SRPT: మునగాల మండలం ముకుందాపురం గ్రామ శివారులో ఈరోజు రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట నుంచి కోదాడ వైపు మాంసపు వ్యర్ధాలతో వెళ్తున్న టాటా ఏసీ వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనంలోని వ్యర్థాలు రోడ్డుపై పడటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
BHNG: రామన్నపేట మండలంలో సోమవారం తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యలకు దిగారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ను రామన్నపేట టౌన్ పోలీసులు అరెస్టు చేయగా, తెలంగాణ ఉద్యమ నాయకుడు బొడ్డుపల్లి లింగయ్యను హౌస్ అరెస్టు చేశారు.
KNR: జమ్మికుంట పట్టణంలో పెరుగుతున్న జనాభా దృష్ట్యా పట్టణ ప్రజలకు సౌకర్యాలు మెరుగు పరిచేందుకు మున్సిపల్ ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ పబ్లిక్ టాయిలెట్స్ను పరిశీలించారు. ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ శ్రీకాంత్ కలిసి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన టాయిలెట్స్ తనిఖీ చేసి పరిశుభ్రత, నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
NRML: ఖానాపూర్ మండలం బావాపూర్ కే గ్రామంలోని గోదావరి తీరంలో పురాతన కాటమయ్య విగ్రహాన్ని గుర్తించినట్లు ప్రముఖ చరిత్ర పరిశోధకుడు రాజ్ కుమార్ తెలిపారు. కాటమయ్య విగ్రహం కుడి చేతిలో ఖడ్గం ధరించి తలకు చిరస్థానం పెట్టుకొని బుగ్గ మీసాలతో పెద్ద చెవులతో గుర్రంపై స్వారీ చేస్తున్న రూపంలో ఈ విగ్రహం ఉంది. ఈ విగ్రహం 18వ శతాబ్ద కాలనాటికి చెందినదిగా వారు తెలిపారు.
KMR: పిట్లం మండలంలోని చిన్న కొడఫ్గల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ధర్మారం తండాకు చెందిన జాదవ్ రాజు (28) మృతి చెందారు. ఆదివారం తన వాహనం ఫైనాన్స్ కట్టడానికి బైక్పై పిట్లం వెళ్లి వస్తుండగా, బైక్ అదుపుతప్పి పొలాల్లో పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందినట్లు సోమవారం ఎస్సై వెంకట్రావు తెలిపారు.
WGL: తెలంగాణ ఉద్యమ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. హామీలను నెరవేర్చలేదని నిరసనగా నిర్వహించనున్న “చలో అసెంబ్లీ” ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా సోమవారం వర్ధన్నపేట మండలం ఇల్లంద మాజీ సర్పంచ్ సుంకరి సాంబయ్య, వేణుగోపాల్ రావు ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సొంత పూచుకత్తుపై విడుదల చేశారు.
PDPL: ఈనెల 28 నుంచి హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వాలీబాల్, క్రికెట్ పోటీలలో ఆయన తన ప్రతిభ చూపారు.
NLG: నాంపల్లిలో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగుల తాకిడి పెరుగుతున్నా, సిబ్బంది కొరత, మందుల లేమి రోగులకు శాపంగా పరిణమించాయి. గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన 30 పడకల ఆసుపత్రి హామీ ఇప్పటికీ కార్య రూపం దాల్చకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
MHBD: తొర్రూర్ మండలం ఫతేపురం గ్రామానికి చెందిన పూజారి సాయిలు (76) అనారోగ్య సమస్యల వల్ల ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న తొర్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు సోమవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
MDK: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. కడియం శ్రీహరిని “మీరు ఏ పార్టీ?” అని మాత్రమే ప్రశ్నించారని, ఇతర సభ్యులు కూడా ఇలాంటి ప్రశ్నలు అడిగిన సందర్భాలు ఉన్నప్పటికీ, కేవలం కౌశిక్ రెడ్డిపైనే చర్యలు తీసుకోవడం అన్యాయమని విమర్శించారు.
MNCL: వేసవి నేపథ్యంలో వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తు సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మంచిర్యాల విద్యుత్తు SE బి. రాజన్న ప్రకటనలో తెలిపారు. నిరంతర విద్యుత్తు సరఫరా లక్ష్యంగా 204 నూతన నియంత్రికలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అంతరాయాల నివారణకు ఇంటర్ లాకింగ్ వ్యవస్థను పటిష్ఠ పరిచామన్నారు.
WNP: రాయిగడ్డకు చెందిన జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి రాగివేణు సోమవారం ఉదయం అకాల మరణం చెందారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్కు వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు కాలుజారి కింద పడడంతో గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే వేణు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మరణంతో పార్టీకి తీరని లోటని దేవన్న సంతాపం తెలిపారు.
KNR: కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ కోసం బీఆర్ఎస్ హయాంలోనే రూ. 540 కోట్లు మంజూరయ్యాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పర్యాటక శాఖ నుంచి రూ. 100 కోట్లు, నీటి పారుదల శాఖ నుంచి రూ. 440 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ చేపడుతున్న సందర్భంగా మానేరు ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయాలని, నిధులు విడుదల చేయాలని ఇన్ఛార్జ్ మంత్రిని కోరారు.
ADB: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్, RTA ఆఫీస్ వద్ద కొనసాగుతున్న అండర్, ఓవర్ బ్రిడ్జ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. కోర్టు కేసు సమస్యలతో కొంతకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా ట్రాఫిక్ సమస్యతో సతమతమైన జిల్లా ప్రజలకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
NZB: ధర్పల్లి మండలం చల్లాగర్గాలో ఐస్ క్రీమ్ అమ్మితే రూ. 5,000 జరిమానా విధిస్తామని సర్పంచ్ గాదె నరేష్ సోమవారం స్పష్టం చేశారు. మన ఊరి పిల్లల ఉజ్వల భవిష్యత్తు, ఆరోగ్య పరిరక్షణ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామంలో ప్రత్యేకంగా ఫ్లెక్సీ తయారు చేయించి హెచ్చరిక జారీ చేశారు.