KRNL: జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. 9 ఐసీడీఎస్, ప్రాజెక్టుల్లో 8 కార్యకర్తలు, 49 సహాయకుల పోస్టులు భర్తీ చేయనున్నారు. కార్యకర్తలకు 10వ తరగతి, సహాయకులకు 7వ తరగతి పాస్ అర్హతగా నిర్ణయించారు. దరఖాస్తులు సంబంధిత సర్టిఫికెట్లతో కలిపి 17వ తేదీ లోపు సీడీపీవో కార్యాలయానికి సమర్పించాలని సూచించారు.
KKD: గోకవరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు బాలికను తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను బయటకు వెళ్లగానే మరో యువకుడు దారుణానికి ఒడిగడ్డాడు. బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు బాధితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మంగళవారం సాయంత్రం నిరసన చేపట్టారు. పీడీఎస్ఈయూ రాష్ట్ర కార్యదర్శి సతీష్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు.
VZM: జిల్లా బైపాస్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నామని పార్వతీపురం R&B ఏఈఈ బి.రాజేంద్ర కుమార్ తెలిపారు. ఈనెల 8వ తేదీన వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన ‘ఈ దారిలో వెళ్లాలంటే గుండె దడే’ మరియు ‘అధ్వానంగా బైపాస్ రోడ్డు’ వార్తలకు స్పందించి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్నట్లు తెలిపారు.
SKLM: పాతపట్నం మహేంద్ర తనయ తీరాన కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామి వారికి భాద్రపద తదియ బుధవారం ప్రత్యేక పాలాభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారి పూజల అనంతరం ఈ అభిషేక కార్యక్రమాలు ఆలయ అర్చక సమక్షంలో చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో పాతపట్నం పర్లాకిమిడిప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు.
ATP: జిల్లాలో ఇవాళ సూపర్ సిక్స్ విజయోత్సవ సభ జరగనుంది. సీఎం, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొననుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఎస్పీ జగదీశ్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు, కర్నూల్, తిరుపతి రూట్లలో వెళ్లే వాహనాలు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంక్షలు పాటించి సహకరించమన్నారు.
కృష్ణా: ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా ప్రయాణించే కింది రైళ్లకు పలు స్టాప్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం.17207/17208 మచిలీపట్నం-సాయినగర్ షిర్డీ రైళ్లు లాసూర్, గంగేఖర్ స్టేషన్లలో, నం.17211/17212 మచిలీపట్నం- యశ్వంత్పూర్కు బేతంచర్ల, దొనకొండ, నం.17225/17226 నరసాపూర్- SSS హుబ్లీ రైళ్లకు కురిచేడు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
NLR: దుత్తలూరు మండలంలోని నందిపాడు జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో మంగళవారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జిల్లా కలెక్టర్ ఆనంద్ చేతుల మీదగా అవార్డు అందుకున్న ఫాతిమాజాను యుటిఎఫ్ నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఉపాధ్యాయుల సేవలను ప్రభుత్వం గుర్తించిదని తెలిపారు.
E.G: రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్ గోకవరం మండల కార్యాలయాన్ని మంగళవారం సందర్శించారు. రెవెన్యూ సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందని తహసీల్దార్ రామకృష్ణ తెలియజేశారు. అనంతరం గోకవరం సొసైటీలో యూరియా నిల్వలను తనిఖీ చేసి యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని ఆర్డీవో ఆదేశించారు.
KDP: ప్రొద్దుటూరు-1వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కాపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. మట్కా బీటర్లు, అనుమానిత ఇళ్ళలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్నా నగరులో మట్కా నిర్వహిస్తున్న బీటర్ షేక్ సాధక్ వల్లి అనే వ్యక్తి నుంచి మట్కా చిట్టీలు, నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
CTR: బంగారుపాలెం మండలం వెలుతురుచేను గ్రామానికి చెందిన సుందరం కుటుంబంపై మూకుమ్మడి దాడి జరిగినట్లు SI ప్రసాద్ తెలిపారు. ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా, ఇందుకు కారణం సుందరం అని భావించిన మృతుడి కుటుంబ సభ్యులు ఆయన ఇంటిపై దాడి చేసి గడ్డివామును తగలబెట్టారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఏడుగురిపై కేసులు నమోదు చేసి వారిని రిమాండ్కు పంపించినట్లు SI తెలిపారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో జరుగుతున్న పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ పి. కృష్ణ మోహన్ రెడ్డి పర్యవేక్షించారు. బుధవారం పట్టణంలోని ప్రధాన వీధుల్లో జరుగుతున్న పనులను ఆకస్మిక తనిఖీ చేపట్టారు. పట్టణ ప్రజలు పిర్యాదు మేరకు పలు ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ బాగా లేకపోవడంతో శుభ్రం చేయించారు. అనంతరం పట్టణ ప్రజలు చెత్త సైడు కాలువలో వేయవద్దన్నారు.
NDL: రుద్రవరం మండల పరిషత్ సమావేశం భవనంలో ఎంపీపీ బాలస్వామి అధ్యక్షతన రేపు సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో భాగ్యలక్ష్మి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీ మండల కోఆప్షన్ సభ్యులు, గ్రామపంచాయతీ సర్పంచులు, మండల స్థాయి శాఖల అధికారులు, పంచాయితీ కార్యదర్శులు అందరూ హాజరుకావాలని కోరారు.
VSP: భారత ఉపరాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ ఘన విజయాన్ని సాధించారు. 98.2% పోలింగ్లో 452 ఓట్లతో గెలుపొందారు. ఈ విజయోత్సవం సందర్భంగా ఉత్తర నియోజకవర్గం కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి, ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి.విష్ణుకుమార్ రాజు, ఇతర నేతలు మిఠాయిలు పంచుకున్నరు.
AKP: కోటవురట్ల మండలం నీలిగుంట గ్రామానికి చెందిన కన్నం రెడ్డి గోవింద్కు సీఎం సహాయ నిధి మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న గోవిందు తీసుకున్న చికిత్సకు అయిన ఖర్చుకు సంబంధించి హోంమంత్రి వంగలపూడి అనిత సీఎం సహాయనిది మంజూరు చేయాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు మంజూరైన రూ. 37,515 చెక్కును మండల టీడీపీ అధ్యక్షులు లింగన్నాయుడు మంగళవారం రాత్రి లబ్ధిదారుడికి అందజేశారు.
ASR: డుంబ్రిగుడలో ఈనెల 15న సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు మండల ఇంఛార్జ్ ఎంపీడీవో ఎన్.వి.వి నరసింహ మూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్న సర్వ సభ్య సమావేశం స్థానిక ఎంపీపీ ఈశ్వరి అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు. మండలంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు ఈ సమావేశానికి హాజరవ్వాలన్నారు.