CTR: కుప్పంలో ఉగాది వేడుకలు విలక్షణమైన ఆధ్యాత్మికతతో సాగాయి. తమిళ సంస్కృతీ సంప్రదాయాల కలయికతో ఇక్కడి ప్రజలు తమ పితృదేవతలకు ఘనంగా నివాళులర్పించారు. మరణించిన తమ పూర్వీకులను స్మరిస్తూ, కుటుంబ సభ్యులందరూ శ్మశానాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ముఖ్యంగా ఉగాది పచ్చడిని వారికి నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకున్నారు. పండుగ రోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం విశేషం.
కృష్ణా: ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ అర్చకులకు ప్రత్యేక పారితోషికం మంజూరు చేసింది. గురువారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అవనిగడ్డలోని శ్రీ రాజశేఖరస్వామి వారి దేవస్థాన అర్చకులు జి.పవన్ శాస్త్రికి ఉగాది పారితోషకం రూ.5,116లను దేవస్థానం ఛైర్మన్ ఘంటసాల రాజమోహనరావు అందచేశారు. దేవదాయ శాఖ ఈవో యార్లగడ్డ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు స్వర్ణ వెంకటరమణయ్య చండీగర్లో ఈనెల 17 నుంచి జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ యోగాసన ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరిగిన యోగ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. ఉపాధ్యాయుడు స్వర్ణ రమణాలను పలువురు అభినందించారు.
ATP: కూటమి ప్రభుత్వం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై అనంతపురం జేఎన్టీయూ వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. విద్యార్థులతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం హర్షనీయమని సాకే లక్ష్మీనరసింహ పేర్కొన్నారు.
NTR: పెనుగంచిప్రోలు నిన్న కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువారం పరిశీలించారు. అనంతరం బాధిత రైతులకు మాట్లాడి పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోనసీమ: ర్యాలి దేవస్థానంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పోస్టర్ను ఆవిష్కరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
BPT: చీరాల టీడీపీ ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్లను గురువారం తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ కలిశారు. పార్టీ సేవా కార్యక్రమాలు, జరుగుతున్న అభివృద్ధిని గురించి ప్రజలకు తెలియజేస్తున్న విధానాన్ని ఆయన ఎమ్మెల్యే కొండయ్యకు వివరించారు. అనంతరం వారిరువురికి ఉగాది నామ శుభాకాంక్షలు తెలియజేశారు.
E.G: రాజమండ్రి స్థానిక బొమ్మూరు కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి, JC మెగా స్వరూప్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలుగు ప్రజలందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని ఆయన ఆకాంక్షించారు.
VSP: పద్మనాభం మండలం పొట్నూరు గ్రామానికి చెందిన ముద్దాడ శ్రియాన్ సత్తా చాటాడు. మొన్నవచ్చిన సైనిక్ స్కూల్ ఫలితాల్లో సదరు విద్యార్థి ఎన్నికయ్యాడు. అయితే, నిన్న విడుదలైన నవోదయ ఫలితాల్లో కూడా మెరిశాడు. మొత్తం వంద మార్కులకు గానూ 86.25 మార్కులు సాధించి 399వ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. దీంతో శ్రియాన్ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
విజయనగరంలోని కంటోన్మెంట్ దండుమారెమ్మ దేవాలయంలో ఈనెల 19 నుంచి 24 వరకు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ గురువారం తెలిపారు. ఉత్సవాల ప్రారంభంలో ఎస్పీ పాల్గొని, జ్యోతి ప్రజ్వలనలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలకి ఎస్పీతో పాటు, అదనపు ఎస్పీ పాల్గొన్నారు.
NDL: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన మిత్ర’ వాట్సాప్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కొత్తపల్లి తహసీల్దార్ ఉమారాణి ఇవాళ సూచించారు. ఈ సేవల ద్వారా ధ్రువీకరణ పత్రాలు, RTC, విద్యుత్, రెవెన్యూ, హెల్త్ కార్డులు సహా 160కు పైగా సేవలను ఇంటి నుంచే పొందవచ్చన్నారు. 95523 00009 నెంబర్కు ‘హాయ్’ మెసేజ్ పంపి అవసరమైన శాఖను ఎంపిక చేసుకుని, సమాచారం పొందవచ్చని పేర్కొన్నారు.
W.G: భీమవరం కలెక్టర్ ఆఫీస్లో నిర్వహించిన ఉగాది వేడుకలలో సాహితీవేత్త, అక్షర కిరీటి తెన్నేటి మాస్టారుకు “ప్రభుత్వ ఉగాది సాహితీ పురస్కారం”ను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం తెన్నేటి మాస్టారు స్వీయ కవితాసంపుటి “తెలుగు లోకం” పుస్తకాన్ని నాగరాణి, DEO నారాయణ ఆవిష్కరించారు.
E.G: కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. జాబ్ క్యాలెండర్ విడుదల సందర్భంగా గురువారం ఆయన మాట్లాడుతూ.. ఉగాది కానుకగా యువతకు బంగారు భవిష్యత్తు అందించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. గత 20 నెలల్లోనే 6,28,347 ఉద్యోగాలు భర్తీ చేశామని, పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు.
సత్యసాయి: గోరంట్ల మండలం పూలేరు పంచాయతీ పరిధిలోని కొత్తబయన్నపల్లి గ్రామంలో NREGS పథకం కింద రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు గురువారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గోరంట్ల టీడీపీ కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
AKP: నర్సీపట్నంలో చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసంలో పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య చింతకాయల రాజేష్ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, పండితులు నూతన సంవత్సర పంచాంగ శ్రవణాన్ని పఠించారు.