GNTR: రాయనపాడు యార్డు పనుల నేపథ్యంలో గుంటూరు మార్గంలో పలు రైళ్ల సేవల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. మే 2 నుంచి 5 వరకు గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ, ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు కానున్నాయి. మే 1 నుంచి 4 వరకు కొన్ని రైళ్లను గుంటూరు మార్గం మీదుగా మళ్లిస్తారు. మచిలీపట్నం-షిర్డీ రైలు మే 5న మార్గం మార్చనుంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని వారు కోరారు.
KRNL: ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజులుగా క్వింటా రూ.7 వేలకు పైగా పలికిన ధర గురువారం గరిష్ఠంగా రూ. 6,690లకు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్కు 113 క్వింటాళ్ల దిగుబడి రాగా, కనిష్ఠ ధర రూ.5,700, మధ్యస్తంగా రూ.6,121లకు అమ్ముడుపోయినట్లు యార్డ్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు.
కృష్ణా: యనమలకుదురులో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసుల వివరాల మేరకు.. భర్తతో విభేదాల నేపథ్యంలో తండ్రి ఇంట్లో పిల్లలతో నివసిస్తున్న హేమలతాబాయిని ఈ నెల 7న తమ్ముడు రాజునాయక్ ఇళ్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేశాడు. కొద్ది రోజులు గడువు ఇవ్వాలని ఆమె కోరగా, ఆగ్రహంతో అతడు దాడి చేసి గాయపరిచాడు. గురువారం పెనమలూరు PSలో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
TPT: తిరుపతి రుయాలో గతంలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీలు ఇచ్చేవాళ్లు. తర్వాత ఎమర్జెన్సీ ఓపీలే ఇస్తుండగా తాజాగా టైమింగ్స్ మార్చారు. ఎండలు పెరగడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగులు ఇబ్బంది పడకుండా ఉదయం 8గంటల నుంచే ఓపీలు ఇస్తున్నారు. సాయంత్రం 4గంటల వరకు ఓపీలు తీసుకుని సేవలు పొందవచ్చని వైద్యులు సూచించారు.
AKP: నక్కపల్లి మండలం వైసీపీ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండలానికి నూతన కార్యవర్గాన్ని పార్టీ కేంద్ర కమిటీ గురువారం ప్రకటించింది. అలాగే, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా మండలానికి చెందిన జి. నరసింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ కార్యదర్శిగా జి బాబురావును నియమించారు.
కోనసీమ: పి.గన్నవరం డొక్కా సీతమ్మ అక్విడక్టు వంతెనపై శుక్రవారం సాయంత్రం నుంచి రాకపోకలు పునఃప్రారంభం కానున్నట్లు ఇరిగేషన్ డీఈ రవీంద్రబాబు తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి మూసివేసిన ఈ వంతెనకు సుమారు రూ.61 లక్షల వ్యయంతో మరమ్మతులు పూర్తి చేశారు. వంతెనపై సోలార్ దీపాలు, ట్రాఫిక్ సూచికలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రకాశం: టంగుటూరులో వాహనాలు అడ్డదిడ్డంగా పెడుతుండడంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. టంగుటూరు బస్టాండ్ కూడలి దగ్గర నుంచి పొదిలి వైపు వచ్చే రహదారుల షాపింగ్ కాంప్లెక్స్ ముందు వాహనాలు నిలుపుతుండడంతో తరచూ ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పిందించి ట్రాఫిక్ను నియంత్రించాలని కోరుతున్నారు.
NLR: వెంకటాచలంలో టీడీపీ మండల కార్యాలయాన్ని గురువారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ముందుగా మండల టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యేకి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సోమిరెడ్డి మాట్లాడారు. త్వరలోనే వెంకటాచలంలో శాశ్వత భవనం నిర్మిస్తామన్నారు. టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
E.G: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ పీ.మనోహర్ గురువారం హెచ్చరించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్హెచ్పై డ్రంక్ డ్రైవింగ్ చేస్తూ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బైక్ నడిపిన రామారావు, లారీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ రూ.11,500 చొప్పున జరిమాన విధించారు.
CTR: పూతలపట్టు మండలం రంగంపేట క్రాస్ వద్ద “హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు” అనే కార్యక్రమం పూతలపట్టు సీఐ గోపి నిర్వహించారు. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్మెట్ ధరించి ప్రయాణిస్తున్న వాహనదారులను ప్రోత్సహిస్తూ వారి వివరాలను సేకరించారు. అలాగే హెల్మెట్ ధరించిన వారిని అభినందిస్తూ వారి వివరాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు.
NTR: జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ప్రమాద పరిశీలన యాత్ర చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు అధికారులతో కలిసి 123 ప్రాంతాలను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ సంవత్సరంలో ప్రమాదాల రేటు తగ్గిందని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
CTR: ప్రజల సమస్యలను రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పరిష్కరించాలని చిత్తూరు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ ఆదేశించారు. రీ-సర్వే కార్యక్రమాన్ని ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలన్నారు. జీరో ఖాతాలు, క్యాస్ట్ సూమోటో, హౌసింగ్, వాటర్ బాడీస్ రక్షణ, 22 ఏ, పీజీఆర్ఎస్ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులకు సూచించారు.
PLD: జిల్లాలోని రైస్ మిల్లర్లు స్థానికంగా పండిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని JC సంజన సిన్హా సూచించారు. గురువారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో ఆమె ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ నుంచి వచ్చే ధాన్యాన్ని చెక్ పోస్టుల ద్వారా కట్టడి చేయాలన్నారు. మిల్లర్లు ప్రతిరోజూ కొనుగోలు వివరాల నమోదు, రవాణా వాహనాలకు GPS అమర్చాలని సూచించారు.
GNTR: NSUI 56వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు సంగడిగుంటలో ఇందిరా గాంధీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ NSUI కో-ఆర్డినేటర్ షేక్ కరీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో NSUI జెండాను ఆవిష్కరించారు. శిబిరంలో కంటి, గుండె, దంత, జనరల్ వైద్య పరీక్షలతో పాటు ఈసీజీ, బీపీ, షుగర్, థైరాయిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ATP: CM చంద్రబాబు నాయుడు జన్మదినం రోజు ఏప్రిల్ 20 నుంచి రాయదుర్గం నియోజకవర్గంలో పది రోజులపాటు ప్రగతి పండుగ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నెల 11 లోపు వెయ్యి మంది పేదలకు ఇంటి పట్టాల పంపిణీ చేస్తామని తెలిపారు.