NLR: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ విమర్శించారు. ప్రజలు వారి మాటలు నమ్మే పరిస్థితిలో లేరని కూటమి ప్రభుత్వం 90 శాతం హామీలను అమలు చేసిందని ఆయన తెలిపారు. అందుకే బుధవారం అనంతపురంలో నిర్వహించనున్న ‘సూపర్ సిక్స్.సూపర్ హిట్’ సభకు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
E.G: కడియంలో ఉన్న శ్రీ విజయ బాలా త్రిపుర సుందరి దేవి పీఠంలో శ్రీ విజయ కనకమహాలక్ష్మి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఈనెల 22వ తేదీ నుంచి వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం పీఠాధిపతులు శ్రీ పెమ్మిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో పందిరి రాట ముహూర్తం వైభవంగా నిర్వహించారు. ఈ మహోత్సవంలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని వెల్లడించారు.
CTR: కుప్పం ఎంపీడీవోగా వెంకటేశ్వర్లు ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలో ఎంపీడీవోగా పని చేస్తున్న ఆయన బదిలీపై కుప్పం వచ్చారు. అధికారులు, ప్రజా ప్రతినిధులను సమన్వయం చేస్తూ మండల అభివృద్ధికి శక్తి వంచనతో కృషి చేస్తానని ఎంపీడీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవోకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
KDP: ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి చూపించామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. ఆయన తన అనుచరులతో కలిసి ఇవాళ అనంతపురం సీఎం సభకు వెళ్లారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అయ్యాయన్నారు. ఈ పథకాల వల్ల ప్రతి ఇంటికి మేలు జరిగిందన్నారు.
VZM: రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నవతారోత్సవలో భాగంగా బుధవారం “ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటేషన్” కార్యక్రమం జరిగింది. 3 కేటగిరిలలో సుమారు 156 విద్యార్థులు హాజరైనట్లు ఛైర్మన్లు దినేష్, శశి కుక్రెజ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ విజయ్ అగర్వాల్, సెక్రటరీ ఉదయ్,శంకర్ రెడ్డి పాల్గొన్నారు.
W.G: రాష్ట్రంలో సంక్షోభంతో మూతపడుతున్న టెక్స్ టైల్స్, స్పిన్నింగ్ మిల్స్ పరిశ్రమలను కేంద్ర, రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆఫ్ అక్కమాంబ టెక్స్ టైల్స్ అధ్యక్షులు డివివియస్ వర్మ కోరారు. యూనియన్ (ఏఐటీయూసీ) కార్యవర్గ సమావేశం బుధవారం యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి వర్మ అధ్యక్షత వహించి మాట్లాడారు.
KDP: మైదుకూరు పట్టణంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మైదుకూరు తాలూకా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, అసోసియేషన్ అధ్యక్షుడు వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఇవాళ బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్ను కలిసి సమస్యను వివరించారు. సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తానని ఆర్డీవో హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు.
అన్నమయ్య: ఆఫర్లు, డిస్కౌంట్లు కోసం అమూల్యమైన మీ వ్యక్తిగత సమాచారం ఇతరులతో పంచుకోవద్దని రైల్వే కోడూరు గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. రైల్వే కోడూరులో ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వెబ్సైట్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దన్నారు. ఈమెయిల్, ఫోన్ నంబర్ ఇవ్వడం ద్వారా చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.
తూ.గో జిల్లాలోని రైతులు యూరియా కొరత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు. టోకెన్ పొందిన ప్రతి రైతుకు తప్పనిసరిగా యూరియా అందజేస్తామని స్పష్టం చేశారు. బుధవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద రైతు సేవా కేంద్రాల సహాయకులతో సమావేశం నిర్వహించారు. రైతులకు జేసీ నేతృత్వంలోని కమిటీ సిఫారసుల మేరకు యూరియా కేటాయింపు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు.
NLR: కొడవలూరు మండలం టపాతోపు జాతీయ రహదారిపై కారంపొడి లోడ్తో వెళ్తున్న లారీ నుంచి పొడి లీక్ అయింది. అది పెద్ద ఎత్తున రోడ్డు మీద పడటంతో అటుగా వెళుతున్న వాహనదారుల కళ్లల్లో పడింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. లారీని వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టడం వల్లే కారంపొడి రోడ్డు మీద పడినట్లు సమాచారం.
VSP: ఆనందపురం మండలం మిందివానిపాలెం హైవేలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గొర్రెల మందపైకి లారీ దూసుకెళ్లడంతో 25 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో గొర్రెల కాపరి ఆవేదన వ్యక్తం చేశాడు. పశుపోషకులు పెద్ద ఎత్తున నష్టపోయారని, ప్రభుత్వం నుంచి తక్షణమే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ ఎస్సై పాపారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
KDP: టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జీ బిటెక్ రవి కృషితో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి బస్ సౌకర్యం కల్పించారని ఆ పార్టీ మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర తెలిపారు. ఇవాళ వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపక, సిబ్బంది, ప్రజల సౌకర్యార్థం ఈనెల 11వ తేదీ నుంచి IIIT కి బస్ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
BPT: చీరాల మండలం వాడరేవు బీచ్ నందు పర్యాటకుల కోసం నూతనంగా నిర్మిస్తున్న పబ్లిక్ టాయిలెట్స్, వెయిటింగ్ హాల్ నిర్మాణ పనులను బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని ఎక్కడ రాజీ పడవద్దు అని మహేంద్ర నాథ్ ఏఈకి సూచించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.
కోనసీమ: రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. రావులపాలెం శెట్టిబలిజ రామాలయం వద్ద ప్రభుత్వం నూతనంగా రేషన్ లబ్ధిదారులకు అందిస్తున్న స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురికి స్మార్ట్ కార్డులు అందించారు.
ప్రకాశం: కొమరోలు మండలం హనుమంతరాయుని పల్లె మండల ప్రాథమిక పాఠశాలలో పిల్లలకు ప్రభుత్వ కంటి వైద్యులు డాక్టర్ సుదర్శన్ వైద్య పరీక్షలను నిర్వహించారు. దృష్టిలోపం ఉన్నవారికి కంటి అద్దాలను ఉచితంగా ప్రభుత్వమే అందజేస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులలో దృష్టిలోపం లేకుండా చేయడానికి ప్రభుత్వం కంటి వైద్య పరీక్షలను నిర్వహిస్తుందని అన్నారు.