ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఈనెల 13న మినీ జాబ్ మేళ నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఏ రవికృష్ణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10:35 గంటలకు జాబ్ మేళా ప్రారంభం అవుతుందన్నారు. ఆసక్తి గల అభ్యర్ధులు జాబ్ మేళలో పాల్గొనాలని సూచించారు. వివరాలకు 9392310323,798973351లో సంప్రదించాలన్నారు.
MLG: 99 రోజుల ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా తాడ్వాయి మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బుధవారం పారిశుద్ధ కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి సీతక్క పిలుపు మేరకు గ్రామంలో ఉన్న డ్రైనేజీ, పూడికతీత పనులను చేపట్టారు. సర్పంచ్ గద్దల నవీన్ దగ్గరుండి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
KNR: చొప్పదండి సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాలలో బుధవారం (ఆర్ఎఎస్కె) హెల్త్ క్యాంపు నిర్వహించారు. డాక్టర్ నిశ్చల, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కీర్తన ఆధ్వర్యంలో PHC సిబ్బంది బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో మెనుస్ట్రువల్ హైజీన్, HPV వాక్సినేషన్, పోషకాహారం తీసుకోవడం, ఎనీమియాను ఎదుర్కొనే విధానాలు, పర్సనల్ హైజీన్ గురించి అవగాహన కల్పించారు.
KMR: 2026లో జరగనున్న జనగణన విధుల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుతూ ఎస్జీటీ యూనియన్ సభ్యులు బుధవారం బాన్సువాడ ఎంఈవో నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. 2025 వేసవి సెలవుల్లో శిక్షణలో పాల్గొన్న వారికి ELS ప్రొసీడింగ్ ఇవ్వాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విధులు నిర్వహించిన వారికి CCL మంజూరు చేయాలన్నారు.
MDCL: ఉప్పల్ ఏసీపీ వెంకట్ రెడ్డిని ఎస్సీ–ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్లా సంతోష్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉప్పల్ పరిధిలోని పలు అంశాలను ఏసీపీ దృష్టికి తీసుకెళ్లగా, సమస్యలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
SDPT: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రధానోపాధ్యాయులుగా హారిక, డీఈవోగా దీక్షిత్, ఎంఈవోగా యశ్వంత్ పలువురు విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద , ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.
SRCL: హైదరాబాదులోని నీరా కేఫ్ 2 సంవత్సరాలు నిర్వహించడానికి టెండర్లను ఆహ్వానిస్తున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. గీత కార్మికుల సంఘాల నుంచి ఈ టెండర్లను ఆహ్వానిస్తున్నామన్నారు. ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు సిరిసిల్లలోని కలెక్టరేట్లో ఈ బిడ్లో పాల్గొనాలన్నారు.
HNK: చిట్టీలు, అధికవడ్డీ ఆశ చూపిస్తూ ప్రజల నుంచి రూ.కోట్లు సేకరించి తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. ACP సతీష్ బాబు వివరాల ప్రకారం.. కిషోర్ 2011 నుంచి ప్రభుత్వ అనుమతి లేకుండా చిట్ ఫండ్ నిర్వహిస్తూ ప్రజలనుంచి డబ్బులు సేకరించాడు. మొత్తం 117 మంది నుంచి రూ.1,49,22,000 తీసుకొని తిరిగి ఇవ్వకుండా మోసంచేయగా నేడు పట్టుబడ్డాడు.
KMM: ఖమ్మం వెలుగుమట్లలో బాధితుల కోసం అద్భుతమైన ‘మోడల్ కాలనీ’ నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో భూదాన్ భూముల్లో ఇళ్లు కోల్పోయిన 311 మంది బాధితులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉన్నారు.
NLG: నకిరేకల్ పీఏసీఎస్ మాజీ ఛైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు జన్మదినం సందర్భంగా.. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. గురువారం నకిరేకల్లోని తన నివాసంలో వెంకటేశ్వర్లును శాలువాతో సత్కరించి, మిఠాయి తినిపించి అభినందించారు. కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొన్నారు.
SRD: ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన మూడు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఉపాధి హామీ ఏపీడీకి సంగారెడ్డిలో బుధవారం వినతి పత్రం సమర్పించారు. జిల్లా కార్యదర్శి జయరాజు మాట్లాడుతూ.. మూడు నెలల నుంచి కూలీలకు బకాయిలు చెల్లించకపోవడం సరికాదని పేర్కొన్నారు. బకాయిలు చెల్లించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
NLG: చింతపల్లి మండలం మదనపురానికి చెందిన పల్లెపు రాణి(40) హైదరాబాద్ వనస్థలిపురంలో మరణించింది. ఆమె గర్భసంచి ఆపరేషన్కు ఓ హాస్పటల్కు వెళ్తే ఆపరేషన్ చేయగా.. వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిందని మృతురాలి తల్లి ఆరోపించింది. తర్వాత మరో హాస్పిటల్కు తరలించారని తెలిపింది. మృతురాలికి కొడుకు(21), కూతురు(19) ఉన్నారు. భర్త కొన్ని ఏళ్ల క్రితం చనిపోయాడు.
ADB: నేరడిగొండ మండల కేంద్రంలో సాధు సమ్మేళన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో బోథ్ MLA అనిల్ జాదవ్ పాల్గొని గ్రామస్తులు కలిసి ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. సమాజంలో సత్ప్రవర్తన తీసుకురావడానికి శ్రీ శివానంద స్వామి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ధర్మాన్ని రక్షించుటకై ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
GDWL: జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు బుధవారం ఆర్ముడ్ రిజర్వ్ (AR) పోలీసులతో ‘పోలీస్ దర్బార్’ నిర్వహించారు. సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తామని, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎస్పీ హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటిస్తూనే.. నిత్యం వ్యాయామం, యోగా ద్వారా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సిబ్బందికి సూచించారు.
NRML: కడెం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్గా విధులు నిర్వహిస్తున్న లచ్చిరాంకు తహసీల్దార్గా బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో బుధవారం కార్యాలయ సిబ్బంది ఆయనను ఘనంగా శాలువలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శారదా, సిబ్బంది ఉన్నారు.