• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

శ్రీ మఠం హుండీల ద్వారా రూ.3.29 కోట్ల ఆదాయం

NLR: మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠం ఫిబ్రవరి నెలకు సంబంధించిన హుండీ లెక్కింపు బుధవారం సాయంత్రానికి ముగిసిందని శ్రీ మఠం మేనేజర్ వెంకటేశ్ జోషి తెలిపారు. హుండీ లెక్కించగా.. రూ.3,21,05,005 కరెన్సీ, రూ.8,10,100 చిల్లర నాణేలతో కలిపి మొత్తం రూ.3,29,15,105 వచ్చిందన్నారు. 58 గ్రాముల బంగారం, 1,280 గ్రాముల వెండి వచ్చినట్లు వెల్లడించారు.

February 19, 2025 / 08:11 PM IST

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

NLR: వరికుంటపాడులో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శ్రీవారి కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కోలాట నృత్యాన్ని ఆయన వీక్షించారు.

February 19, 2025 / 07:52 PM IST

‘సృజనాత్మకతో బోధన చేయండి’

SKLM: ఆమదాలవలస పట్టణ హైస్కూల్లో అంగన్వాడీ కార్యకర్తలకు రెండవ రోజు జ్ఞాన జ్యోతి శిక్షణా కార్యక్రమం బుధవారం జరిగింది. కార్యకర్తలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంఈవో రాజేంద్రప్రసాద్ అన్నారు. శిక్షణలో నేర్చుకున్న మెలుకువలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత పెంపొందేలా బోధన చేయాలని వారికి సూచించారు.

February 19, 2025 / 07:44 PM IST

ఆలపాటిని భారీ మెజారిటీతో గెలిపించాలి

కృష్ణా: కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యావంతులు బాగా ఆలోచించి ఓటు వేయాలన్నారు.

February 19, 2025 / 07:40 PM IST

బ్యాంకర్లతో ఎంపీడీవో సమావేశం

NDL: సంజామల ఎంపీడీవో కార్యాలయంలో బ్యాంకర్లతో బుధవారం ఎంపీడీవో సాల్మన్ సమావేశమయ్యారు. వివిధ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న వాటిని ఇవాళ మొదటి విడత స్క్రూటినీ చేసినట్లు పేర్కొన్నారు. అర్హులను ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలకు పిలుస్తామని, ఆ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఎంపీడీవో సాల్మన్ వెల్లడించారు. 

February 19, 2025 / 07:35 PM IST

‘స్నేహభావంతో మమేకం కావడానికే పల్లె నిద్ర’

VZM: ప్రజలతో పోలీసులు స్నేహభావంతో మమేకం కావడమే పల్లెనిద్ర కార్యక్రమం ఉద్దేశ్యమని ఎస్సై ఎల్ దామోదర్ రావు అన్నారు. పోలీసుల పల్లెనిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి చీపురుపల్లి మండలంలోని గొల్లలములగాం గ్రామంలో పోలీస్ సిబ్బందితో పల్లె నిద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ యువత సహకరించాలని కోరారు.

February 19, 2025 / 07:33 PM IST

మోదుకొండమ్మ అమ్మవారి సన్నిధిలో ఎమ్మెల్యే

SKLM: అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో భాగంగా పాడేరులో ఉన్న మోదు కొండమ్మ తల్లిని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలు సుఖసంతోషాలతో ఉండాలని మొక్కు కున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆయనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

February 19, 2025 / 07:11 PM IST

మార్చి 2వ తేదీలోగా సర్వే పూర్తి కావాలి: కలెక్టర్‌

NLR: సున్నా పేదరికమే లక్ష్యంగా గ్రామాల్లో సచివాలయ సిబ్బందిచే పి4 సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జి.రాజకుమారి ఎంపీడిఓలను ఆదేశించారు. బుధవారం నంద్యాల కలెక్టరేట్ ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి పి4 సర్వే ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిపిఓ వేణుగోపాల్, డిఎల్డిఓ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

February 19, 2025 / 07:08 PM IST

ఉరివేసుకుని 8వ తరగతి బాలిక ఆత్మహత్య

SKLM: మందస మండలం లోహరిబంధ గ్రామంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ బాలిక స్థానిక పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. మధ్యాహ్న భోజనం అనంతరం సమీపంలో ఉన్న జీడీ తోటలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హరిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 19, 2025 / 06:26 PM IST

‘ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యతకు పెద్దపీట వేయాలి’

VSP: NTR కాలనీల్లో జరుగుతున్న ఇళ్ల నిర్మాణాల నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులను వేగవంతంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఇళ్ల నిర్మాణాల పురోగతి, ఇసుక సరఫరా, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. అధికారులందరూ బాధ్యత వహించాలని అన్నారు.

February 19, 2025 / 05:35 PM IST

‘బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. రాకపోకలు నిషేధం’

KKD: గొల్లప్రోలు మండలం చెందుర్తిలో పుష్కర – పోలవరం కాలువ గట్టుపై ఉన్న కోళ్ల ఫారంలో మరో 2500 కోళ్లు మంగళవారం మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకూ ఈ ఒక్కఫారంలోనే 6వేల కోళ్లు చనిపోయాయి. చనిపోయిన కోళ్లను జనావాసాలకు దూరంగా గోతులు తీసి ఖననం చేశారు. బర్డ్ ఫ్లూ అనుమానిత కోళ్లు ఖననం చేసిన ప్రదేశం కాబట్టి ఇక్కడ ప్రజలు, వాహన రాకపోకలు నిషేధమంటూ ఫ్లెక్సీలు పెట్టారు.

February 19, 2025 / 05:15 PM IST

‘నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలే’

KKD: మహాశివరాత్రి ఉత్సవాల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ హెచ్చరించారు. కాకినాడ జిల్లా సామర్లకోట పంచరామ క్షేత్రంలో బుధవారం ఈవో బల్ల నీలకంఠం అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ప్రమాదాలు వాటిల్లకుండా, పూర్తి భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

February 19, 2025 / 05:07 PM IST

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

CTR: పుంగనూరు పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్‌లో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువకులు, పెద్దలు, మహిళలు జై భవాని, జై శివాజీ మహారాజ్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో హిందూ సంఘాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

February 19, 2025 / 05:01 PM IST

‘సర్వేను వేగవంతం చేయాలి’

కోనసీమ: భూముల పునః సర్వే ప్రక్రియను వేగవంతం చేసి మార్చి నెలాఖరుకి గ్రౌండ్ వర్క్ పూర్తి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ రెవెన్యూ, సర్వే సిబ్బందిని ఆదేశించారు. బుధవారం అమరావతి నుంచి రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ ప్రభాకరరెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.

February 19, 2025 / 05:00 PM IST

నంద్యాల సభకు పుంగనూరు నుంచి ఉచిత బస్సులు

CTR: SDPI పార్టీ ఆధ్వర్యంలో నంద్యాలలో రేపు (గురువారం) జరిగే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని పార్టీ జిల్లా నాయకుడు యూసుఫ్ తెలిపారు. ఇవాళ పుంగనూరులో ఆయన మాట్లాడుతూ ‘వక్ఫ్ రక్షణ సమాజ సంక్షేమం’ అనే నినాదంతో సభను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే పుంగనూరు నుండి వెళ్లేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

February 19, 2025 / 05:00 PM IST