PLD: విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కారంపూడి సీఐ పి. శరత్ బాబు సూచించారు. సోమవారం కారంపూడిలోని ఓ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈగల్ క్లబ్స్ ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేయాలని ఈగల్ క్లబ్ ప్రాముఖ్యతను వివరించారు.
ప్రకాశం: కంభం పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మరియు మోటారు వాహన చట్టం (MV Act) ఉల్లంఘనలపై పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.
GNTR: పొన్నూరు పట్టణం 8వ వార్డు నార్త్ క్యాబిన్పేటకు చెందిన ఇఊరి శ్రీనివాసరావు (27) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలక్ట్రిషన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: రేపల్లె మండలంలోని ప్రభుత్వ మరియు జెఎల్బి జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను సోమవారం ఆర్డీవో రామలక్ష్మి పరిశీలించారు. పరీక్ష గదులు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.
AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీలు, మహిళా సంఘాలు, చిన్నారులు పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని బాలికల ఆరోగ్యం క్షీణించకూడదని, ఎవరు బాల్యవివాహాలను ప్రోత్సహించరాదు అని హెచ్చరించారు.
అనంతపురంలోని SSBN కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
ASR: పాడేరు ఐసీడీఎస్ ఆఫీస్ వద్ద అంగన్వాడీలు సోమవారం రిలే నిరాహార దీక్షకు దిగారు. రూ.26వేల కనీస వేతనం, 1810 మినీ కేంద్రాల అప్గ్రేడేషన్, గ్రాట్యుటీ మార్గదర్శకాలు, వేతనంతో కూడిన మెడికల్ లీవ్స్తో పాటు రూరల్, అర్బన్ తేడాలేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ATP: కర్నూలు జిల్లాకు చెందిన న్యాయవాది పవన్ కుమార్పై సీఐ విక్రమసింహా దౌర్జన్యం చేసినందుకు నిరసనగా తాడిపత్రి న్యాయవాదులు విధులను బహిష్కరించారు. సోమవారం కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉంటూ తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులైన పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.
NLR: నెల్లూరులోని 26వ డివిజన్ విక్రమ్ నగర్ ప్రాంతంలో కార్పొరేషన్ నందన్ అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. డివిజన్ పరిధిలో అన్ని భవనాలను అసెస్మెంట్ పరిధిలోకి తీసుకురావాలని ఆదేశించారు. 100% నిర్దేశించిన ఆస్తి, తాగునీటి కుళాయి, ఖాళీ స్థలం పన్నులను వసూళ్లు చేయాలని ఆదేశించారు.
సత్యసాయి: వేసవి కాలం దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ప్రారంభించినట్లు కదిరి డీఎస్పీ శివన్నారాయణ స్వామి తెలిపారు. సోమవారం జాతీయ రహదారిపై డీఎస్పీ కార్యాలయం ముందు రెండు చలివేంద్రాలను అధికారులు ప్రారంభించారు. ఎంపీడీఓ పొలప్ప, గురురాజు గుప్తా ముఖ్య అతిథులుగా హాజరై వీటిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
కోనసీమ: కే. గంగవరం మండలంలోని తామరపల్లి గ్రామంలో ప్రజల రాగినీటి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ తోకల మంగ శ్రీనివాస్ తెలిపారు. సర్పంచ్ స్థానిక నాయకులతో కలిసి సోమవారం గ్రామంలో నూతనంగా నిర్వహించనున్న సురక్షిత త్రాగు నీటి ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నాయకులు నెక్కంటి బాలకృష్ణ, గన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.
E.G: కర్నూలులో న్యాయవాది ఎం.పవన్ కుమార్పై 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ, సిబ్బంది దాడి చేయడం హేయకరమని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు ఘటనను నిరసిస్తూ సోమవారం సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, న్యాయవాదులు రాజమండ్రి సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. న్యాయవాదులు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
TPT: సూళ్లూరుపేట టోల్ ప్లాజా వద్ద షాపుల ముందు ఉంచిన కంటైనర్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం తాత్కాలిక చర్యగా దీనిని ఏర్పాటు చేశామని టోల్ అధికారులు చెబుతున్నా, ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కంటైనర్ కారణంగా రహదారి వెడల్పు తగ్గి వాహనాలు నిలిచిపోవడంతో రద్దీ మరింత పెరిగిందని స్థానికులు అంటున్నారు.
కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ములుపూరి గోవింద ప్రభాకర్ రావు మరణించారు. ఆయన అంతిమయాత్ర మంగళవారం ఉదయం 9 గంటలకు కపిలేశ్వరపురం గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభాకర్ రావుకు నివాళులర్పించి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన అంకితభావంతో సేవలందించారని నాయకులు కొనియాడారు.
TPT: సూళ్లూరుపేటలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానంపై తీవ్ర వివాదం చోటుచేసుకుంది. సత్యం జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 233 మంది విద్యార్థుల్లో 227 మందిని ఒకే ప్రైవేట్ కళాశాలలో పరీక్షలు రాయడానికి కేటాయించడం పట్ల తల్లిదండ్రులు, విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది కొన్ని పాఠశాలలు పట్ల వివక్షత చూపుతున్నరన్నారు.