MLG: గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో మహిళా సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వ్యాయాయంతో నిర్మించనున్న సమావేశ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మంత్రి సీతక్క హాజరై కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
KMM: ఖమ్మం నుంచి ఏపీలోని దేవరపల్లి వరకు నాలుగు లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ ఫీల్డ్ హైవే(ఎన్హెచ్ 365 బీజీ) ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. ఎన్ హెచ్ 65, ఎన్హెచ్ 16ను కలుపుతూ రూ.4451.87 కోట్లతో 162 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మిస్తున్నారు.
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భార్యాభర్తలకు ఒకే జిల్లాలో పోస్టింగ్లు ఇచ్చారు. HNK కలెక్టర్గా చాహత్ బాజ్పాయ్ను నియమించగా, ఆమె భర్త వరుణ్ రెడ్డి ప్రస్తుతం NPDCL CMDగా హన్మకొండలోనే విధులు నిర్వహిస్తున్నారు. అలాగే స్నేహ శబరీశ్ను మహబూబాద్ జిల్లా కలెక్టర్గా బదిలీ చేశారు. ఆమె భర్త శబరీష్ ప్రస్తుతం అదే జిల్లాకు SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
KNR: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్రం హరిబాబు ఓడిపోయినా తన హామీని నెరవేర్చుకున్నారు. వార్డులో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా రూ. 10,116 ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం యంజాల భాగ్య-వాసుల కుమార్తె శ్రావ్య వివాహానికి హాజరై నగదు అందజేశారు. ఆడపిల్ల పుడితే కూడా రూ. 10,116 మొత్తాన్ని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.
BDK: పాల్వంచ మండలంలోని గడిపాడు గ్రామంలో శ్రీ దేవి గోదా దేవి సమేత శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గురువారం ఈ పవిత్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది.
SRCL: కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో రేణుక ఎల్లమ్మ సిద్దోగం ఘనంగా నిర్వహించారు. ఐదేళ్లకోసారి జరిగే పండుగకు గీతకార్మికులు పెద్దఎత్తున హాజరయ్యారు. వేడుకలో భాగంగా ఒకే తాటిచెట్టు కల్లును కొంత మంది గీతకార్మికులు కలిసి కిందకు దింపారు. అమ్మవారికి సమర్పించే కల్లు కుండ.. మోకు, ముస్తాదుకు అంటకుండా చేతుల మీదుగా దించడం ఆనవాయితీగా వస్తోంది.
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్కు చెందిన నిరుపేద యువతి గంధం సరస్వతికి B.ED చదువు కొరకు హరికృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల స్టేషనరీని గురువారం ఆమెకు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ కంబాల నర్సయ్య మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ఉద్దేశంతో అన్ని ట్రస్ట్ తరుపున అందజేసినట్లు ఆయన తెలిపారు.
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఆ పదవిని ఫుల్ అడిషనల్ చార్జ్ (FAC)గా నిర్వహిస్తున్న రాధిక గుప్తా, ఐఏఎస్ను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
KMR: మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గురువారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్థుల ఘనంగా స్వాగతం పలికారు. ఆర్టీసీ డ్రైవర్లను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రవాణా కష్టాలు తీరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SRPT : గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామం వద్ద ఇవ్వాళ ద్విచక్రవాహనం, సైకిల్ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగాపురం గ్రామానికి చెందిన బైక్ చోదకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానికులు 108 వాహనంలో హుజూర్నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల రాంరెడ్డి, మారం మీనారెడ్డి, దూదిపాల సాగర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ లోని తన నివాసంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేయాలని వారికి సూచించారు.
BHNG: ఆలేరు పురపాలక సంఘం నూతన పాలకవర్గం గురువారం కొలువుదీరింది. నూతన ఛైర్పర్సన్గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన బీజన బాలమణి భాస్కర్ను కౌన్సిలర్ల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చిన పట్టణ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ADB: ఉట్నూర్ ఐటిడిఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న 2019 IAS బ్యాచ్ ఖుష్బూ గుప్తా బదీలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి & మెజిస్ట్రేట్గా బదీలయ్యారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గిరిజన అభివృద్ధి కోసం ఉట్నూరుకు వచ్చి POగా సేవలందించారు. దీంతో ప్రజలు ఖుష్బూ గుప్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
MHBD: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వైత్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. హన్మకొండ కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్ నూతన కలెక్టర్గా నియమితులయ్యారు. అయితే, ఆమె భర్త డా. శబరీష్ ఇదే జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించడం విశేషం.
MDK: రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో దివ్యాంగుడికి ట్రై సైకిల్ పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన చింతల రాములు అనే దివ్యాంగుడు గత కొంతకాలంగా ట్రై సైకిల్ లేక ఇబ్బంది పడుతుండడంతో స్థానిక సర్పంచ్ తార్యా నాయక్ తన సొంత నిధులతో ట్రై సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు.