• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘పారదర్శక పాలనకు ముందస్తు చర్యలు’

SKLM: పాతపట్నంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకి ముందు క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన శుక్రవారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, ఆర్డీఓ కాపు వీధిలో డ్రాఫ్ట్ పాస్ పుస్తకాలపై సంయుక్త తనిఖీ చేశారు. ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

April 17, 2026 / 04:29 PM IST

మొక్కజొన్న తోటలో సోలార్ ప్యానల్స్ వైర్లు దగ్ధం

VZM: గజపతినగరం మండలంలోని తమ్మారాయిడపేట గ్రామంలో అజాగ్రత్తగా కాల్చిన సిగరెట్‌ను పారి వేయడం వల్ల కోసి వేసిన కోరాడ పైడితల్లి మొక్కజొన్న తోట దగ్ధమైంది. దీంతో పాటు పొలంలో ఉన్న సోలార్ ప్యానల్స్, మోటార్ వైర్లు కాలిపోయాయి. దీనివల్ల సుమారు లక్షన్నర ఆస్తి నష్టం జరిగింది. పక్కనే ఉన్న మొక్కజొన్న తోటకు మంటలు వ్యాపించకుండా స్థానికులు మంటలు అదుపు చేశారు.

April 17, 2026 / 04:12 PM IST

రైతులకు అంతరాయం లేని విద్యుత్: ఏఈ

KRNL: దేవనకొండ మండలం ఎంకే కొట్టాలలో విద్యుత్ శాఖ ఏఈ రవీంద్ర ఆధ్వర్యంలో ఇవాళ కరెంటోళ్ల ‘జనం బాట’ కార్యక్రమం నిర్వహించారు. గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుని, లో వోల్టేజ్, మీటర్ రీడింగ్ సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని, తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు. వ్యవసాయానికి అంతరాయం లేకుండా విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

April 17, 2026 / 04:10 PM IST

సర్వేపల్లి రాధాకృష్ణకు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి నివాళి

ATP: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ వర్ధంతి సందర్భంగా జేసీ అస్మిత్ రెడ్డి ఘన నివాళులు అర్పించారు. ఉపాధ్యాయ వృత్తికి ప్రతిరూపంగా నిలిచిన ఆ మహనీయుని సేవలను స్మరించుకున్నారు. దేశ గతిని మార్చడంలో ఆయన చూపిన మార్గం ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్యారంగంలో ఆయన చేసిన కృషిని గుర్తుచేస్తూ నివాళులు అర్పించారు.

April 17, 2026 / 04:10 PM IST

శాంతమ్మ అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్

ASR: అరకులోయ మండలం ఎండపల్లివలసలో వెలసిన శ్రీ శాంతమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబ సమేతంగా శుక్రవారం దర్శించుకున్నారు. ప్రతి ఏడాది జాతర సందర్భంగా పూజలు నిర్వహించడం తమ కుటుంబ ఆనవాయితీగా కొనసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ అరకు ఇంఛార్జ్ దొన్ను దొర తదితరులు పాల్గొన్నారు.

April 17, 2026 / 04:10 PM IST

‘పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్తా’

E.G: రాజమండ్రి రూరల్ బొమ్మూరు వైసీపీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను వైసీపీ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. తూ.గో జిల్లా సెక్రటరీగా నియమించడంపై బోమ్మూరు గ్రామ మాజీ ఉప సర్పంచ్ దాకే శ్రీను అభినందనలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

April 17, 2026 / 04:08 PM IST

రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ధర్నా

PLD: రొంపిచర్ల హైవేపై శుక్రవారం రైతులతో కలిసి వైసీపీ నేతలు ధర్నా చేశారు. రోడ్డుపై మొక్కజొన్నలు పారబోసి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ.. పెట్టిన పెట్టుబడి కూడా రైతులకు లాభాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని మండిపడ్డారు. తక్షణమే క్వింటాల్‌ రూ.2,400కు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

April 17, 2026 / 04:04 PM IST

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం: MLA

NDL: రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. వెలుగోడు మండలం రేగడగూడూరు, పరమటూరు గ్రామాల్లో ఇవాళ ఆయన జొన్నల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం క్వింటాకు కనీస మద్దతు ధర రూ.3699తో జొన్నలను కొనుగోలు చేస్తారన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

April 17, 2026 / 04:02 PM IST

సిబ్బంది నుంచి అర్జీలను స్వీకరించిన ఎస్పీ

ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ సిబ్బంది సంక్షేమ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాలలో పనిచేస్తున్న సిబ్బంది వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ వినతులను స్వీకరించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.

April 17, 2026 / 04:02 PM IST

మంత్రి నారా లోకేష్‌ను కలిసిన మంత్రి

KRNL: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన మంత్రి నారా లోకేష్‌ను ఇవాళ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అందజేశారు. పార్టీ పొలిట్ బ్యూరోలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపి, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

April 17, 2026 / 04:00 PM IST

‘మాజీ సైనికుల సభను జయప్రదం చేయాలి’

BPT: ఈ నెల 19న బాపట్లలో జరిగే రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తొలి వార్షికోత్సవాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు కోరారు. అన్నం సతీష్ ప్రభాకర్ కళ్యాణ మండపంలో ఈ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, కలెక్టర్ వినోద్ కుమార్‌లు ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పుకొచ్చారు.

April 17, 2026 / 03:54 PM IST

జీవీఎంసీ వార్డుల పునర్విభజనపై వినతి

VSP: జీవీఎంసీ 98 వార్డులను 120గా పునర్విభజించే ప్రక్రియలో రాజకీయ లబ్ధి కోసమే సరిహద్దులు మార్చుతున్నారంటూ 78వ వార్డు మాజీ కార్పొరేటర్ గంగారావు శుక్రవారం చీఫ్ సిటీ ప్లానర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాయి. జనాభా ఆధారంగా శాస్త్రీయంగా విభజన చేయాలన్న నిబంధనలు పాటించట్లేదని, కొన్ని చోట్ల కులాల వారీగా మార్పులు చేస్తున్నారని ఆరోపించారు.

April 17, 2026 / 03:51 PM IST

‘మద్దతు ధరల కోసం రైతుల ఆందోళన’

శ్రీకాకుళం జిల్లా రైతు సంఘం సమావేశంలో రైతుల సమస్యలు ప్రధానంగా చర్చించారు. పంటలకు సరైన మద్దతు ధరలు లేక నష్టాలు వస్తున్నాయని తెలిపారు. ఎరువుల కొరత, అధిక ధరలు, నాసిరకం విత్తనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ఏప్రిల్ 20న మండల కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని రైతు సంఘం పిలుపునిచ్చింది.

April 17, 2026 / 03:51 PM IST

కరెంటు కోతలకు చెక్… 300 యూనిట్లు ఉచితం

కోనసీమ: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమని బీజేపీ సీనియర్ నాయకులు కోన సత్యనారాయణ అన్నారు. ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో విద్యుత్ బిల్లులు గణనీయంగా తగ్గుతాయని, నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చన్నారు.

April 17, 2026 / 03:50 PM IST

మహిళా ప్రతినిధులతో ఎమ్మెల్యే శ్రావణి సెల్ఫీ

ATP: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బండారు శ్రావణి తోటి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ నివాసాన్ని సందర్శించారు. అక్కడ వారి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం తోటి మహిళా ప్రతినిధులతో కలిసి సెల్ఫీలు దిగారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో ఢిల్లీలో ఉండటం గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

April 17, 2026 / 03:50 PM IST