PLD: నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ ప్రవేశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ రవికుమార్ ఉన్నత విద్య ప్రాముఖ్యతను వివరించారు. ఇతర అతిథులు పీజీ కోర్సులు, అడ్మిషన్ విధానం, పరిశోధన అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ATP: అనంతపురం మార్కెట్ యార్డ్ గెస్ట్ హౌస్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను చైర్పర్సన్ బల్లా పల్లవి సమీక్షించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అతి త్వరలోనే అన్ని సౌకర్యాలతో దీనిని రైతులకు, వ్యాపారస్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పనుల పురోగతిని స్వయంగా పరిశీలించి తగిన సూచనలు చేశారు.
AKP: పరవాడ మండలం తాడి సమీపంలో రాంకీ యాజమాన్యం రసాయనిక వ్యర్థాలను నిల్వ చేయడానికి తవ్వుతున్న చెరువును వెంటనే మూసివేయాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం లంకెలపాలెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. భూగర్భ జలాలు ఇప్పటికే కాలుష్యం అయినట్లు పేర్కొన్నారు. చెరువుకు అనుమతిస్తే కాలుష్యం మరింత పెరుగుతుందన్నారు.
కృష్ణా: మొవ్వ మండలం అవురుపూడి గ్రామంలో వేసవి తీవ్రత దృష్ట్యా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ‘వేసవిలో ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం మన బాధ్యత. ప్రతి గ్రామంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలి’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
NTR: ఏ. కొండూరు(M) కేజీ తండాలోని అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ వాహిని చారిటబుల్ ఫౌండేషన్ అసోసియేషన్ సభ్యుడు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లి-శిశు ఆరోగ్యం, పిల్లల మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ నుంచే సమతుల్యమైన పోషకాహారం ఎంతో అవసరమని తెలిపారు.
పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లాను మంగళవారం సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఆమెతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిపై ఇరువురు చర్చించారు. సత్తెనపల్లికి చెందిన పలు కీలక సమస్యలను ఆయన కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
KDP: దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 29వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. స్వామి వారు అమ్మవారి పుష్కరినిలో ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిస్తారన్నారు. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమాలకు భక్తులు విరివిగా పాల్గొనాలని టీటీడీ అధికారులు అన్నారు.
KRNL: ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలోని సర్వే నంబర్ 1300/1లోని 43 ఎకరాల భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని జిల్లా సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మురళీకృష్ణకు జాతీయ మాల మహానాడు సంఘం వినతి పత్రం సమర్పించారు. 25 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ నెల 30లోపు సర్వే పూర్తి చేసి హద్దులు ఏర్పాటు చేస్తామన్నారు.
NLR: విడవలూరు మండల పరిధిలోని ఊటుకూరు పెద్దపాళెం మత్స్యకార గ్రామ పెద్దలు తమ నూతన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ మత్స్యకార సంఘం పెద్ద కాపుగా ఆడంగారి కనకయ్య, నడిం కాపుగా కొండూరు ఏడుకొండలు, చిన్న కాపుగా కొండూరు అమరేంద్ర, క్యాషియర్గా పాపారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మంగళవారం ఘనంగా సన్మానించారు.
KKD: గ్రామాల్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ అహర్నిశలు శ్రమిస్తున్న వెలుగు VOAల సేవలు వెలకట్టలేనివని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ పేర్కొన్నారు. ప్రత్తిపాడులోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 185 మంది వెలుగు VOA లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు పారదర్శంగా అమలు జరగాలన్నారు.
TPT: వరదయ్యపాలెం(M) రాచర్లలో బుధవారం ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మంత్రి, ఎమ్మెల్యే వరదయ్య పాలెం మండలం రాచర్లకు చేరుకొని రూ.125.30 కోట్లతో నూతనంగా నిర్మించిన 220/132/33 KV విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఎమ్మెల్యే కోరారు.
BPT: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసీపీ కాంగ్రెస్ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి కోరారు. ఎండ తీవ్రత వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయే ప్రమాదం ఉన్నందున, దాహం వేయకపోయినా తరచుగా మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలని ఆయన సూచించారు.
TPT: సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం MAO కార్యాలయంలో ప్రకృతి వ్యవసాయంపై రెండు రోజుల శిక్షణ ప్రారంభమైంది. నవ సార్వత్రిక సూత్రాల ప్రాముఖ్యతను వివరిస్తూ, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడంపై అధికారులు రైతులకు అవగాహన కల్పించారు. రసాయనాల వినియోగం తగ్గించి, భూసారాన్ని ఎలా కాపాడుకోవాలో వివరించారు. సాగులో ప్రకృతి పద్ధతులు పాటిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని కోరారు.
CTR: మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని సీఐ గోపి పేర్కొన్నారు. పూతలపట్టులో అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, వెలుగు సభ్యులకు పోలీసు సిబ్బంది మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. బాల్య వివాహాల నివారణ, రోడ్డు ప్రమాదాలు మత్తుపదార్థాల అనర్థాలపై వివరించారు. అత్యవసర సమయాలలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
సత్యసాయి: పెనుకొండ మండలంలో పెట్రోల్ బంక్ యజమానులతో ఎస్పీ సతీష్ కుమార్ మంగళవారం సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగమే ప్రమాదాలకు కారణమని హెచ్చరించారు. 2025లో జిల్లాలో 355 ప్రమాదాల్లో 185 మంది మృతి చెందినట్లు తెలిపారు.