ADB: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు పకడ్బందీగా జరిగే జనగణనే దిక్సూచిగా ఉంటుందని ITDA PO యువరాజ్ మర్మాటే అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భారత జనగణన–2027 శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్తు సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందని పేర్కొన్నారు.
HNK: ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, ప్రైవేటు యూనివర్సిటీలను వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఈనెల 17,18వ తేదీలో పాలమూరు యూనివర్సిటీలో జరగబోయే యూనివర్సిటీల కన్వెన్షన్కు సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో నేతలతో కలిసి శ్రీకాంత్ ఆవిష్కరించారు.
KMM: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పెద్దమండవ సమీపంలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తాపడటంతో ఏపీకి చెందిన ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు.
KNR: ప్రస్తుత రోజుల్లో విద్యతో పాటు వివిధ రకాల నైపుణ్యాలు ఎంతో ముఖ్యమని, అప్పుడే ఉపాధి మార్గాలు లభిస్తాయని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా అన్నారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు “అకాడమిక్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం” కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేనా, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి హాజరయ్యారు.
MNCL: గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గో సంరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంఛార్జ్ సూర్యకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలో గో సంరక్షణ సమితి మండల ప్రముఖ్ అధ్యర్యంలో గో సంరక్షణ కోసం సమావేశం నిర్వహించారు. గోవధను నిషేధించాలని, గోమాతను జాతీయ ప్రాణిగా ప్రకటించాలని ఏప్రిల్ 27న తహసీల్దార్లకు వినతి పత్రాలను అందజేస్తామన్నారు.
NZB: జనగణన విధులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కలెక్టరేట్లో బుధవారం సంబంధిత శాఖల అధికారులు, తహసీల్దార్లకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2011లో చివరిసారిగా జనాభా గణన జరిగిందని గుర్తు చేశారు. వాస్తవానికి 2021లో ఈ ప్రక్రియలు చేపట్టాల్సి ఉండగా.. కరోనా వల్ల నిర్వహించలేదన్నారు.
KMM: నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు గురువారం ఉదయం 10 గంటలకు ఖమ్మంలోని అర్క రెనాల్ట్ షోరూంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి ఎన్.మాధవి తెలిపారు. ఈ మేళాలో ఫీల్డ్ సేల్స్ కన్సల్టెంట్స్, సేల్స్ టీం లీడర్స్, యూజ్డ్ కార్ ఎవల్యూటర్స్ వంటి పోస్టులకు మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
NRML: లక్ష్మణచందా మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు బుధవారం, వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. విద్యార్థులంతా బోర్డు పరీక్షలు చక్కగా రాసి, మంచి మార్కులు తెచ్చుకోవాలన్నారు. జీవితంలో గొప్ప స్థానంలో నిలవాలని తెలిపారు.
BDK: మణుగూరు మండలంలోని కూనవరం గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణానికి రూ.20 లక్షల అంచనా వ్యయంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం శంకుస్థాపన చేశారు. గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించేందుకు ఈ నూతన భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తుందన్నారు.
ASF: రెబ్బెన మండలం ఇందిరా నగర్లో ఏప్రిల్ 3న నిర్వహించనున్న మహంకాళీ జాతరకు రావాలని రామగుండం CP అంబర్ కిషోర్ ఝాను ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్ స్వామి బుధవారం ఆహ్వానించారు. రామగుండం కార్యాలయంలో సీపీని జాతర నిర్వాహకులు కలిసి శ్రీకనక దుర్గాదేవి, స్వయంభూ శ్రీమహంకాళీ దేవస్థానం విశిష్టతను వివరించారు. సభ్యులు తిరుపతి, ప్రవీణ్ పాల్గొన్నారు.
SDPT: యుద్ధాల సాకుతో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరల పెంపును విరమించుకోవాలని సీపీఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అందే అశోక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధరలు పెంచడాన్ని నిరసిస్తూ బుధవారం సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండల కేంద్రంలోని అంగడి బజార్ వద్ద జాతీయ రహదారిపై ఖాళీ గ్యాస్ సిలిండర్తో ఆందోళన నిర్వహించారు. ఇందులో స్థానికులు పాల్గొన్నారు.
KMR: నిజాంసాగర్ ప్రధాన కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. బుధవారం కాలువలో కొట్టుకొని వచ్చిన శవాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి వయస్సు సుమారు 65 సంవత్సరాలు, ఎత్తు ఐదు అడుగులు, చామనచాయ రంగు, కోల ముఖం ఉందని తెలిపారు. వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.
MHBD: ఈనెల 15వ తేదీన దంతాలపల్లిలో నిర్వహించబోయే భీమ్ దీక్ష పోస్టర్లను స్వేరోస్ నేతలతో కలిసి ఎమ్మెల్సీ తక్కల్లపల్లి రవీందర్ రావు ఆవిష్కరించారు. అనంతరం భీమ్ దీక్ష కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్సీకి స్వేరోస్ నేతలు ఆహ్వాన పత్రం అందజేశారు. భీమ్ జ్ఞాన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం, తదితర అంశాలను ఎమ్మెల్సీకి నేతలు వివరించారు.
MHBD: తొర్రూరు మండలంలోని చింతలపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో వ్యవసాయ కార్మిక గ్రామీణ పేదల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ. యాకుబ్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలని, కూలీలు పనిచేస్తున్న ప్రదేశంలో సౌకర్యాలు కల్పించడం లేదని మండిపడ్డారు.