SKLM: టెక్కలి మండలం శంభాన వీధిలో టెక్కలి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం. కృష్ణమూర్తి ఆదివారం ప్రభుత్వ పౌరసరఫరాల సరుకులను వినియోగదారులకు అందజేసారు. వినియోగదారులు షాపులు వద్ద తీసుకున్న సరుకులు తగిన కొలతల్లో ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని ఆర్డీఓ అన్నారు. టెక్కలి మండలం టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరిరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
కృష్ణా: పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన అనంతరం ఎటువంటి రిమార్క్ లేకుండా పదవీ విరమణ పొందడం అదృష్టమని, భగవంతునికి రుణపడి ఉండాలని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. మచిలీపట్నం పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందుతున్న ఎనిమిది మంది సిబ్బందికి ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కుటుంబసభ్యుల సమక్షంలో సత్కారం చేసిన ఎస్పీ, వారి సేవలను కొనియాడారు.
VZM: విజయనగరం జిల్లాలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి హెచ్చరికలు వచ్చాయని కలెక్టర్ అంబేడ్కర్ ఆదివారం తెలిపారు. ముఖ్యంగా వంగర, రేగిడి, తెర్లాం మండలాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని ఎదుర్కొనడానికి ఆయా మండలాల అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ELR: వేసవి విరామం అనంతరం సోమవారం నుంచి ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో మొత్తం 137 జూనియర్ కళాశాలలున్నాయి. 19 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలోకి ప్రవేశించిన 1,919 మంది విద్యార్థులతోపాటు, కొత్తగా ప్రథమ సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు హాజరుకావాలని డీఐఈవో టి. శేఖర్ బాబు తెలిపారు.
VZM: జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును శనివారం నిర్వహించారు. పని ప్రదేశాల్లో మహిళలపై ఎవరైనా లైంగిక పరమైన వేధింపులకు పాల్పడితే (POSH) లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 ప్రకారం చర్యలు తీసుకోబడతాయన్నారు. వారిపై శిక్షలు కఠినంగా ఉంటాయని తెలిపారు.
NDL: వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బనగానపల్లెకు చెందిన కాటసాని ఓబుల్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. తనమై నమ్మకం ఉంచి యువజన విభాగం బాధ్యతలు అప్పగించిన వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి, కాటసాని రామిరెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడతానని తెలిపారు.
W.G: పని చేస్తున్న ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులు చేస్తే పోష్ చట్టం ప్రకారం శిక్షార్హులని ప్రత్యేక న్యాయమూర్తి లక్ష్మీ నారాయణ అన్నారు. శనివారం సుప్రీంకోర్టు ఆదేశాలతో భీమవరంలో 3వ అదనపు జిల్లా కోర్టులో ప్యానల్ న్యాయవాదులకు, పారా లీగల్ వాలంటీర్లకు పోష్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. 2013 సంవత్సరం నుంచి ఈ చట్టం అమలులోకి వచ్చిందన్నారు.
KRNL: క్రిష్ణగిరి మండలం బోయబొంతిరాళ్ల కొండలో చిరుత సంచారం కలకలం రేపింది. శనివారం పొలాలకు వెళ్లిన రైతులు, ట్రాక్టర్ డ్రైవర్లు చిరుతను చూసి భయాందోళనకు గురయ్యారు. దీంతో పశువుల కాపర్లు, రైతులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖ తక్షణమే స్పందించాలని యువత అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, సర్పంచ్ రవిమోహన్ డిమాండ్ చేశారు.
KRNL: సాగునీటి ప్రాజెక్టుల పరిధిలోని కాల్వలు, జలాశయాలకు మరమ్మతులు నిర్వహణకు (ఓఅండ్ఎం) సంబంధించి 474 పనులకు రూ.37.31 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సాగు నీటి సంఘాలు లేనిచోట స్వల్పకాలిక టెండర్లను ఆహ్వానించి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. KCC, LLC.. తెలుగుగంగ, SRBC మరమ్మత్తులు, నిర్వహణ పనులు చేపట్టనున్నారు.
KRNL: జిల్లాలో ఈనెల 2న జరగనున్న డీఈఈ సెట్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ పాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9885716544 నంబర్కు ఫోన్ చేసి తెలపాలని కోరారు. హాల్ టికెట్లను apdeecet.apcfss.inవెబ్సైట్ నుంచి పొందొచ్చని చెప్పారు.
W.G: మద్యానికి బానిసై భార్య, కుమారైపై ఓ వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేసిన ఘటన శనివారం ఇరగవరం మండలంలో జరిగింది. మండలంలోని అర్జునుడుపాలెంకు చెందిన రాంబాబు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని భార్య లక్ష్మీ తులసి, కుమార్తెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రగాయాలైన వీరిని స్థానికులు తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్ఐ సతీష్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
WG: ప్రతికౌలు రైతు పంట సాగుదారు హక్కు పత్రం తప్పనిసరిగా పొందాలని తద్వారా పంట రుణాలు పొందడానికి సాధ్యమవుతుందని జేసీ రాహుల్ అన్నారు. శనివారం పెంటపాడు మండలం పత్తిపాడు గ్రామంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి కౌలు రైతుకు పంట సాగుదారు హక్కు చట్టం 2019 లోబడి కొన్ని షరతులు వర్తిస్తాయన్నారు. పంటరుణం, పంట భీమా, నష్టము పొందడానికి వీలవుతుందన్నారు.
ELR: కలెక్టరేట్లో 4 కరోనా కేసులు నమోదైనట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని డీఎంహెచ్వో మాలిణి శనివారం మీడియాకు తెలిపారు. సాధారణ మెడికల్ చెకప్లో భాగంగా సిబ్బంది కరోనా టెస్టులు చేయించుకోగా నెగిటివ్ వచ్చిందన్నారు. ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఇద్దరికి, ముసునూరుకు చెందిన ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్ వచ్చిందని, వారు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
NLR: సంగం మండల వ్యాప్తంగా శనివారం పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మండలంలోని వీర్ల గుడిపాడు గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా పాల్గొని వృద్ధులకు పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు అందిస్తున్నామని ఆనం పేర్కొన్నారు.
VZM: మంత్రి సంధ్యారాణి హామీలు నీటి మూటలుగా మిగిలాయని పాచిపెంట ఎంపీపీ బి ప్రమీల ఆరోపణలు చేశారు. శనివారం ఆమె మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి రేషన్ వాహనాలు రద్దు చేయమని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఎద్దేవా చేశారు. రేషన్ వాహనాలు రద్దు చేయబోమని చెప్పి జిల్లా పరిషత్లో హామీ ఇచ్చిన మాట నేడు ఏమైనట్లని అన్నారు.