈ రోజు గుర్తు చేస్తుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని, ఇతరుల సమస్యలను అర్థం చేసుకుని సహాయం చేయాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.