MNCL: మహిళా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. బుధవారం జైపూర్ మండలం ఇందారంలో కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి గ్రామైఖ్య సంఘాల భవనాలకు భూమి పూజ చేశారు. మంత్రి మాట్లాడుతూ ఈ క్రమంలో రూ. 30 లక్షల వ్యయంతో3 సమైక్య సంఘాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశామన్నారు.
NLG: రాంరెడ్డిపల్లిలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం ఓవర్ హెడ్ ట్యాంకుల క్లోరినేషన్ చేపట్టారు. సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది ట్యాంకులను శుభ్రం చేశారు. వేసవి దృష్ట్యా గ్రామస్థులు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని, వ్యాధులు ప్రబలకుండా నిల్వ నీటిని తొలగించాలని సర్పంచ్ సూచించారు.
MDK: అగ్ని ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని రామాయంపేట ఫైర్ సిబ్బంది సూచించారు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పలు ప్రైవేటు పాఠశాలలు, నివాస గృహాలు, అపార్ట్మెంట్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని ఎలా నివారించాలి, ప్రమాదంలో చిక్కుకున్న వారిని ఎలా రక్షించాలి అనే అంశంపై అవగాహన కల్పించారు.
BDK: భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణ వేడుక బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని నిత్య కళ్యాణ మండపంలో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కళ్యాణ క్రతువును జరిపించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు సమీపిస్తుండటంతో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది.
KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల పలు దశల్లో కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. యాసంగి పంటల కోసం బుధవారం రోజు ఔట్ ఫ్లో 255 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాగా 28 క్యూసెక్కులు నీరు ఆవిరిగా మారుతున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు యాసంగికి 0.652 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ నీటిమట్టం 1.820 టీఎంసీలు ఉంది.
MNCL: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మాజీ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ మాధవరపు నర్సింగరావు అన్నారు. బుధవారం కన్నెపల్లి మండలం టేకులపల్లి గ్రామ పంచాయతీలో గ్రామ సమైక్య భవనానికి భూమి పూజ నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నాయని అన్నారు.
BDK: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని బేతంపూడి సర్పంచ్ శ్రీకాంత్ కోరారు. బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో కూలీలకు ఉపాధి హామీ పనిముట్లను ఆయన పంపిణీ చేశారు. ఉపాధి హామీ కూలీలు ప్రభుత్వం నిర్దేశించిన కొలతల ప్రకారం పనులు పూర్తి చేసి గరిష్ఠ వేతనం పొందాలని వారు సూచించారు.
WGL: పర్వతగిరి మండలం చౌటపల్లికి చెందిన కొంగ రమాదేవి (48) బుధవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు కుటంబ కలహాలే కారణమని సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. భర్త ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతురాలికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.
GDWL: ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని అలంపూర్ 8వ వార్డు కౌన్సిలర్ పద్మావతి సుందర్ రాజు అన్నారు. బుధవారం వార్డులోనీ పలు విద్యుత్ స్తంభాలకు దీపాలు వెలగక ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించిన ఆమె వెంటనే స్పందించి కొత్త దీపాలను ఏర్పాటు చేయించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
KMM: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సవరణలను వ్యతిరేకిస్తూ చింతకాని మండలం రామకృష్ణాపురం పంచాయతీలో సర్పంచ్ వీరభద్రం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని మార్చుకోవాలని అన్నారు.
RR: ఆమనగల్లు PSకు నూతన SHOగా వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు ఆయనను ఇక్కడికి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేస్తానని వెంకటేశ్వర్లు తెలిపారు.
MHBD: రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు మంత్రి పొంగులేటితో వేం నరేందర్ రెడ్డి క్షుణ్ణంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
NZB: ఆర్మూర్ ప్రాంత ఎర్రజొన్న రైతులను విత్తన వ్యాపారులు సిండికేట్గా మారి మోసం చేస్తున్నారని వ్యాపారి యామాద్రి భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లుగా బైబ్యాక్ ఒప్పందాలను తుంగలో తొక్కారని, ధర తగ్గింపునకు మాజీ ఎమ్మెల్యే జీవన్ కారణమని బుధవారం ఆరోపించారు. యుద్ధం సాకుతో ధర తగ్గించారని, రైతులు తక్కువకు అమ్ముకోవద్దని కోరారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలో శంభాజీ యువసేన ఆధ్వర్యంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ 337వ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. శంభాజీ చిత్రపటానికి యువసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1689లో తీవ్రమైన మొఘల్ హింసను ధిక్కరించి ధర్మం, స్వరాజ్యం కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేశాడని వారు గుర్తు చేశారు.
SRD: హద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో మహీంద్రా సంస్థ సౌజన్యంతో రూ.17 లక్షల వ్యయంతో నిర్మించిన మరుగుదొడ్లు, వంటశాల గదిని సర్పంచ్ ప్రవీణ్, ఎంఈవో మారుతీ రాథోడ్ కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ సంస్థ తోడ్పాటునందిస్తుందని మహీంద్రా జీఎం అనిల్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలను మరిన్ని చేపట్టాలని, సంస్థ తరఫున కృషి చేస్తామని తెలిపారు.