SRD: సిర్గాపూర్ మండలం పత్యా నాయక్ తండాలో దొంగతనం జరిగిందని ఎస్సై నారాయణ ఆదివారం సాయంత్రం తెలిపారు. తండాలో నిన్న అర్ధరాత్రి గోవింద్ ఇంట్లో ఇద్దరు దొంగలు చొరబడి పెట్టె పగలగొట్టి, అందులోని 1తులం బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు అపహరించినట్లు తెలిపారు. దొంగతనం జరిగిన స్థలాన్ని పరిశీలించామని, బాధితుడు గోవింద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
ఫేక్ అకౌంట్స్, మోసాలపై అధునాతన యాంటీ-స్పామ్ వ్యవస్థను స్వదేశీ యాప్స్ ద్వారా భారత్ నిర్మించింది. 22 భారతీయ, 37 విదేశీ భాషల్లో రియల్టైమ్ అనువాదం ఉంటుందని అనువాదిని సంస్థ సీఈవో బుద్దా చంద్రశేఖర్ తెలిపారు. ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్కు టెక్నాలజీ మద్దతుగా నిలుస్తుందన్నారు. మహిళలు, విద్యార్థులు, వృద్ధుల కోసం SOS ఎమర్జెన్సీ ఫీచర్ కూడా ఉందని చెప్పారు.
SKLM: పలాస మున్సిపాలిటీ పరిధిలోని ముత్యాలమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆదివారం సాయంత్రం ఏపీటీపీసీ ఛైర్మన్ వజ్జ బాబూరావు పరిశీలించారు. పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని అధికారులను సూచించారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే గౌతు శిరీష కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
RR: తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 8.22% నిధులు మాత్రమే కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ద్రోహం చేసిందని AIFDS రాష్ట్ర అధ్యక్షుడు పల్లె మురళి విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 15% నిధులు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు నామమాత్రపు కేటాయింపులతో సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
NGKL: ఎర్రవల్లి ముంపు బాధితులు ఆదివారం హైదరాబాద్లో ఎంపీ మల్లు రవిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. రిజర్వాయర్ ముంపు నుంచి మినహాయింపు కోరుతూ.. 100 రోజులుగా దీక్ష చేస్తున్నామని, న్యాయం చేయాలని వేడుకున్నారు. పార్లమెంట్ సమావేశాల అనంతరం సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
MLG: వెంకటాపురం మండల కేంద్రంలో తుడుందెబ్బ సంఘం నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్ కుమార్ అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మహబూబాబాద్ సమావేశానికి వెళ్తుండగా తాడ్వాయి పోలీసులు మార్గమధ్యంలో అరెస్టు చేయడం అన్యాయమని మండల అధ్యక్షుడు తుర్స చంటి దొర తెలిపారు. ఆదివాసి కోసం పోరాడుతున్న నేతలను అరెస్టు చేయడాన్ని ఖండించారు.
MDK: మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన తల్లి కూతుర్లు అదృశ్యమైనట్లు చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. ముక్క స్రవంతి(25), ఏడాది వయసున్న కూతురుతో కలిసి ఈనెల 18న ఇంట్లోంచి బయటకు వెళ్లినట్లు తెలిపారు. అప్పటి నుంచి కనిపించకుండా పోయినట్లు ఎస్సై వివరించారు. భర్త ముక్క నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
TG: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని అర్బన్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయాంలోనే పేదలకు సొంతింటి కల సాకారం అవుతుందన్నారు.
BHNG: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఆదివారం వివేరా హోటల్లో జరిగిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొమ్మలరామారం మండలానికి చెందిన దానావత్ సునీత రవీందర్ నాయక్కు ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శిగా మహేష్ గౌడ్, ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదగా పత్రాన్ని అందుకున్నారు.
శర్వానంద్ హీరోగా.. దర్శకుడు అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘బైకర్’. APR 3న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్పై ఇలాంటి సినిమా చేయలేదు. తీయలేదు, చూడలేదు. ఈ సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టాను. మరోసారి చెబుతున్నా బైకర్ బంపర్హిట్ అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశాడు.
ADB: సిర్పూర్(యు) ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గేడం బావ్రావ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ జీర్లగట్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి, మృతుడి కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. బావ్రావ్ మరణం పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
HNK: బీజేపీ పార్టీ కార్యకర్తలు నిస్వార్ధంగా సైదాంతిక నిబద్ధతతో పనిచేయాలని కంటెస్టెడ్ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు పగడాల కాళీప్రసాద్ రావు అన్నారు. ఆత్మకూరు మండల దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్లాలని, బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
BHPL: మండల కేంద్రంలోని పాత మార్కెట్ యార్డ్ సమీపంలో లారీ అసోసియేషన్ వద్ద భారీ డీజిల్ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 7 లారీల డీజిల్ ట్యాంకులను పగులగొట్టి సుమారు 350 లీటర్ల డీజిల్ దొంగిలించినట్లు అధ్యక్షుడు దానవేణ రమేష్ తెలిపారు. ఈ ఘటనతో లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు.
JN: రైతు కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యమని జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శివరాజు యాదవ్ అన్నారు. నర్మెట్టలో నిర్వహించిన రైతు సంబరాలకు రైతులతో కలిసి ఛైర్మన్ హాజరయ్యారు. రైతు సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తూ రైతును రాజు చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు.
ADB: ఈనెల 27వ తేదీ నుంచి కందుల కొనుగోలును కేంద్ర ప్రభుత్వ సంస్థ నాపేడ్ పూర్తిగా నిలిపివేసినట్లు ఆదిలాబాద్ మార్క్పెడ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ రెడ్డి ఆదివారం తెలియజేశారు. ఈనెల 26వ తేదీ వరకు రైతులు తమ కంది పంటను మార్కెట్ యార్డు తీసుకురావాలని సూచించారు. జిల్లా రైతులు విషయాన్ని గమనించి సహకరించాలని ప్రవీణ్ రెడ్డి కోరారు.