KRNL: ఆలూరులో నిర్మాణ దశలో ఉన్న అన్నా క్యాంటీన్ భవనాన్ని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఇవాళ సందర్శించారు. భవన నిర్మాణ నాణ్యతతో పాటు వంటగది, భోజనశాల సౌకర్యాలను పరిశీలించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పేదలకు తక్కువ ధరకే నాణ్యమైన భోజనం అందించే అన్నా క్యాంటీన్ ఆలూరు ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.
అన్నమయ్య: ఎస్పీ ధీరజ్ క్రికెట్ బెట్టింగ్పై ప్రజలను అప్రమత్తం చేశారు. ఐపీఎల్ సీజన్లో సరదాగా మొదలయ్యే బెట్టింగ్ వ్యసనంగా మారి యువతను అప్పులు, నేరాల వైపు నెడుతుందని హెచ్చరించారు. సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా ఉంచారని తెలిపారు. బెట్టింగ్లో పాల్గొంటే క్రిమినల్ కేసులు నమోదై భవిష్యత్తు దెబ్బతింటుందని స్పష్టం చేశారు.
BPT: డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని వేమూరు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 254 మందికి పరీక్షలు నిర్వహించారు. సాల్వేషణ్ ఆర్మీ ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన డాక్టర్లు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు అందజేశారు.
ప్రకాశం: కొండపి (M) కే.ఉప్పలపాడు నుంచి నిడమనూరు వెళ్లే రహదారి పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ రహదారిలో ప్రయాణం చేయాలంటే ఒళ్ళు గుల్లవుతుందని స్థానికులు అంటున్నారు. కే.ఉప్పలపాడు నుంచి టంగుటూరు మండలానికి కలిపే ఈ రోడ్డు నాలుగు కిలోమీటర్లు మేరా అడుగడుగునా గుంతలే దర్శనమిస్తున్నాయి అని తెలిపారు. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని వారు కోరుతున్నారు.
NDL: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పీడీ యాక్ట్, బైండోవర్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని నంద్యాల వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న నేర చరిత్ర కలిగిన వారికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఆయన హెచ్చరికలను బేఖాతరు చేస్తే చర్యలు తప్పవన్నారు.
KRNL: 12వ పీఆర్సీ కమిటీని తక్షణమే నియమించాలని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం ఎస్టీయూ ఆదోని, కౌతాళం మండలాల శాఖల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదోని STU భవన్లో నిర్వహించారు. 11వ పీఆర్సీ కాలం ముగియనున్నప్పటికీ కొత్త కమిటీ ఏర్పాటు చేయకపోవడమేంటని ప్రశ్నించారు. 30% మధ్యంతర భత్యం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
KDP: చక్రాయపేట మండలంలోని శ్రీగండి వీరాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ పనులను జెడ్పీటీసీ శివ ప్రసాద్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను రూ.25 లక్షల జెడ్పీ నిధులతో నిర్మిస్తున్నామని, వాటర్ ట్యాంక్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
కోనసీమ: ముమ్మిడివరం పదో మైలురాయి సెంటర్లో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు మృతి చెందాడు. అతను కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన పెట్టా బాబిగా పోలీసులు గుర్తించారు. బైక్పై వెళుతూ ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టగా బాబి తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
విజయనగరం 43, 44వ డివిజన్ జనసేన యువ నాయకులు పతివాడ చంద్రశేఖర్ ఆదివారం డొక్కా సీతమ్మ మజ్జిగ పంపిణి, చలివేంద్రంను ఏర్పాటు చేశారు. ముఖ్య అతిధిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి హాజరై, ఈ చలివేంద్రంను ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజల దాహర్తికై ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
SKLM: ప్రముఖ గాయని ఆశాభోంస్లే మృతిపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆదివారం సంతాపం ప్రకటించారు. ప్రముఖ గాయని ఆశాభోంస్లే మృతి తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఎనిమిది దశాబ్దాల పాటు తన గాత్రంతో శ్రోతలకు ఆనందాన్ని పంచి, ఎన్ని తరాలు అయినా ప్రజలతో బంధాన్ని కొనసాగిస్తూ ఉంటుందన్నారు. ఆశాభోంస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నంద్యాలలో ఏప్రిల్ 17,19 తేదీలలో జరగనున్న సీఐటీయు 17వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఇవాళ నాయకులు పిలుపునిచ్చారు. కార్మిక హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం సీఐటీయు నిరంతరం పోరాటాలు చేస్తోందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్నామని అన్నారు.
KDP: లింగాల మండల వ్యాప్తంగా టమాటా ధరలు పతనం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం 15 కిలోల టమాటాల బాక్సు రూ.100లకు మించి పలకడం లేదు.ఈ ధరలతో కోత కూలీ కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. మరికొంత మంది రైతులు టమాటాను తోటల్లో కోయకుండానే అలాగే వదిలేశారు. ప్రభుత్వం టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఆలయాల అభివృద్ధి, పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. లాలాపేటలోని శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కనీసం 10 ఆలయాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
ELR: నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఉదయం 10 గంటలకు మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. సబ్ కలెక్టర్ వినూత్న ఆదివారం మాట్లాడుతూ.. రెవిన్యూ డివిజన్ పరిధిలోని ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందించాలన్నారు. ప్రతి అర్జీలోని సమస్యలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించటం జరుగుతుందన్నారు.
CTR: కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఛైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు,అర్చకులు, గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొన్నారు.