CTR: తవణంపల్లి మండలంలో “బడి పిలుస్తోంది” కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఏపీసీ మద్దిపట్ల వెంకటరమణ ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు పెంచాలని పిలుపునిచ్చారు. ఎన్రోల్మెంట్ డ్రైవ్, డ్రాప్ అవుట్ పిల్లలపై సమీక్ష నిర్వహించి, ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేటలోని కే-రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు దూరదర్శన్ సప్తగిరి లైవ్ కార్యక్రమంలో ప్రతిభ చాటారు. జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, జపనీస్, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రేక్షకుల ప్రశ్నలకు ధైర్యంగా సమాధానాలు ఇచ్చారు. ఉపాధ్యాయులు, యాజమాన్యం వారిని అభినందించారు.
ప్రకాశం: గిద్దలూరు (మం) తంబళ్లపల్లె గ్రామంలో వెలసిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరునాళ్ళ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు.
KRNL: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అమలు, పురోగతిపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఇవాళ కలెక్టర్ డా.ఏ. సిరి సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల పనితీరు, లక్ష్యాల సాధనపై అధికారులతో చర్చించి, నిర్దేశిత గడువుల్లో ఫలితాలు సాధించాలని ఆదేశించారు. ప్రజా సేవల్లో పారదర్శకత, వేగం పెంచాలని సూచించారు.
BPT: మాదక ద్రవ్యాల రహిత ఏపీ కోసం విజయ్ కలాం చేపట్టిన 1000 కిలోమీటర్ల సైకిల్ యాత్ర బాపట్లలో బుధవారం ముగిసింది. ఇక్కడి మున్సిపల్ హైస్కూల్లో 250 మంది విద్యార్థులు 100 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శించారు. అనంతరం డ్రగ్స్కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్పీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. యువత మత్తుకు బానిస కావొద్దని సూచించారు.
NTR: నందిగామ మండలం కమ్మవారిపాలెం ఎంపీపీ ఎస్ మెయిన్ స్కూల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఎంపీడీవో ఆర్.వీ.ఎస్. ప్రసాదరావు అకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ తనిఖీలో మెనూలో ఉన్న వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ, ఎగ్, చిక్కీ నాణ్యతను పరిశీలించారు. 45 మందిలో 38 మంది విద్యార్థులకు భోజనం అందించారు.
AKP: మాడుగుల మండల కేంద్రంలోని పీ-4 కార్యాలయంలో వెలుగు వీవోఏలకు బుధవారం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మొబైల్ ఫోన్లు పంపిణీ చేశారు. పనులు వేగవంతానికి మొబైల్ ఫోన్లు దోహదపడతాయన్నారు. వీవోఏలు అంకితభావంతో పనిచేసే డ్వాక్రా మహిళల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వారికి బ్యాంకుల ద్వారా సకాలంలో రుణాలు మంజూరు అయ్యేలా బాధ్యతలు తీసుకోవాలన్నారు.
PPM: విధుల నుంచి తొలగించిన సాలూరు మండలం ఖరాసువలస కేజీబీవీ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పి.రంజిత్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. గిరిజన శాఖ మంత్రి గిరిజనులను చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు.
SKLM: సోంపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి చెందింది. పలాసపురం గ్రామానికి చెందిన బడ్డి పున్నాలు (75)ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పలాస డిపోకు చెందిన బస్సు బాతుపురం నుంచి సోంపేట వైపు వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
ATP: రాయలసీమ నీళ్లు, నిధుల కోసం ప్రతి ఒక్కరూ రోడ్డెక్కి పోరాడాలని అనంతపురం మాజీ ఎంపీ, వైసీపీ నేత తలారి రంగయ్య పిలుపునిచ్చారు. నంద్యాలలో జరిగిన సాగునీటి ప్రాజెక్టుల సమాలోచన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సీమ అభివృద్ధిపై మనసు లేదని విమర్శించారు. ఎయిమ్స్, హైకోర్టులను తరలించి ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని మండిపడ్డారు.
NLR: ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టీచర్ల చేత ఎంఈవో వెంకటేశ్వర్లు స్వీయగణన చేయించారు. ప్రతి టీచర్ ఇంటి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచారు. అనంతరం ఎంఈవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఫోన్ల నుంచి ఇంటి వివరాలను ఈనెలాఖరు లోపు నమోదు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డిస్టిక్ ఫీల్డ్ ట్రైనర్ సుబ్బారెడ్డి, HM శ్రీనివాసులు పాల్గొన్నారు.
PLD: చిలకలూరిపేట సమీపంలోని గణపవరం పారిశ్రామిక వాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన నిదానిధర్ దాస్ (46) అనే కార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబంతో కలిసి వలస వచ్చి గణపవరంలో నివాసం ఉంటూ.. పరిశ్రమల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
KKD: కోనపాపేట గ్రామానికి చెందిన జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర కార్యదర్శి కంబాల దాసు కొంతకాలంగా అనారోగ్యంతో బడపడుతున్నాడు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం అధ్యక్షులు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారిని పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆయన కోరారు
కోనసీమ: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనలో కీలకమైన జనగణన విధులను పారదర్శకంగా, నిబద్ధతతో నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను బుధవారం ఆదేశించారు. ప్రస్తుతం స్వీయ గణన ప్రక్రియ కొనసాగుతోందని, మే నెలలో చేపట్టే క్షేత్రస్థాయి డేటా సేకరణలో ఎటువంటి పొరపాట్లకు తావుండకూడదని స్పష్టం చేశారు. సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి వాస్తవ గణాంకాలను సేకరించాలన్నారు.