SRCL: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సెస్ ఉద్యో గులు 72 గంటల విధుల బహిష్కరణ చేపట్టారు. ఈ మేరకు బుధవారం ఉదయం సిరిసిల్ల సెస్ ఆవరణలో నిరసనకు తెలిపారు. ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని, కారుణ్య నియామకాలను రెగ్యులరైజ్ చేయాలని, అసిస్టెంట్ హెల్పర్ అనే పేరును జేఎల్ఎంగా మార్చాలని డిమాండ్ చేశారు.
జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్ వద్ద సత్యహరిశ్చంద్ర శ్మశాన వాటికలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కల నాటకం, బెంచీల ఏర్పాటు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ ఛైర్మన్ సమీండ్ల వాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు బెంచీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
HYD: ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో చర్లపల్లిలోని హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్ సంస్థల్లో ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈమేరకు వాణిజ్య సిలిండర్ల వినియోగంపై కంపెనీలు నియంత్రణ విధిస్తున్నాయి. దీనివల్ల కమర్షియల్ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగి హోటల్, పరిశ్రమలకు గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో పలు ట్యాంకర్లు డిపోల వద్దే నిలిచిపోయాయి.
MHBD: నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి గ్రామానికి చెందిన దాసరి సతీష్ అదే గ్రామానికి చెందిన దాసరి నగేష్ను గత నెల 11న రాత్రి సమయంలో ఓ ఫంక్షన్ హాల్లో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ జరిపిన ఎస్సై చిర్ర రమేష్ బాబు పాత కక్షలను దృష్టి పెట్టుకుని కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. బాధితుడు నగేష్ ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు.
WGL: మిడిల్ ఈస్ట్ యుద్ధ పరిస్థితుల వల్ల ఉమ్మడి జిల్లాలో వంటగ్యాస్ సరఫరా తీవ్రంగా ఆలస్యమవుతోంది. జిల్లాలో మొత్తం 11.14 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, గతంలో 2-3 రోజుల్లో అందుకునే సిలిండర్లు ఇప్పుడు 10 రోజులకు పైగా పడుతున్నాయని డీలర్లు తెలిపారు. గ్యాస్ ధర ఒకేసారి రూ.60 పెరిగి రూ.984కి చేరుకోవడంతో పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.
JN: రైతు భరోసా నిధులు రాకపోవడంతో జిల్లా రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సరైన సమయానికి పెట్టుబడి సహాయం అందలేదని వాపోతున్నారు. గత ప్రభుత్వంలో సమయానికి రైతు బంధు పడేదని, ప్రభుత్వం మారిన తర్వాత చాలా ఇబ్బంది అవుతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని వెంటనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలన్నారు.
KMM: జిల్లా కారేపల్లి మండలంలో బుధవారం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల్లో భాగంగా పలు గ్రామపంచాయతీలలో సర్పంచులు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలంలోని భాజ్య తండాలో రహదారుల వెంట ఉన్న చెత్తను మల్టీపర్పస్ వర్కర్లతో తొలగించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ పనులు జరుగుతున్నాయని సర్పంచ్ వి. హనుమంతరావు తెలిపారు.
NLG: అప్పు విషయంలో జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఆంజనేయులు, శంభు లింగం మధ్య అప్పు విషయంలో ఘర్షణ తలెత్తింది. శంభు లింగంకు తీవ్రగాయాలు కావడంతో ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శంభు లింగం మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ADB: ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధవారం నేరడిగొండ మండల కేంద్రంలో నిర్వహించిన సాధు సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామస్తులందరూ సమిష్టిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయం అని పేర్కొన్నారు.
WGL: నర్సంపేట మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, వైస్ ఛైర్మన్ నరేందర్ గుప్తా అన్నారు. నర్సంపేట 12,13వ వార్డులలో వారు పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అభివృద్ధికి ప్రజలంతా సహకరించాలని కోరారు.
ASF: ఆసిఫాబాద్ SC గురుకులంలో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఉపాధ్యాయులు మానవత్వం చాటుకున్నారు. అదే గురుకులంలో కుక్గా పనిచేస్తున్న నిర్మలకు బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల వంట చేస్తుండగా వేడి నీళ్లు 2 కాళ్లపై పడి ఆమె తీవ్రంగా కాలిపోయింది. పేద కుటుంబానికి చెందిన నిర్మలకు ఆసుపత్రి ఖర్చులు భారంగా మారడంతో ఉపాధ్యాయులు తమకు తోచినంత సహాయం చేశారు.
GDWL: హాల్ టికెట్ కేవలం పరీక్ష గదిలోకి ప్రవేశం మాత్రమే కాదు, మీ కష్టానికి దక్కబోయే ఫలితానికి మొదటి మెట్టు అని గట్టు మండలం చాగదోన జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు రామ్మూర్తి అన్నారు. బుధవారం పదవ తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను అందజేశారు. ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒత్తిడిని అధిగమించే చిట్కాలను వివరించారు.
BDK: తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించడంపై వార్డు ప్రజలకు మున్సిపల్ ఛైర్పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర అవగాహన కల్పించారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా 14వ వార్డులో బుధవారం పర్యటించారు. స్థానిక కౌన్సిలర్ నిరుడు ఉపేంద్ర వార్డులోని పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. వార్డులో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఛైర్పర్సన్ తెలిపారు.
MDK: మాసాయిపేట మండలం పోతాన్ శెట్టిపల్లి గ్రామంలో అండర్ డ్రైనేజ్ పనులకు సర్పంచ్ ప్రశాంత్ ఆధ్వర్యంలో శంకుస్థాపన నిర్వహించారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య లేకుండా ఉండేందుకు పనులు నిర్వహిస్తున్నట్లు ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కిరణ్ నాయక్, వార్డు నెంబర్లు సందీప్ రెడ్డి, భాగ్యలక్ష్మి, ధనమ్మ , స్వామి, కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
WNP: అనారోగ్యంతో బాధపడుతున్న జిల్లాలోని మదనపురం మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ రైల్వే స్టేషన్ మాస్టర్ జేమ్స్ను దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన చికిత్స తీసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు మనోజ్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.