MDK: మున్సిపల్ ఛైర్పర్సన్ కానుగు రాధిక భూపతి రాజ్, వైస్ ఛైర్మన్ దొంతి నరేశ్ గౌడ్లను శనివారం పీఆర్టీయూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు మేడి సతీశ్ రావు నేతృత్వంలో వారిని ఘనంగా సన్మానించి, సంఘం కార్యకలాపాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు సబ్బాని శ్రీనివాస్, సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు
MBNR: పాలమూరు యూనివర్సిటీ ఇంగ్లీష్ విభాగ విద్యార్థి అమ్తుల్ ఫాతిర్ పర్హిన్ పీహెచ్డీ సాధించారు. ప్రొఫెసర్ మనోజ పర్యవేక్షణలో ‘తెలంగాణలోని మైనారిటీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడంలో హై స్కూల్ స్థాయిలో నాన్ ఇంగ్లీష్ మీడియం ముస్లిం మైనారిటీ విద్యార్థుల సమస్యలు’ అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను పియూ డాక్టరేట్ ప్రదానం చేసింది.
HYD: నగరాన్ని కుదిపేసిన దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లకు నేటితో 13 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2013 ఫిబ్రవరి 21న జరిగిన ఈ ఘోర ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధిత కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఘటనాస్థలికి చేరుకుని మృతులకు పుష్పాంజలి ఘటించారు.
BDK: ఇల్లందు నియోజక వర్గం ముత్యాలంపాడు గ్రామంలో 293 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని వారి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదవాని సొంతింటి కల ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని, నిరుపేదలకు సన్నబియ్యం, ఫ్రీ బస్సు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
NLG: నకరికల్లు మండలం గొల్లగూడెం గ్రామ శివారులో రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి నుంచి టిప్పర్లతో కాంట్రాక్టర్లు అక్రమంగా మట్టి తరలిస్తున్నారు. అక్రమంగా తవ్వకాలు చేయడంతో భూగర్భ జలాలు దెబ్బతిని నష్టపోతామని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని మట్టి తవ్వకాలు జరపకుండా ఆపాలని కోరుతున్నారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని ఎన్టీఆర్ కాలనీలో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్య ఏర్పడడంతో శనివారం కాలనీవాసులు గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్కు సమస్య పరిష్కారానికై వినతి పత్రాన్ని అందించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. అతి తొందర్లోనే కాలనీలో తాగునీటి సమస్యను తీర్చేందుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారు.
JGL: వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే జైలు శిక్ష తప్పదని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ హెచ్చరించారు. జగిత్యాలలోని కౌన్సిలింగ్ కేంద్రంలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్ల వృద్ధుల ఫిర్యాదులపై కొడుకులను పిలిపించి విచారణ చేశారు. తల్లిదండ్రులను పోషించకపోతే 6 నెలల జైలు శిక్ష పడుతుందన్నారు.
మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలోని టోల్ గేట్ వద్ద టోల్ గేట్ కార్మికులు తమ వేతనాలు చెల్లించాలని శనివారం నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా యాజమాన్యం వేతనాలు చెల్లించకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తమ వేతనాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
నిర్మల్ జిల్లా భైంసా మండలం వాడి గ్రామానికి చెందిన కళ్యాణ్ సంతోశ్ (44) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కూలీ పనులు చేసుకునే ఆయన కొంతకాలంగా మద్యానికి బానిసయ్యారు. మద్యం మత్తులో ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడినట్లు SI సుప్రియ తెలిపారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ASF: సిర్పూర్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు గడువును మార్చి15 వరకు పొడిగించాలని రైతులు, నేతలు డిమాండ్ చేశారు. CCI కొనుగోళ్లు నిలిపివేయడంతో ఆందోళన వ్యక్తమైంది. వర్షాలు, కూలీల కొరతతో కోతలు ఆలస్యమయ్యాయని, మాజీ MLA కోనేరు కోనప్ప ఆదేశాలతో BRS నేతలు MRO మధుకర్కి శనివారం వినతిపత్రం ఇచ్చారు. మద్దతు ధరకు విక్రయించే అవకాశం కల్పించి రైతులను ఆదుకోవాలన్నారు.
HNK: హన్మకొండ జిల్లా కేంద్రంలోని గిరిజన భవనంలో ఏటూరునాగారం ITDA ఆధ్వర్యంలో మార్చి 5వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ITDA ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన గిరిజన యువతీ యువకులు ఈ ఉద్యోగ ఎంపిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
MDK: నార్సింగి కస్తూర్బాలో ఖాళీ ఉన్న అసిస్టెంట్ కుక్, స్కావెంజర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రత్యేక అధికారి మమత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని, 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలిని, అప్లై చేసే అభ్యర్థి అసిస్టెంట్ కుక్కు 10వ, స్కావెంజర్ 7వ తరగతి పాసై ఉండాలన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచలో శనివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. వందల ఏళ్ల తర్వాత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం జీర్ణోద్ధరణ జరగగా, ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో గర్భాలయంలో పూజలు చేశారు. నూతన ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేసి, గోపురాలపై కలశస్థాపన నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమనికి భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
SRPT: సమస్యలు చెప్పండి పరిష్కరించే బాధ్యత నాదని సూర్యాపేట మున్సిపల్ ఛైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్ష్యాది అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని జమ్మిగడ్డ దత్త సాయి మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఛైర్పర్సన్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.
NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని సిలార్పల్లి, తిమ్మరాసిపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సిలార్పల్లి సమీపంలోని పొలంలో దాదాపు 30 గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేయడం కలకలం రేపింది. అటు పెంపుడు కోళ్లను సైతం వదలకుండా వేటాడుతున్నాయని, అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.