SRPT: ప్రజల భద్రతకు పెద్దపీట వేస్తామని నాగారం ఎస్సై చిరంజీవి అన్నారు. ఆదివారం ఫణిగిరి-ఈటూరు క్రాస్ రోడ్డు వద్ద వాహనదారుల సౌకర్యార్థం అవుట్డోర్ ఎల్ఈడీ ఫ్లడ్లైట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి నివారణకు ప్రజాప్రతినిధులు సహకరించాలని SI కోరారు.
BHPL: గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన నివాస సౌకర్యాలు, చిన్నారుల సంరక్షణ, పోషణ కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని MLA గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఘనపూర్ మండలం మైలారం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు, అంగన్వాడీ భవనాన్ని ఆదివారం ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో PR ఈఈ వెంకటేశ్వర్లు, సర్పంచ్ సమ్మయ్య తదితరులు ఉన్నారు.
SRCL: ఇల్లంతకుంట మండలం సిరికొండకు చెందిన భార్య భర్తలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బద్దెనపల్లి నుంచి సిరికొండ వైపు బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయని స్థానికులు తెలిపారు. వారిని ఓ ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారన్నారు. చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని దాతలు సహాయం చేయాలని కోరారు.
NLG: విద్యా నిర్విఘ్న ఫౌండేషన్ ఛైర్మెన్ బొల్గూరి ముకేశ్ తన పుట్టినరోజును ఆదివారం నార్కట్పల్లిలోని ఆదరణ వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు. ఆడంబరాలకు దూరంగా వృద్ధులకు అన్నదానం చేసి, వారితో సమయాన్ని గడిపారు. పెద్దల ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని, ఫౌండేషన్ ద్వారా మరిన్ని సామాజిక సేవలు చేస్తానని ముకేశ్ పేర్కొన్నారు.
BDK: జూలూరుపాడులో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని నాయకులు సంతకాల సేకరణ ఆదివారం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చిలుకూరి రమేష్ మాట్లాడుతూ.. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశంలో బీజేపీ శాసనసభ్యులు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి సేకరించిన రైతు సంతకాలను ముఖ్యమంత్రికి అందజేస్తామని తెలిపారు.
JGL: దుకాణ యజమానులు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని రాయికల్ మున్సిపల్ ఛైర్మన్ కటకం రవీందర్ అన్నారు. రాయికల్ పట్టణంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా దుకాణ యజమానులు, హోటల్ నిర్వాహకులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
GDWL: పుల్లూరు టోల్ ప్లాజా వద్ద హోటళ్లు, రెస్టారెంట్లలో శీతల పానీయాలు, వాటర్ బాటిళ్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. నేషనల్ హైవే పక్కన ఉన్న హోటళ్లు దోపిడీ చేస్తున్నాయని, పేద, మధ్యతరగతి ప్రయాణికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
WGL: నర్సంపేటలో రోజు రోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జీజీహెచ్ ఆసుపత్రి సూపరిండెంట్ కిషన్ సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని తెలిపారు. ఎక్కువగా నీళ్లు తాగడం, మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా జాగ్రత్త పడాలని ఆయన ప్రజలకు సూచించారు. నీరసంగా అనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు.
WGL: నెక్కొండ మండలం మడిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తేజావత్ స్వాతి-రమేష్ ఇటీవల హైదరాబాద్లో జరిగిన బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న-సుదర్శన్ రెడ్డి బాధితుడి నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
JGL: కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లో ఆవును పులి చంపినట్లు అటవీశాఖ అధికారులు ఆదివారం గుర్తించారు. పులి కథలాపూర్ మండలం తుర్తి అటవీ ప్రాంతం నుంచి కొడిమ్యాల మండలం సూరంపేట అడవుల్లోకి వెళ్లినట్టు పాదముద్రల ఆధారంగా గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. సూరంపేట అడవిలో పులి ఆవును చంపినట్లు ఆనవాళ్లు కనిపించాయన్నారు. ఈ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
MNCL: శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఆదివారం 2 బైకులు ఢీకొన్న ఘటనలో శ్రీకాంత్, మురళి అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. నస్పూర్ 108 సిబ్బంది EMT రాకేశ్, పైలట్ అరవింద్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితులను మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
MBNR: బీజేపీ అక్రమ కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని మంత్రి శ్రీహరి అన్నారు. ఢిల్లీ నిరసనలో పాల్గొన్న జడ్చర్ల నేత నరసింహ యాదవ్ నివాసానికి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డితో కలిసి వెళ్లి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. ప్రభుత్వ వేధింపులను అడ్డుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.
MHBD: కొత్తగూడ మండలం రామన్నగూడెం గ్రామ పంచాయతీలోని లాడాయిగడ్డలో నూతన CC రోడ్డు నిర్మాణ పనులను కాంగ్రెస్ మండల అధ్యక్షులు సారయ్య, సర్పంచ్ తేజవత్ పార్వతి దేశ్య నాయక్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రతి గల్లీలో మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని అన్నారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ మహాత్మ స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏపుగా పెరిగిన చెట్ల కొమ్మలు, చెత్త చెదారాన్ని తొలగించారు. సీఐ సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చిమొక్కలను స్వచ్ఛంద సంస్థ సహకారంతో తొలగించామన్నారు.
PDPL: సింగరేణి RG-1లో మంత్లీ రేటెడ్ ఉద్యోగులకు క్వార్టర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. సీనియర్ పర్సనల్ ఆఫీసర్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కాలనీలలోని ఖాళీలను గ్రేడ్ల ప్రాతిపదికన పారదర్శకంగా కేటాయించారు. సీ నుంచి ఏ గ్రేడ్ వారికి 21 క్వార్టర్లు, ఏ-1 నుంచి హెచ్ గ్రేడ్ వారికి 4 క్వార్టర్లను కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు.