SRD: అమీన్పూర్ మండలం ఐలాపూర్లో హైడ్రా అధికారులు శనివారం భారీ కూల్చివేతలు చేపట్టారు. ఓ రాజకీయ నాయకుడికి చెందిన గెస్ట్ హౌస్ను అక్రమ నిర్మాణంగా గుర్తించి కూల్చివేస్తున్నారు. ఈ క్రమంలో వాటర్ ట్యాంకులు, ఖరీదైన వస్తువులు ధ్వంసమయ్యాయి. ఉదయం ప్రారంభమైన ఈ ఆపరేషన్ సాయంత్రానికి పూర్తవుతుందని అధికారులు తెలిపారు.
MDCL: మౌలాలి పరిధి డిఫెన్స్ కాలనీ ఏరియాలో శానిటేషన్ బాగాలేదని ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదులు స్వీకరించి మార్చి 23వ తేదీన సమస్య పరిష్కరించినట్లు అధికారులు టిక్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ ట్వీట్ చేయడం పై జోనల్ కమిషనర్ సంచిత్ స్పందించారు. రంగంలోకి దిగి పరిసర ప్రాంతాలు పరిశీలించి, వెంటనే క్లీనింగ్ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూనే, హెచ్చరికలు జారీ చేశారు.
MBNR: ఎందరికో స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిబాపూలే అని మహబూబ్ నగర్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమ సమాజంలో అందరూ చక్కగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరికి సమన్యాయం జరగాలని పోరాడిన గొప్ప వ్యక్తి పూలే అని అన్నారు.
NLG: గట్టుప్పల్ పోలీస్ స్టేషన్లో మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహించిన ఏఎస్సై అంజయ్యను కట్టంగూరు పోలీస్ స్టేషన్కు బదిలీ నేపథ్యంలో సన్మానించారు. ఎస్సై సంజీవరెడ్డి, పోలీస్ సిబ్బంది, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. అంజయ్య సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
HYD: మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ఆధ్వర్యంలో శనివారం కాచిగూడలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మధుమేహ, కంటి, దంత వైద్య పరీక్షలను చేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.అంజనారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి వసతి గృహం ద్వారా అందించే ఉచిత వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MDK: మెదక్ బీఆర్ఎస్ కార్యాలయంలో పూలే జయంతి ఘనంగా జరిగాయి. మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బట్టి జగపతి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మల్లికార్జున్ గౌడ్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ.. మహిళా విద్యాభ్యాసం కోసం పూలే చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
MDK: అక్కన్నపేట మండలంలోని చాపగాని తండా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని డీఎల్పీవో వెంకటేశ్వర్లు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించి, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ASF: కౌటాల మండలంలోని పెట్రోల్ బంకుల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు కలెక్టర్ ఆదేశాల మేరకు ‘నో హెల్మెట్-నో పెట్రోల్’ బోర్డులను ఏర్పాటు చేశారు. శనివారం పెట్రోల్ కోసం వచ్చిన వాహనదారులకు బంకు యజమానులు అవగాహన కల్పించారు. రేపటి నుంచి హెల్మెట్ ధరిస్తేనే పెట్రోల్ పోస్తామని స్పష్టం చేశారు. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.
NRML: నిర్మల్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సోమ భీమ్ రెడ్డి శనివారం మొక్కజొన్న రైతులకు టోకెన్లు జారీ చేశారు. రబీ సీజన్లో పండించిన మొక్కజొన్నను కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర పొందాలని ఈ సందర్భంగా సూచించారు. నిర్మల్, సారంగాపూర్ మార్కెట్ యార్డుల్లో కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
JGL: పెగడపల్లి రైతుభరోసా, ఫార్మర్ రిజిస్ట్రేషన్, ఎరువుల బుకింగ్ యాప్లలో రైతులు ఒకే మొబైల్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని ఏఓ శ్రీకాంత్ తెలిపారు. వేర్వేరు నంబర్లు ఉంటే ఎరువుల కొనుగోలులో సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్నారు. ఈనెల 20వ తేదీలోగా నంబర్లను అప్డేట్ చేసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో కోరారు. నిర్దేశిత గడువులోగా రైతులు ఈ ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు.
NZB: నగరంలో మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి కలెక్టర్ ఇలా త్రిపాఠి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, బీసీ సంఘం నాయకులు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే ఆశయాలను గౌరవిస్తూ ప్రభుత్వం అనేక పథకాలను ఆయన పేరు మీద నిర్వహిస్తోందని పేర్కొన్నారు.
MNCL: మందమర్రి డివిజన్ పరిధి రామకృష్ణాపూర్లోని సింగరేణి ఏరియా ఆసుపత్రిని ఈ నెల 19, మే 17వ తేదీల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యులు సందర్శించనున్నట్లు సంస్థ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, యురాలజీ, నెఫ్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ వైద్యులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు.
PDPL: సుల్తానాబాద్ పురపాలక సంఘంలో జరుగుతున్న జనగణన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇవాళ పరిశీలించారు. హౌస్ లిస్టింగ్ బ్లాక్లకు సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. పట్టణంలో ల్యాండ్ మార్కులు పాఠశాలలు, దేవాలయాలు, కార్యాలయాలు, తదితర గుర్తులను బ్లాక్ వారీగా స్పష్టంగా నమోదు చేయాలన్నారు. ఖచ్చితమైన సమాచారం ఉండాలని అధికారులకు సూచించారు.
KMR: జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సామాజిక సమానత్వం, విద్య కోసం పూలే చేసిన కృషి ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా ఎస్పీ కొనియాడారు.
MLG: లీలా గార్డెన్లో జరిగిన డీసీసీ కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రజల సమస్యలు గ్రామాలకే వెళ్లి అక్కడే పరిష్కరిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మండలాల వారీగా గ్రామాలను సమీకరించి గ్రామసభలు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రజల మధ్య ఉండి పని చేసిన వారే నిజమైన నాయకులుగా ఎదుగుతారని అన్నారు.