ASR: డుంబ్రిగూడ మండలం కించుమండ పంచాయతీ కేంద్రంలో మంగళవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువైద్య సిబ్బంది పాల్గొని మూగజీవులకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు. అలాగే పశువులకు వచ్చే సాధారణ వ్యాధులు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పంచాయతీ కార్యదర్శి నరసయ్య పాల్గొన్నారు.
GNTR: గుంటూరులో నిర్వహించిన సరస్ మేళా ఘనవిజయం సాధించడంపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. 11 రోజుల్లోనే 13 లక్షల మంది సందర్శకులు ఈ మేళాను సందర్శించగా, రూ.25 కోట్లకు పైగా వ్యాపారం జరగడం విశేషమని ట్వీట్ చేశారు. 320 స్టాళ్ల ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు తమ ప్రతిభను చాటుకున్నారని, ఇది వారి ఆర్థిక స్వయం సమృద్ధికి నిదర్శనమన్నారు.
GNTR: నిడుబ్రోలు 11వ వార్డులోని మౌలిక వసతులను పొన్నూరు పురపాలక కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు మంగళవారం స్వయంగా పరిశీలించారు. రోడ్లు, కాలువల దుస్థితిపై స్థానికులు అందించిన విజ్ఞప్తులపై స్పందించిన ఆయన, దెబ్బతిన్న కల్వర్టులను వెంటనే పునరుద్ధరించాలని, సీసీ రోడ్ల పనులను త్వరితగతిన పట్టాలెక్కించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ATP: నార్పల మండలం గూగూడు కుళ్లాయి స్వామి ఆలయంలో చక్కెర, టెంకాయల పూజ సామాగ్రిని ఈనెల 23న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శోభా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉదయం 10 గంటలకు ఈ వేలం పాట జరుగుతుందన్నారు. ఆసక్తి గల వారు రూ. 50 వేలు డిపాజిట్ చెల్లించి, వేలంలో పాల్గొనాలని సూచించారు.
పోలవరం జిల్లా చింతూరు మండలం కల్లేరు పంచాయతీ మధుగురు శివారులో సోమవారం రాత్రి అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలేశారు. స్థానిక మహిళలు గమనించి ఐసీడీఎస్కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది చిన్నారిని రక్షించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సీడీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేశ్ తెలిపారు.
NLR: అల్లూరు మండలంలోని ఇసుకపల్లి సముద్రతీర ప్రాంగణంలో కనుమ పండుగ రోజు నలుగురు వ్యక్తులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు మృతదేహాలు బయటికి వచ్చాయి. నాలుగో మృతదేహం మంగళవారం ఉదయం బోగోలు మండలంలోని పాత-కడపాళెం సమూద్రతీరానికి కొట్టుకు వచ్చింది. కాగా, సంఘటన జరిగిన ఐదవ రోజుకు మృతదేహం లభ్యమయినట్లు స్థానికులు తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లెలో చెరువు కబ్జాపై రైతులు స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్య పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చలపతి, కొంతమంది ఇతరులు వెళ్లే దారితో పాటు స్థానిక బడా బాబు ఓబులు నాయుని చెరువును పూడ్చి 10 ఎకరాలను కబ్జా చేసి దారిని మూసేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు కబ్జా రాయుడికి కొమ్ముకాస్తున్నట్లు రైతులు ఆరోపించారు.
పోలవరం జిల్లా రాజవొమ్మంగి మండలం జీ.శరభవరం గ్రామంలో బోడోజు మంగారావు (65) అనే వృద్ధుడు చలిమంటలో పడి తీవ్రంగా గాయపడ్డారు. గత అర్ధరాత్రి మంట కాచుకుంటుండగా ప్రమాదవశాత్తు మంటల్లో పడిపోవడంతో పాలిస్టర్ చొక్కా అంటుకుని 60% శరీరం కాలిపోయింది. ఈ ప్రమాదంలో వారి పాక కూడా దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రుడిని జడ్డంగి పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
GNTR: పుట్టిన మూడు రోజులకే కన్నతల్లి ప్రేమకు దూరమై, ఓ ఆడ శిశువు అనాథగా మారిన ఘటన పట్టాభిపురంలోని మాతృశ్రీ ఆశ్రమం వద్ద విషాదాన్ని నింపింది. ముఖానికి మాస్క్ ధరించిన ఓ మహిళ, పసికందును ఆశ్రమం వద్ద వదిలి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో సోమవారం రికార్డయ్యాయి. ఈ హృదయవిదారక దృశ్యం చూసినవారు కంటతడి పెట్టారు. పోలీసులు శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.
VZM: ఈ నెల 16న ఎల్.కోట మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఆర్.గోవిందరావు సోమవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ కార్యకర్తలు టీ.అనిల్, అతని స్నేహితుడు జే.రవిచంద్ర 16న అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ముక్కాకిషోర్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
W.G: తణుకు పట్టణంలోనే ఒక టీ కార్నర్లో ఇవాళ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సొసైటీ రోడ్డులోని మమత టీ కార్నర్లో గ్యాస్ సిలిండర్ లీకైన ఘటనలో టీ మాస్టర్తో సహా టీ తాగేందుకు వచ్చిన ఐదుగురు మున్సిపల్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం తణుకులోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ (PG), ప్రొఫెషనల్ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులకు సంబంధించి ఇవాళ్టి నుంచి జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. ఈ పరీక్షలు జనవరి 27 నుంచి ప్రారంభమవుతాయి. రివైజ్డ్ టైమ్ టేబుల్ ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టీ.చిట్టిబాబు తెలిపారు.
E.G: నల్లజర్ల మండలం దూబచర్లలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో ఈ నెల 21న జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ఎం. కమల కుమారి తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 6 నుంచి 8వ తరగతి వరకూ చదివే విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. వివరాలకు 9494245797 నంబరులో సంప్రదించాలన్నారు.
ATP: యోగివేమన త్యాగనీరతి ప్రతి ఒక్కరికీ ఆదర్శమని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొనియాడారు. వేమన వంటి మహనీయుడు తమ కులంలో జన్మించడం పట్ల రెడ్లు గర్వించాలని సూచించారు. అప్పు చేసి కూడా పదిమందికి సాయం చేసే గొప్ప గుణం ఈ సామాజిక వర్గానికి ఉందని తెలిపారు. సాయం చేసేవాడే నిజమైన రెడ్డి అని ఆయన వ్యాఖ్యానించారు.
KRNL: ఫిబ్రవరి 10వ తేదీ నాటికి జిల్లాలో ఈ-క్రాప్ బుకింగ్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. సిరి మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ నుంచి ఈ-పంట బుకింగ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేలో పురోగతి సాధించాలని,పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు.