BHPL: కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను ఛైర్మన్ పరిశీలించారు. లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు.
నల్గొండ: నకిరేకల్ పట్టణం సాయిబాబా గుడి సమీపంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మెకానిక్ షాప్ అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. భారీ మంటలు వ్యాపించడంతో స్థానికులు, దుకాణ యజమానులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KNR: గర్జనపల్లి గ్రామానికి చెందిన నగరపు ఆశ్రిత జాతీయ స్థాయికి ఎంపికైంది. వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న వాలీబాల్ సబ్ జూనియర్ సెలక్షన్లో సెలక్ట్ అయింది. ఈ సందర్భంగా డీవైఎస్వో రాందాస్ ఆశ్రితను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఆమె భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
MDK: టేక్మాల్ మండలంలోని ఎల్లుపేట ప్రధాన రహదారిపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. పశువుల గడ్డి లోడ్తో వెళ్తున్న లారీకి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కర్రల సహాయంతో గడ్డిని లారీ నుంచి బయటకు తోసివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
JN: బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్ అనారోగ్యానికి గురై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ క్రమంలో MLA డా.పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని ఆయనకు రూ.2లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కు మంజూరు చేయించారు. ఈ చెక్కును రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి శనివారం లబ్ధిదారు కుటుంబానికి అందించారు.
HNK: మహిళా సాధికారతే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండా సురేఖ అన్నారు. TGOS (మహిళా విభాగం) ఆధ్వర్యంలో క్యాలెండర్లను మంత్రి ఆవిష్కరించారు. ప్రభుత్వ సేవల్లో మహిళా గెజిటెడ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని, మహిళా సాధికారత, పరిపాలనలో నాయకత్వం, సమాజాభివృద్ధి దిశగా వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
WNP: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు విడుదలైనట్లు శనివారం DIEO ఎర్ర అంజయ్య తెలిపారు. ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థుల హాల్ టికెట్లను కళాశాలల లాగిన్లలో అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 12,653 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు వెల్లడించారు.
KMR: జిల్లాలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కామారెడ్డికి రానున్నారు. సాయంత్రం మూడు గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకొని ఎమ్మెల్యే రమణారెడ్డితో భేటీ కానున్నట్లు సమాచారం. ఉద్రిక్తత పరిస్థితులకు గల కారణాలను తెలుసుకోనున్నారు.
WGL: నల్లబెల్లి మండలం కొండలైయిపల్లె గ్రామంలో మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. సత్య శారద పాల్గొన్నారు. మిరప పంట కోత తర్వాత సరైన విధానంలో ఎండబెట్టడం, తేమ లేకుండా నిల్వ చేయడం ఎంతో ముఖ్యమని రైతులకు ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ నూతన వైస్ ఛైర్మన్ బొంతు సుమలత, కౌన్సిలర్లు మట్టా ప్రసాద్, బండారు శరత్ చంద్ర శనివారం TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. తమ గెలుపుకు కృషి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు. అనంతరం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపించాలని, ఆయన వైస్ ఛైర్మన్, కౌన్సిలర్స్కు శుభాకాంక్షలు తెలిపారు.
JGL: సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తెలిపారు. సీనియర్ సిటిజెన్స్, పెన్షనర్స్ సంఘాల ప్రతినిధులు ఆయనను సన్మానించారు. వయోవృద్ధుల సంరక్షణ చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ADB: పదవ తరగతి ఫలితాల్లో జిల్లాను అగ్రగామిగా నిలపాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థుల కోసం పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
BDK: మణుగూరు శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఇవాళ సందర్శించారు. ఆశా వర్కర్లతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అలాగే వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు.
వనపర్తి: దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వయం ఉపాధి, విద్య, ఉపాధి అవకాశాల కోసం రవాణా సౌకర్యం చాలా అవసరమని తెలిపారు.
వనపర్తి: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికి తీయడమే సీఎం కప్ క్రీడల ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం కప్ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.