SKLM: టెక్కలి మండలం పరశురాంపురం గ్రామంలో పోషణ పక్వాడా కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీవో సవర సరస్వతి పాల్గొని, 0-6 సంవత్సరాల లోపు పిల్లలు మేధాభివృద్ధి 90% జరుగుతుందన్నారు. కనుక ప్యాకెట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ లాంటివి అస్సలు పెట్టకూడదు వాటికి బదులుగా పోషక విలువలతో కూడిన ఆహారాన్ని పిల్లలకు పెట్టాలని సూచించారు.
W.G: వరి సాగులో రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సహాయ వ్యవసాయ సంచాలకులు కే.శ్రీనివాసరావు సూచించారు. శనివారం మోగల్లు రైతు సేవా కేంద్రంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అధిక ఎరువుల వినియోగంతో భూసారం దెబ్బతింటుందని హెచ్చరించారు. వేసవిలో సేకరించే మట్టి నమూనాల ఫలితాల ఆధారంగానే ఎరువులు వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో సంధ్య, రైతులు పాల్గొన్నారు.
CTR: మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు మామిడి రైతుల పాలిట శాపంగా మారాయి. హార్ముజ్ జలసంధి దిగ్బంధం కారణంగా జిల్లా నుంచి విదేశాలకు వెళ్లాల్సిన మామిడి ఎగుమతులు నిలిచిపోయాయి. ఫిబ్రవరి నుంచే ప్రారంభం కావాల్సిన ఎగుమతులు యుద్ధం వల్ల నౌకలు సముద్రంలోనే నిలిచిపోవడంతో ఆగిపోయాయి. ఎగుమతులు జరగకపోతే కాయలను చెట్లకే వదిలేయాల్సిన దుస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
VSP: మహిళా బిల్లు ఆమోదం పొందకపోవడం కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లేని రాజకీయ డ్రామా అని భారత సమాజ్ డెవలప్ పార్టీ అధ్యక్షుడు చింతాడ సూర్యం విమర్శించారు. డీలిమిటేషన్ పేరుతో బిల్లును ఆలస్యం చేసి మహిళలను మోసం చేశారని ఆరోపించారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ప్రభుత్వం సమన్వయం చేయలేకపోయిందన్నారు.
VZM: జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హార్టివిజన్ కార్యక్రమం ద్వారా ఎనిమిదివేల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అందుకు గాను అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి వీసీ ద్వారా మండలాల్లో ఉన్న ఉద్యాన, వ్యవసాయ, విద్యుత్, రెవిన్యూ శాఖాధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
KRNL: రామదుర్గంలో బాల్య వివాహాల నిర్మూలన లక్ష్యంగా ఐసీడీఎస్ సీడీపీవో నరసమ్మ, సూపర్వైజర్ వీరమ్మ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శనివారం కళాకారుల పాటలు, నాటికల రూపంలో బాల్య వివాహాల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజలకు వివరించారు. చిన్న వయసులో వివాహాలు బాలికల ఆరోగ్యం, విద్యావకాశాలు, జీవిత భవిష్యత్తు ఎలా దెబ్బతీస్తాయో చాటి చెప్పారు.
ప్రకాశం: ఒంగోలులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద రూ.1.20 కోట్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ను అత్యంత వేగంగా పరిష్కరించింది. ప్రమాదంలో మరణించిన ఏపీ సచివాలయ ఉద్యోగి పొదిలి భార్గవనాథ్ కుటుంబానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ఈ చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులందరూ ఇలాంటి ఇన్సూరెన్స్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NTR: జి.కొండూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అంకెమ్ ఇందిరా ప్రియదర్శిని, పలువురు నాయకులతో కలిసి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైనందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. మీ నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉందని, మైలవరం నియోజకవర్గంలో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని కొనియాడారు.
PLD: ముప్పాళ్ల మండలం పలుదేవర్లపాడు గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ప్రత్యేక అధికారి కేవీ శివప్రసాద్ పాల్గొన్నారు. గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, కాలువల మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు కోరారు. కార్యక్రమంలో అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలం భాకరాపేటలోని మూడు రోడ్ల కూడలి వద్ద గల గంగమ్మ తల్లి జాతర రేపు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. అమ్మవారికి మహిళలు వేకువజామునే బోనాలు సమర్పిస్తారని వారు తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం గంగమ్మ తల్లి అని వెల్లడించారు. అమ్మవారి జాతరకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
కృష్ణా: గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్ రావు సచివాలయాల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామవరప్పాడు, ప్రసాదంపాడు సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది గైర్హాజరు, రిజిస్టర్ల లోపాలను గుర్తించారు. జనాభాకు తగ్గ సిబ్బంది లేకపోవడం, సేవలు తక్కువగా అందడంపై అసంతృప్తి తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
NDL: ప్యాపిలి మండలంలోని సిగురుమన సర్కిల్ సమీపంలో ‘మన గ్రోమోర్’ నూతన వ్యవసాయ దుకాణాన్ని మండల వ్యవసాయ అధికారి రాకేశ్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, సలహాలు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఆపరేషన్ మేనేజర్ ధనుంజయ్, మార్కెటింగ్ ప్రతినిధి గిరి, స్టోర్ మేనేజర్ రాయల్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు.
అన్నమయ్య: జీవామృతంతో విత్తనాలను శుద్ధి చేస్తే మొలకల శాతం పెరుగుతుందని ఎన్ఎఫ్ఐ యశోదమ్మ తెలిపారు. ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులకు ప్రకృతి వ్యవసాయం, జీవామృతం, కషాయాల తయారీపై అవగాహన కల్పించారు. ఈ విధానాలతో నేల సారం పెరిగి, పంటలకు మంచి దిగుబడులు వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
SKLM: వేసవి నేపథ్యంలో ఎండలు తీవ్రత పెరుగుతున్న తరుణంలో శీతల పానీయాలకు స్థానికంగా తయారు చేసే బాదంపాలకు అత్యధిక డిమాండ్ ఉంటుందని వీటిని సరైన పద్ధతిలో తయారు చేయాలని ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి జి. శ్రీరాములు పిలుపునిచ్చారు. శనివారం టెక్కలి మేజర్ పంచాయతీ పరిధిలో పలు బాదం పాలు తయారీ యూనిట్లను పరిశీలించారు.
VZM : బావి తరాల కోసం నీటి సంరక్షణకు ఇప్పటినుంచే కృషి చేయాలని డీఎల్పివో శిరీష గంట్యాడ ఎంపీడీవో రమణమూర్తిలు కోరారు. శనివారం గంట్యాడ మండలంలోని రామవరంలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని చెరువుల వద్ద అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. నీటి సంరక్షణకు కొత్త అడుగు అన్నారు.