KMR: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక సమర్పించారు. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన, ప్రభుత్వ పథకాల అమలు తీరును వివరించారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహించనున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంపై సీఎం దిశానిర్దేశం చేశారు.
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాతృమూర్తి జి.మంగమ్మ మంగళవారం మృతి చెందారు. విశయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు. ఫోన్ ద్వారా పరామర్శించి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించినట్లు మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
కృష్ణానది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. కృష్ణా మండలం గుడెబల్లూరు వద్ద అక్రమ రవాణా జరుగుతున్నట్లు సమాచారం అందడంతో చర్యలు చేపట్టారు. ఈ దాడిలో ఒక టిప్పర్తో పాటు ఐదు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై నవీద్ తెలిపారు.
ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా రైతులను మోసం చేస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామని చెప్పి నకిలీ బిల్లులతో ఒక్కో మొక్కకు రూ.370 వసూలు చేస్తున్నారు. తిరుమలాయపాలెం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి వారు రూ.23 వేలు కాజేశారు. దీంతో అపరిచితులకు ఫోన్పే, జీపే చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
MBNR: రాజాపూర్ మండలానికి నూతన ఎస్సైగా రాజశేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ సంఘం నాయకులు శాలువాతో సన్మానించారు. సైబర్ క్రైమ్, అపరిచిత మెసేజీలు సహా నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
NGKL: మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు బుధవారం కొల్లాపూర్కు రానున్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణమండపంలో సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రవచన కార్యక్రమం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నేత సుదర్శన్ శెట్టి తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
HYD: ఇరాన్తో HYDకు విడదీయరాని అనుబంధం ఉంది. బిర్యానీ, ఇరానీ చాయ్, హలీం, జామున్, జిలేబీ, సమోసా ఇరానీలు పరిచయం చేసినవే. గోల్కొండ, చార్మినార్ చారిత్రక కట్టడాల్లోనూ పర్షియన్ ఆర్కిటెక్చర్ కనిపిస్తుంది. ఇక్కడి తెలుగు, ఉర్దూ భాషలపైనా ఇరాన్ పదాల ప్రభావం ఉంది.
KNR: వీణవంక మండలం చల్లూరులో వెలసిన రుక్మిణి సత్య భామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి ఆలయం చుట్టూ నిర్వహించిన శకటోత్సవం (బండ్లు తిరుగుట) భక్తజన సందోహం మధ్య వైభవంగా జరిగింది. రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అలంకరించిన శకటాలపై స్వామివారు కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
BDK: జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ‘హెల్త్ మిషన్ – 100 డేస్ క్యాంపెయిన్’ కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా వైద్యాధికారి (DMHO) తుకారాం రాథోడ్ తెలిపారు. జూన్ 9 వరకు నాలుగు దశల్లో ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నేటి నుంచి ఈ నెల 31 వరకు తొలి దశ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మిగిలిన దశలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
PDPL: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో జరిగిన కలెక్టర్ల సదస్సులో పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. 99 రోజుల కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం సూచించారు. సోలార్ వినియోగాన్ని ప్రోత్సహించి, సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను గ్రామ, వార్డు సభల్లో వెల్లడించాలని ఆదేశించారు.
ADB: ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ప్రణాళిక శాఖ నోడల్ విభాగంగా వ్యవహరించే ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహించనున్నాట్లు తెలిపారు.
VKB: వికారాబాద్లోని ప్రధాన కూడళ్లు, రహదారులు విద్యుత్ దీపాలు లేక చీకటిమయంగా మారాయి. మున్సిపల్ పరిధిలోని హైమాస్ లైట్లు వెలగకపోవడంతో రాత్రివేళ వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చిన పాలకులు పట్టణ అభివృద్ధిని విస్మరించారని స్థానికులు మండిపడుతున్నారు.
KMM: బ్లోయర్లు, ఇతర పరికరాలతో మంటలను ఎలా అదుపు చేయాలో సిబ్బందికి జిల్లా అటవీ శాఖాధికారి (డీఎస్ఓ) సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ పలు సూచనలు చేశారు. ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్కును ఆయన మంగళవారం సందర్శించి అభివృద్ధి పనులను తనిఖీ చేశారు. వేసవిలో అడవులను కార్చిచ్చు నుంచి రక్షించుకోవడంపై సిబ్బంది నిర్వహించిన మాక్ డ్రిల్ను పరిశీలించారు.
గద్వాల జిల్లా అలంపూర్కు చెందిన యువ డాక్టర్ వెంకట కృష్ణారెడ్డి పెళ్లి నిశ్చయం కావడంతో కెనాడ నుంచి ఇండియాకు బయలుదేరాడు. అరబ్ దేశాల్లో తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా అక్కడే చిక్కుకుపోయాడు. దీంతో ఇంట్లో మార్చి 1న జరగాల్సిన ప్రీ వెడ్డింగ్, ఇంటి దైవాల కార్యక్రమాలు వాయిదా వేశారు. కుమారుడిని క్షేమంగా ఇండియాకు రప్పించేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని కుటంబ సభ్యులు కోరారు.
NRML: జిల్లాలో బుధవారం నుంచి ఈనెల 31 వరకు సదరం వైద్య శిబిరాలను నిర్వహించడం జరుగుతుందని డిఆర్డిఓ విజయలక్ష్మి ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్తో, ఇతర దివ్యాంగులకు వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని స్లాట్ బుక్ చేసుకుని మొబైల్కు సమాచారం వచ్చిన దివ్యాంగులు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.