TVK పార్టీ అధినేత విజయ్ ఆఖరి చిత్రం ‘జననాయగన్’ చుట్టూ ఉన్న వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు మరో భారీ షాక్ తగిలింది. ఈ మూవీ ఓటీటీ ఒప్పందాన్ని అమెజాన్ ప్రైమ్ రద్దు చేసుకుంది. సెన్సార్ వివాదాల వల్ల సినిమా రిలీజ్ ఆలస్యం అవుతోందన్న కారణంతో ఆ సంస్థ ఈ డీల్ నుంచి తప్పుకుంది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను అమెజాన్ రూ.120 కోట్ల భారీ ధరకు సొంతం చేసుకున్న విషయం తెలిసింది.
టాలీవుడ్లో ఈ వారం సందడి లోపించింది. మార్చి రెండో వారంలో ఒక్క కొత్త సినిమా కూడా విడుదల కాకపోవడం గమనార్హం. గత వారం వచ్చిన మూవీలు ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో థియేటర్ల వద్ద జనం తగ్గారు. దీంతో పాత సినిమాలే తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాయి. అయితే మార్చి 19న ఉగాది సందర్భంగా రానున్న భారీ సినిమాలపైనే ఇప్పుడు ఇండస్ట్రీ ఆశలన్నీ ఉన్నాయి. అప్పటివరకు బాక్సాఫీస్ వెలవెలబోనుంది.
మార్చి 19న ‘ధురంధర్ 2’ రిలీజ్ కానున్న నేపథ్యంలో పార్ట్-1 రీ-రిలీజ్తో థియేటర్లలో రచ్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా 500 స్క్రీన్లలో ఈ సినిమా సందడి చేస్తోంది. ఇండియాలో ఈరోజే (మార్చి 12) 250 థియేటర్లలో గ్రాండ్గా రీ-రిలీజ్ అయింది. ఓవర్సీస్లోని థియేటర్లలో రేపటి నుంచి ఈ మూవీ మరోసారి సందడి చేయనుంది.
హిందీ బిగ్బాస్ 19 విజేత గౌరవ్ ఖన్నాకు ఇంకా రూ.50 లక్షల ప్రైజ్మనీ అందలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ.. షో ముగిశాక నగదు చేతికి రావడానికి ఇంటర్నల్ ఆడిట్స్, పేపర్ వర్క్ వంటి సుదీర్ఘ ప్రక్రియ ఉంటుందని తెలిపాడు. టీవీ రంగంలో పేమెంట్స్ 1-2 నెలలు ఆలస్యం కావడం సహజమేనని, తన డబ్బులు కచ్చితంగా వస్తాయని ధీమా వ్యక్తం చేశాడు.
‘డెకాయిట్’లో ‘కన్నెపిట్టరో’ రీమిక్స్ వివాదంపై నిర్మాత సుప్రియ స్పందించింది. ఈ పాట హక్కులు ఆదిత్య మ్యూజిక్ వద్ద ఉన్నాయని, వారి నుంచి అధికారిక అనుమతి తీసుకున్నామని క్లారిటీ ఇచ్చింది. సంగీత దర్శకుడు కోటిని వ్యక్తిగతంగా కలిసి మాట్లాడటంతో వివాదం సద్దుమణిగిందని తెలిపింది. సంగీత దర్శకుడు గ్యాని ఈ పాటను అద్భుతంగా రీమిక్స్ చేశారని, ఇది మూవీకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పింది.
యంగ్ హీరోయిన్ల ప్రతిభపై సీనియర్ నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేటి నటీమణులు చాలా స్మార్ట్గా ఉంటున్నారని, సెట్స్కు రాకముందే మేకప్, కాస్ట్యూమ్స్ వంటి విషయాల్లో పూర్తి హోంవర్క్ చేసుకుంటున్నారని కొనియాడారు. వారి ప్లానింగ్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందని, నిజానికి సీనియర్లమే వారి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆమె ప్రశంసించారు.
నటి రాధికా శరత్ కుమార్ మూవీ టికెట్ల ధరలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘తాయి కిళవి’ సక్సెస్ మీట్లో మాట్లాడుతూ.. కేవలం రూ.150 టికెట్తోనే తమ మూవీ రూ.60 కోట్లు వసూలు చేసిందని తెలిపింది. కొందరు స్టార్ హీరోలు టికెట్ ధరలను రూ.1500-2000 వరకు పెంచుతున్నారని, ఆ లెక్కన చూస్తే తక్కువ ధరతో ఎక్కువ వసూళ్లు సాధించిన తమదే అసలైన విజయమని స్టార్ హీరోలకు పరోక్షంగా చురకలు అంటించింది.
దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘ధురంధర్ 2: ద రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రూ.1,500 – 2,000 కోట్లు వసూలు చేయడం ఖాయమని చెప్పాడు. అదే జరిగితే సౌత్ సినిమాలన్నీ తోక ముడవాల్సిందేనని అన్నాడు. సౌత్ యాక్షన్ చిత్రాలు పాత కథనాలతోనే సాగుతున్నాయని, కానీ ‘ధురంధర్’ సిరీస్ బాలీవుడ్ యాక్షన్ను సరికొత్త స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నాడు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తమిళ లెజెండ్ MGRపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరో విశాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కాంతారావుని పొగడటం కోసం, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, లెజెండరీ నటుడు MGRని తక్కువ చేయడం సరికాదని ట్వీట్ చేశాడు. ఒక లెజెండ్ను గౌరవిస్తూనే మరో మహానుభావుడిని అవమానించడం బాధాకరమని, ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ స్పష్టతనిస్తూ క్షమాపణలు చెప్పాలని విశాల్ కోరాడు.
అక్కినేని నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ కోసం సరికొత్త మేకోవర్తో ఆకట్టుకుంటున్నాడు. ‘తండేల్’ చిత్రంలో డీ గ్లామ్ లుక్లో కనిపించిన చైతు.. ఈ సినిమా కోసం పూర్తి స్టైలిష్గా మారిపోయాడు. తాజాగా ఆయన షేర్ చేసిన ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. అందులో జిమ్ నుంచి షేర్ చేసిన 6 ప్యాక్ బాడీ పిక్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. డంబెల్స్ పట్టుకుని బల్క్ బాడీతో కనిపిస్తున్నాడు.
ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ లుక్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఫొటో తెగ వైరల్ అయింది. వెనుక నుంచి ఉన్న ఆ ఆకృతి ప్రభాస్దేనని ఫ్యాన్స్ భ్రమపడ్డారు. అయితే, ఆ ఫొటో ప్రభాస్ది కాదని, తనది అని నటుడు శివ గణేష్ క్లారిటీ ఇచ్చాడు. అది ఎలా ప్రభాస్ ఫొటోగా వైరల్ అయిందో తనకు అర్థం కాలేదని, వెనక నుంచి చూస్తే లుక్స్ అలాగే ఉన్నాయని చాలామంది చెప్పారని తెలిపాడు. దీంతో ఈ వార్తలకు చెక్ పడింది.
దర్శకుడు హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్లో క్రేజీ విషయాన్ని పంచుకున్నాడు. పవన్ కళ్యాణ్ క్లాసిక్ ‘ఖుషి’కి సీక్వెల్ లైన్తో ‘భవదీయుడు భగత్ సింగ్’ కథను సిద్ధం చేసినట్లు తెలిపాడు. విడిపోయిన హీరో హీరోయిన్లు ఒకే కాలేజీలో లెక్చరర్లుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్పై ఏడాది పాటు వర్క్ చేసినట్లు చెప్పాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్...
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు కోలీవుడ్లో దుమారం రేపుతున్నాయి. దివంగత నటుడు కాంతారావును పొగిడే క్రమంలో, తమిళ లెజెండ్ MGRపై ఆయన చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయని ‘నడిగర్ సంఘం’ మండిపడింది. ఒకరిని గౌరవించడానికి మరొకరిని కించపరచడం సరికాదని, రాజేంద్రప్రసాద్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ వివాదం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉందన్న వార్తలపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ మరోసారి స్పందించాడు. తనకు ఆ ఫైల్స్తో ఎలాంటి సంబంధం లేదని, అసలు ఆ ఈమెయిల్స్ గురించి తనకు తెలియదని స్పష్టం చేశాడు. తాను ఎప్పుడూ బీజింగ్కు వెళ్లలేదని, అనవసరంగా తన పేరును ఈ వివాదంలోకి లాగారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు ఆ పత్రాల్లోని వివరాలకు తనకు సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పాడు.
శర్వానంద్, శ్రీను వైట్ల కలయికలో మైత్రీ మూవీ మేకర్స్ ఒక యాక్షన్ కామెడీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు టాక్. ఇందులో అనంతిక సనిల్కుమార్ హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. జూన్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి, 2027 సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.