NDL: నంద్యాల-గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రజలు వజ్రాల కోసం అన్వేషణను పునఃప్రారంభించారు. సర్వ నరసింహ స్వామి ఆలయం సమీపంలోని వాగు, వజ్రాల వంక వద్ద రాయలసీమతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆశావహులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ అన్వేషణతో ఆ ప్రాంతంలో సందడి నెలకొంది.
అన్నమయ్య: మదనపల్లె కలెక్టరేట్లో సోమవారం PGRS ద్వారా అర్జీలను స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తమ సమస్యలను కలెక్టరేట్లోని PGRS ద్వారా అందజేయవచ్చునని చెప్పారు.
NTR: ఇబ్రహీంపట్నంలో టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులతో దాడి చేసిన మాజీ మంత్రి జోగి రమేష్ నివాసాన్ని మాజీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
బాపట్ల జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 16 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు మొత్తం 15,944 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. జిల్లా వ్యాప్తంగా 82 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని వసతులు కల్పించామని అధికారులు తెలిపారు.
CTR: పుంగనూరు పట్టణం పుంగమ్మ చెరువు కట్టపై గల బస్సు షెల్టర్లో ఓ వ్యక్తి డెడ్ బాడీని స్థానికులు గుర్తించారు. అతడికి దాదాపు 40 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. ఈ మేరకు వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: గుత్తికొండలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా సోమవారం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు చేసి, బంగారు, వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.
BPT: చెరుకుపల్లి మండలం కావూరు హైస్కూల్ వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జొన్నలగడ్డవారిపాలెం గ్రామానికి చెందిన మొవ్వ ముత్యాలరావు (46) దుర్మరణం చెందారు. రాంబట్లపాలెం నుంచి ఎరువుల బస్తాలతో బైకుపై ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని కారు ఆయనను బలంగా ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ముత్యాలరావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KDP: విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లిని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి ఆమె భర్త, టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆలయ కమిటీ సభ్యులు వీరికి ఆహ్వానం పలికి దర్శనం చేయించారు.
TPT: శ్రీకాళహస్తికి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఇవాళ రానున్నారు. గోపురం వద్దగల ధూర్జటి కళా ప్రాంగణంలో ఆయన ప్రవచనం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు భక్తులకు ఆత్మశాంతి అందిస్తాయన్నారు.
NDL: రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ ఛైర్మన్ ఆదివారం బనగానపల్లి మండలం పలుకూరు గ్రామంలో పర్యటించారు. గ్రామ సమీపంలో నాపరాల్ల మైనింగ్ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నేరుగా కార్మికులతో మాట్లాడి పరిశ్రమల్లో కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం వడ్డెర సంక్షేమానికి కార్మికులకు ప్రత్యేక కృషి చేస్తుందని ఆయన అన్నారు.
నెల్లూరు సౌత్ ట్రాఫిక్ AS1 వెంకటేశ్వర్లుపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఎస్పీ డా.అజిత వేజెండ్ల ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన బైకులపై కాలేజీకి వెళ్లే విద్యార్థులను ఆపి ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది. చేతిలో డబ్బులు లేవని వాహనదారులు చెబితే ఫోన్ పే చేయమని ఆయన ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిని సస్పెండ్ చేశారు.
NLR: ఉదయగిరి పట్టణంలోని మెయిన్ రోడ్డులో ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఆదివారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని, ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు ఫైన్ విధించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. వాహన దారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదన్నారు.
TPT: లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. విశాలాక్ష్మి నగర్ ఫ్లైఓవర్ వద్ద పూతలపట్టు-నాయుడుపేట హైవేపై లారీ రెండు బైక్లను ఢీకొట్టడంతో నారాయణపురం గ్రామానికి చెందిన చంగయ్య అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్, రమేశ్కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సోమవారం తోటపల్లి గూడూరు మండలంలో పర్యటించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు మండలంలోని ఇసుక పాలెంలో శాంత బయోటెక్నిక్స్ ఆధ్వర్యంలో శాంత – వసంత ట్రస్టు, శంకర నేత్రాలయ సహకారంతో నిర్వహిస్తున్న మెగా కంటి వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చైనీస్ సంప్రదాయం ఉట్టిపడేలా విద్యుత్తు లాంతర్లు, దీపాలతో మందిరాన్ని అందంగా అలంకరించారు. వివిధ దేశాల నుంచి భక్తులు తరలివచ్చారు.