BHPL: మహదేవపూర్ మండలంలోని సూరారంలో మాజీ స్పీకర్ శ్రీపాదరావు వర్ధంతిని నిర్వహించారు. సర్పంచ్ శంకరమ్మ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, నేతలు శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శ్రీపాదరావు చూపిన బాటలో నడుస్తూ వారి ఆశయసాధనకు ప్రతి ఒక్కరం కృషి చేస్తూ ముందుకు సాగాలని వారు అన్నారు.
SDPT: సిద్దిపేట రైతు బజార్లో కూరగాయల ధరలు భారీగా తగ్గడంతో సామాన్యులకు ఊరట లభించింది. బీన్స్, చిక్కుడు మినహా దాదాపు అన్ని రకాల కూరగాయలు కిలో 25 రూపాయలలోపే లభిస్తున్నాయి. టమాట రూ.16, క్యాబేజీ రూ.10 పలుకుతుండగా, ధరలు అందుబాటులోకి రావడంతో వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఆకాశాన్నంటిన ధరలు ఇప్పుడు సామాన్యుడికి చేరువయ్యాయి.
KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్, అల్లీపూర్లో అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూర్లో 41.3°Cగా నమోదైంది. కరీంనగర్ జిల్లా గంగాధర, పెద్దపల్లి జిల్లా మల్యాలపల్లిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 41.2°Cగా నమోదయ్యాయి. ఈ మేరకు ఎండలో బయటకు వెళ్ళవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
MBNR: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఎస్పీ డి. జానకి ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 99 రోజుల పాటు సాగే ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యం అని అన్నారు. నిబంధనలు పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
TG: రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల కోసం ‘దోస్త్’ 2026-27 నోటిఫికేషన్ విడుదలైంది. ఈనెల 15 నుంచి మే 7 వరకు మొదటి విడత రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. ఈనెల 30 నుంచి వెబ్ ఆప్షన్లు ప్రారంభం కానుండగా, మే 14న సీట్లను కేటాయిస్తారు. మే 15 నుంచి రెండో విడత, మే 31 నుంచి మూడో విడత ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు ఈ గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో ‘పెద్ది’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా ఈ మూవీలో సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదే నిజమైతే ‘ఎవడు'(2014) చిత్రం తర్వాత దాదాపు 12 ఏళ్లకు రామ్ చరణ్, సాయి కుమార్ మళ్లీ కలిసి నటిస్తున్నట్లు అవుతుంది. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.
RR: చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ దంపతులు, మధ్యప్రదేశ్లో ఉన్న మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకోవడం సంతోషం కలిగించిందని అన్నారు. శంకర్పల్లి మున్సిపల్ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నారు.
GNTR: రాష్ట్ర రాజధానిలోని SRM యూనివర్సిటీలో మంగళవారం జరగనున్న క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. సోమవారం ఆయన SRM తదితర ప్రాంతాల్లో పర్యటించి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.
NRPT: “Arrive Alive” లో భాగంగా హిందూపురంలో ఉపసర్పంచ్ వాకిటి బాబు ఆధ్వర్యంలో సోమవారం రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి మహేష్, పోలీసులు కలిసి ప్రజలకు ట్రాఫిక్ నియమాలను వివరించారు. హెల్మెట్, సీటుబెల్టు ధరించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని సూచించారు. అతివేగం, మొబైల్ ఫోన్ వాడటం వల్ల జరిగే ప్రమాదాల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు.
AP: మంత్రి నారా లోకేష్ రాష్ట్ర కూటమి ఎంపీలతో పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అమరావతి బిల్లుకు త్వరగా ఆమోదం తెలిపి, దానికి చట్టరూపం కల్పించిన నేపథ్యంలో ముర్ముకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి వివరించారు.
JN: లింగాల గణపురం (M) కొత్తపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామ సర్పంచ్ గాదపాక విష్ణు అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. గ్రామ ఉపసర్పంచ్ జహంగీర్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అధికారులు ఉన్నారు.
సత్యసాయి: గుంతకల్లు మండలం కసాపురం జడ్పీ హైస్కూల్ విద్యార్థిని కావలి జ్యోతి రూపొందించిన ‘సోలార్ మల్టీపర్పస్ పోర్టబుల్ టెంట్’ ప్రాజెక్టు అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ క్రమంలో జపాన్ దేశం నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. జ్యోతి రూపొందించిన టెంట్ ద్వారా తల్లులు శిశువులకు పాలు పట్టవచ్చు. అలాగే సోలార్ వెలుతురులో బస చేయవచ్చు.
SRCL: ఇల్లంతకుంట మండలం నేడురేపాకలో సర్పంచ్ మల్లేశం ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంపై ఎస్సై లక్పతి, కార్యదర్శి ప్రవీణ్ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి పౌరుడు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరుతూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
VKB: కుల్కచర్ల మండల కేంద్రంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ సర్పంచ్ అంజిలయ్ తో కలిసి సోమవారం పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున కూలీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. పని ప్రదేశాల్లో కూలీల కోసం మంచినీరు, నీడ వంటి సౌకర్యాలు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఎండ దెబ్బ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
NLG: చిట్యాల పట్టణంలో సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు దుకాణ సముదాయాలను సందర్శించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ఎండి.అక్బర్ మాట్లాడుతూ.. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో సీపీఐ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. విరాళాలు అందించి సహకరించాలన్నారు.