VSP: రంజాన్ పండుగ సెలవులో మార్పు చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రేమ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. క్యాలెండర్ ప్రకారం ఈరోజు ఉన్న సెలవును రద్దు చేసి, దానిని రేపటికి (శనివారం) మారుస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈరోజు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు యధాతథంగా పనిచేస్తాయని, రేపు మాత్రం సెలవు ఉంటుందని స్పష్టం చేశారు.
ATP:పామిడి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు మొక్కజొన్న, మామిడి పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 30 ఎకరాలలో పంటలు నేలకొరిగినట్లు మండల వ్యవసాయ అధికారి విజయకుమార్ శుక్రవారం మీడియాతో తెలిపారు. పంట నష్టంపై ఉన్నత అధికారులకు నివేదిక పంపినట్లు హార్టికల్ అధికారి మిత్ర పేర్కొన్నారు.
VZM: కొత్తవలస మండలం పాత కొత్తవలసలో కలకలం రేపిన మృత దేహాన్ని ఎస్.కోట మండలం ధర్మవరానికి చెందిన అల్లు కిషోర్ (39)గా బంధువులు గుర్తించారు. వారి సమాచారం మేరకు ఈనెల 8న స్థానిక ఒడ్డిపేటలో ఓ ఫంక్షన్కి వచ్చి కనిపించలేదని మృతుని తండ్రి సత్యరావు తెలిపాడు. ఇవాళ ఉదయం మృతుని తమ్ముడు కోటి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: ఆనందపురం నుంచి తగరపువలస వెళ్లే జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం మహిళను ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గురువారం అర్ధరాత్రి స్థానికంగా ఉంటున్న మహిళ రోడ్డు పక్కనుంచి వెళ్తుండగా వాహనం ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. భీమిలి ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బాపట్ల: పర్చూరు మండలం పోతుకట్ల గ్రామానికి చెందిన యలవదల రజినికి అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6,00,000 ఎల్ఓసీ చెక్ మంజూరైంది. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సిఫారసుతో ఈ చెక్ను టీడీపీ సీనియర్ నేత మానం హరిబాబు, పార్టీ నాయకులు కలిసి అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పేదలకు అండగా సీఎం రిలీఫ్ ఉంటుందన్నారు.
ATP: తాడిపత్రి పట్టణంలోని జీవీపీ కాలనీలో ఉగాది పండుగను పురస్కరించుకుని శ్రీ చౌడేశ్వరీదేవి అమ్మవారి జ్యోతుల ప్రదర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేకే పూజలు, పల్లకీ సేవ చేసి జ్యోతులను ఊరేగిస్తూ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకలో కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ASR: బొర్రా గుహల ప్రధాన రహదారి కోతకు గురై ప్రమాదకరంగా మారింది. కల్వర్టుల లేమితో ములియగుడ నుంచి బొర్రా గుహల వరకు సుమారు 7 కిలోమీటర్ల మేర రహదారి శిథిలావస్థకు చేరుకుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పలు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
కృష్ణా: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యూస్ ఛానల్ ఏపీ బ్యూరో రిపోర్టర్ కేసంనేని పూర్ణచంద్రరావు మృతి పట్ల ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయవాడ పడమటిలంకలోని స్వగృహంలో పూర్ణ భౌతిక కాయానికి ఎమ్మెల్యే రాము శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. పూర్ణచంద్రరావు మృతి విచారకరమని అన్నారు.
CTR: పలమనేరు మాజీ MLA ఠాణేదార్ చిన్న రాజన్ (108) ఇవాళ ఉదయం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1967లో స్వతంత్ర పార్టీ తరఫున పలమనేరు నుంచి MLAగా విజయం సాధించారు. నిస్వార్థ స్వాతంత్య్ర సమరయోధుడిగా గుర్తింపు పొందారు.
గుంటూరు మిర్చి యార్డు వద్ద ఎన్టీఆర్ విగ్రహం చేయి విరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఘటనకు కారణం వర్షమా లేక కావాలనే ధ్వంసమా అన్నది ఇంకా స్పష్టత లేదు. ఈ సంఘటనపై టీడీపీ నేతలు తీవ్రంగా స్పందించి, దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్ధాపురం గ్రామంలో శుక్రవారం జరగనున్న శ్రీ కొల్లాపూరమ్మ స్వామి ఆరో ఉగాది బోనాల జాతరకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.15 వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సాగునీటి సంఘం అధ్యక్షుడు పెద్దశివయ్య, సుబ్బయ్య, కటేశ్వరయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
KKD: కరప మండలం గొర్రిపూడి శివారులో పేకాట స్థావరంపై గురువారం సాయంత్రం ఎస్ఐ తోట సునీత ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
బాపట్ల: చీరాల వైకుంఠపురానికి చెందిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని బుధవారం చివరి పరీక్ష రాయడానికి వెళ్లి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు ప్రారంభించారు. విద్యార్థిని ఆచూకీ కోసం విచారణ కొనసాగుతోంది.
అన్నమయ్య: కురబలకోట సర్కారుతోపు వద్ద గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మదనపల్లె చౌడేశ్వరిదేవి ఉత్సవాలకు వచ్చి తిరిగి వెళ్లే క్రమంలో బైక్ డివైడర్ను ఢీకొన్నట్లు తెలుస్తోంది. మృతులు B.కొత్తకోటకు చెందిన సురేంద్ర, మదనపల్లికి చెందిన మాధవ, ముదివేడుకు చెందిన మహేష్గా పోలీసులు గుర్తించారు. కాగా, ముగ్గురు మంచి స్నేహితులుగా సమాచారం.
KDP: RTPP ప్లాంట్లో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్లాంట్ అటెండెంట్ త్యాగరాజు గాయపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న త్యాగరాజు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వేలూరు తరలిస్తుండగా, మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.