NDL: డోన్ పట్టణంలోని నెహ్రూ నగర్ పార్కులో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్ర రెడ్డి మంగళవారం మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలతో కలిసి నడుస్తూ ఆత్మీయంగా ముచ్చటించారు. ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి అంశాలపై వారు వినిపించిన అభిప్రాయాలను శ్రద్ధగా విని చర్యలు తీసుకుంటామని మాజీ మంత్రి హామీ ఇచ్చారు.
గుంటూరులో ఆర్ఎంపీల సంఘం ఎఫ్ఈఎంపీఏ సభ్యులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను కలిశారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలకు ప్రభుత్వ గుర్తింపు, చట్టబద్ధత కల్పించాలని కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. అసోసియేషన్ గౌరవ సలహాదారునిగా కొనసాగాలని వారు కోరగా ఆయన అంగీకరించినట్లు పేర్కొన్నారు.
TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో రూ. 500 రాహు కేతువు పూజ యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఈవో వెంకటేశులు ప్రకటించారు. ఈ నెల 16వ తేదీన పాలకమండలి సమావేశంలో వెండి ధర పెరుగుదల, నిర్వహణ వ్యయం పెరిగిన దృష్ట్యా రద్దు చేశారు. దీనిపై స్థానికులు, భక్తుల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ధర్మకర్తల మండలి పునఃసమీక్షించి యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కాకినాడ: జగ్గంపేట గ్రామంలో శివాలయం ఎదురుగా ఉన్న మండల పరిషత్ పాఠశాలలో “బడి పిలుస్తుంది” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మాజీ AMC ఛైర్మన్ SVS అప్పలరాజు ముఖ్య అతిథిగా పాల్గొని పాఠశాలకు హాజరైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. విద్యే భవిష్యత్తుకు పునాది అని, పిల్లలు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవ్వాలన్నారు.
CTR: చంద్రగిరిలోని కళ్యాణి డ్యాంలో మృతదేహం లభ్యమైంది. ఈ నెల 18న పుంగునూరు మండలానికి చెందిన డ్రైవర్ మురళీమోహన్ డ్యాంలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు రెస్క్యూ టీంతో రెండు రోజుల పాటు విస్తృతంగా గాలించారు. కాగా మంగళవారం ఉదయం మృతదేహం నీటిపై తేలాడాతుండటంతో పోలీసులు వెలికి తీసి, దర్యాప్తు చేస్తున్నారు.
AKP: బడి పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా గొలుగొండ మండల కేంద్రంలో ప్రైమరీ పాఠశాల, జోగంపేట ఉన్నత పాఠశాల సిబ్బంది సంయుక్తంగా మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంఈఓ సత్యనారాయణ ఆధ్వర్యంలో బడి ఈడు పిల్లలను చేర్పించేందుకు అవగాహన కల్పించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు మానవహారం ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలల సదుపాయాలను వివరించారు.
సత్యసాయి: చెన్నేకొత్తపల్లి క్లస్టర్ పరిధిలో నూతనంగా ఎంపికైన అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత శాఖాధికారులతో కలిసి లబ్ధిదారులకు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యంపై అంగన్వాడీలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
ASR: డుంబ్రిగూడ మండలం తుండ్రుంగూడలో ‘బడి పిలుస్తుంది’ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ఎస్.బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాం వంటి సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. తల్లికి వందనం పథకం ద్వారా రూ.13,000 ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
SKLM: ప్రపంచ స్థాయి పాలనపై అధ్యయనం చేసేందుకు ఏపీ మంత్రుల బృందం సింగపూర్ చేరుకుంది తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ఆధునిక పరిపాలన, మౌలిక వసతులపై ఏప్రిల్ 27 వరకు వీరు శిక్షణ పొందనున్నారు. ఈ పర్యటన ద్వారా నేర్చుకున్న నూతన విధానాలను రాష్ట్ర పురోభివృద్ధికి వినియోగిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
W.G: మండల కేంద్రమైన ఉండి గ్రామంలోని పెద్దవంతెన సెంటర్లో ధాన్యపు లోడ్తో వెళ్తున్న ట్రాక్టర్ ఇవాళ అదుపుతప్పి పంట కాలవలోకి పల్టీ కొట్టింది. అదే మార్గంలో వెళ్తున్న అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామ కృష్ణంరాజు ఘటన స్థలం దగ్గర కారు ఆపారు. వివరాలను తెలిసికుని తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ గోడలపై చిత్రలేఖన కార్యక్రమాన్ని పోలీస్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ప్రతాప్ కిషోర్ పాల్గొన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మహిళా పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని సుందరవందానముగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. గోడలపై వేసిన పెయింటింగ్లను తిలకించారు. ప్రజల్లో పోలీస్ స్టేషన్ అంటే ఆహ్లాద వాతావరణం కల్పిస్తామన్నారు.
కాకినాడ: జిల్లాలోని ఏలేశ్వరం నగర పంచాయతీకి ప్రభుత్వం గ్రేడ్-2 పురపాలిక హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయం, జనాభా ప్రమాణాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 20 వార్డులతో సుమారు 39 వేల జనాభా ఉన్న ఈ పట్టణంలో వార్డులను 28కి పెంచే యోచనలో అధికారులు ఉన్నారు.
BPT: కర్లపాలెం మోడల్ ప్రైమరీ స్కూల్లో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం ఇవాళ చేపట్టారు. హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఇళ్లిల్లూ తిరిగారు. ఐదేళ్లు నిండిన పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. స్థానిక అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే తమ లక్ష్యమని ఉపాధ్యాయుడు పోలీసురావు పేర్కొన్నారు.
అన్నమయ్య: చిన్నమండెం మండలంలో ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. పడమటికోన, బోరెడ్డిగారిపల్లి గ్రామాలలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను స్వయంగా విని, తక్షణ పరిష్కారం కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమం, అభివృద్ధి అందించడం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.
KRNL: తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన శశి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు జొన్నగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మల్లికార్జున మొబైల్ సిగ్నల్ ఆధారంగా గ్రామ శివారులోని పొలంలో అతడిని గుర్తించారు. స్పృహలేని స్థితిలో ఉన్న శశిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.