PLD: సత్తెనపల్లి ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం కు ఈ నెల 10న రాత్రి 9 గంటలకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ కుమార్ తెలిపారు. ఈ నెల 11న శ్రీకాళహస్తి, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ తదితర ప్రదేశాలు సందర్శించి అదే రోజు రాత్రికి అరుణాచలం చేరుకుంటుందని అన్నారు. తిరిగి ఈ నెల 12న కంచి దర్శనం అనంతరం, 13 న తిరిగి సత్తెనపల్లి వస్తుందని తెలిపారు.
KDP: సిద్దవటం మండలంలోని మాధవరం-1 గ్రామ పంచాయతీ బంగారు పేటలో వెలసిన శ్రీ గంగాభవాని అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రంగమ్మ అమ్మవారికి అభిషేకం, అలంకరణ, సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ELR: ముసునూరు మండలం రమణక్కపేట జడ్పీ హైస్కూల్లో శుక్రవారం జై భారత్ మాత అంటూ విద్యార్థులు నినదించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పసుమర్తి రామకృష్ణ మాట్లాడుతూ.. పాకిస్థాన్లోని ఉగ్రమూక ఏరువేత చర్యలకు అన్ని దేశాల ప్రజలు మద్దతు నివ్వాలని కోరారు. కష్ట సమయంలో భారత్కు వెన్నుదన్నుగా ఉండాలన్నారు. సోషల్ ఉపాధ్యాయులు అంగడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
W.G: విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థమైన మానవతా సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాలని ప. గో. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపు నిచ్చారు. ప్రపంచ రెడ్ క్రాస్, ప్రపంచ తలసేమియా దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ రాజ్ భవన్లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డు, గోల్డ్ మెడల్ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందుకున్నారు.
KDP: పరిశ్రమలు స్థాపించేందుకు ప్రతి ఒక్కరికి సహకారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చైతన్య రెడ్డి పేర్కొన్నారు. చింతకొమ్మదిన్నె మండలంని కొప్పర్తి ఎంఎస్ఎంఈ పార్కును ఆయన గురువారం ప్రారంభించారు. పరిశ్రమలు స్థాపించడం ద్వారా నిరుద్యోగం తగ్గుతుందన్నారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని పుణ్యక్షేత్రం లోని సాదు సత్రం దేవస్థాన భూముల్లో అక్రమ నిర్మాణాలు చేయడం సిగ్గుచేటని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు పెద్దుల్లపల్లి ప్రభాకర్ విమర్శించారు. పుణ్యక్షేత్రానికి కేటాయించిన భూములు, సత్రాలకు కేటాయించిన స్థలాలు ఆక్రమించుకొని అనుభవిస్తూ, ఆ స్థలంలోనే కట్టడాలు నిర్మిస్తున్న రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
KDP: రైల్వే కోడూరు పట్టణంలోని బలిజ వీధిలో వెలసిన అంకాలమ్మ తిరునాళ్లు ఈ నెల 9 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 9న వినాయకుని పూజ, అమ్మవారికి జల్ది కార్యక్రమం ఉంటుందన్నారు. 11న పరుశురాముని జయంతి ఉంటుందన్నారు. 12 అంకాలమ్మ గుడిలో రక్త కలిపి 13న పూల కలిపి అనంతరం ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు తెలిపారు.
శ్రీకాకుళం: నగరంలో కలెక్టర్ బంగ్లా దగ్గరలో కల్యాణ వెంకటేశ్వరాలయంలో ఈ నెల 10న ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహక ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు శిబిరం ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు.
VZM: మద్యం సీసాల చోరి కేసులో కొత్తవలస పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. స్దానిక ఎస్. ఐ మన్మథ రావు మాట్లాడుతూ.. గత నెల 28న కొత్తవలస రాజా థియేటర్ వెనుక కాలనీ మద్యం దుకాణంలో 240 మద్యం సీసాలు దొంగిలించినట్లు సూపర్వ్వైజర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి ఈ చోరి కేసులో ముగ్గురు వ్యక్తులను గుర్తించామని వారిలో గురువారం ఇద్దరి అరెస్టు చేసామని తెలిపారు.
VZM: దేశ సరిహద్దులలో భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గురువారం రాత్రి స్దానిక ఒకటవ పట్టణ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ను పోలీసులు జల్లెడ పట్టారు. డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల బ్యాగులను తనిఖీ చేశారు.
SKLM: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు టెక్కలి నియోజకవర్గ శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాలు మేరకు పవాల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా “ఆపరేషన్ సింధూర”పేరుతో పాకిస్థాన్లోని ఉగ్ర స్థావరాలను భారత సైన్యం మెరుపు దాడులు చేసినందుకు గాను భారత సాయుధ దళాలకు అభినందనలు తెలియజేస్తూ టెక్కలి ఇందిరాగాంధీ జంక్షన్లో జాతీయ ప్రతాకలతో సంఘీభావం తెలియజేశారు.
ASR: అన్నదాత సుఖీభవ పథకంలో రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని చింతపల్లి మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు గురువారం తెలిపారు. మండలంలోని రైతులు ఈనెల 16వ తేదీలోగా తమ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. రైతులు తమ భూమి పట్టా పాసు పుస్తకాలు, ఆధార్ కార్డులు, పోడు పట్టాలను తీసుకుని ఆర్ఎస్కేలను సంప్రదించాలని సూచించారు.
KKD: కాకినాడ నగరంలోని వార్ఫ్ రోడ్లో ఉన్న మినీ గూడ్స్ ఆటో వెహికల్ యూనియన్ ప్రతినిధులకు గురువారం ట్రాఫిక్ పోలీసులు నిబంధనలపై అవగాహన కల్పించారు. పరిమితికి మించి లోడ్ వేయరాదని, రాంగ్ రూట్లో పార్కింగ్ చేయకూడదని ట్రాఫిక్-1 సీఐ నూని రమేశ్ సూచించారు. మితిమీరిన వేగంతో వెళ్లవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరించారు.
SKLM: పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే నూతన కార్యాలయంలో గురువారం ప్రజాదర్బార్ కార్యక్రమం జరిగింది. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో ప్రజల యొక్క సమస్యలను అడిగి తెలుసుకుని వినతి పత్రాలు స్వీకరించారు. ఇందులో జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో ఎం కృష్ణమూర్తి, డ్వామా పీడీ సుధాకర్ పాల్గొన్నారు.
కోనసీమ: మండపేట కొత్త బస్టాండ్ వద్ద IFTU ఆధ్వర్యంలో రైస్ మిల్లు కార్మికులతో సమ్మె సన్నాహక సమావేశం గురువారం నిర్వహించారు. భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. మే 20వ తేదీన జరిగే కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు.