NLR: వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల మండల ప్రజా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న టీచర్ లోకసాని వెంగయ్య బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తల్లిదండ్రులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు DEO డాక్టర్ ఆర్ బాలాజీ రావు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు MEO -2 రమణయ్య తెలిపారు. సస్పెండ్ కాపీ ఇచ్చేందుకు టీచర్ అందుబాటులో లేరని తెలిపారు.
కర్నూలు: జిల్లాలోని తుంగభద్ర జలాశయానికి గురువారం వరద ప్రవాహం కొనసాగుతోంది. మొత్తం సామర్థ్యం 105.788 టీఎంసులు కాగా, ప్రస్తుతం 77.144 టీఎంసుల నీరు ఉంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1,633 అడుగులు కాగా, ప్రస్తుతం 1, 625. 20 అడుగులుంది. జలాశయానికి 29, 645 క్యూసెక్కుల ఇన్లో వచ్చిపోతుండగా, 1,701 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు.
CTR: సదుం మండలం భట్టువారిపల్లి భారతం మిట్టలో ఈనెల 7 నుంచి మహాభారత యజ్ఞం ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో దీనికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. భాగవతారిణి జ్యోత్స్న ఆధ్వర్యంలో మధ్యాహ్నం హరికథా కాలక్షేపం, నాట్య కళామండలి వారి ఆధ్వర్యంలో రాత్రివేళ నాటక ప్రదర్శన ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.
SKLM: ఆముదాలవలస మండలం దూసిపేట గ్రామానికి వెళ్ళే రహదారి పూర్తిగా అధ్వానంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల్లో నీళ్లు చేరి బురదమయమైంది. తోగారం, దూసి నుంచి ఈ రహదారి మీదుగా ఆమదాలవలస, రాగోలుకు వెళ్లే వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.
SKLM: సూపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గం తండెంవలస గ్రామంలో గురువారం జరిగినది .ఈ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి పార్టీ పథకాలు ప్రజలు అందరికీ అందుతున్నాయా? లేదా? ప్రభుత్వం పైన మీ యొక్క అభిప్రాయం అన్నీ అడిగితె ప్రజలు చాలా సంతృప్తిగా అన్నీ అందినట్లు ప్రజలు తెలియపరిచారు అని మండల టీడీపీ నాయకులు తెలిపారు.
NDL: శ్రీశైలం మండలం సున్నిపెంట ఫిష్ మార్కెట్ సమీపంలో బుధవారం రాత్రి 11 గంటల సమయంలో చిరుత పులి 4 కుక్క పిల్లలపై దాడి చేసింది. రెండింటిని చంపేసి, ఒక పిల్లను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. శివారు ప్రాంతాలలో చిరుతపులుల సంచారం పరిపాటిగా మారిందని అంటున్నారు. రాత్రి వేళలో తీవ్ర భయాందోళనకు గురవుతున్నామని చెబుతున్నారు.
NLR: చెత్త రహిత గ్రామాలుగా పంచాయతీలను తీర్చిదిద్దాలని ZP CEO మోహన్ రావు అన్నారు. గురువారం ఉదయం మనుబోలులోనే అంబేద్కర్ నగర్లో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. ఇంటింటికి తిరిగి చెత్తను ఎలా సేకరిస్తున్నారో తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 250 గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి చెత్త రహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతామన్నారు.
KRNL: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన లా మూడేళ్ల కోర్సులో 6వ సెమిస్టర్, ఐదేళ్ల కోర్సులో 10వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఫలితాల కోసం రాయలసీమ యూనివర్సిటీ అధికారిక వెబ్ సైట్ను సందర్శించాలని గురువారం తెలిపారు.
అన్నమయ్య: మండల సర్వసభ్య సమావేశాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వెంకటేశులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. గుర్రంకొండ స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సీతమ్మ ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తప్పక హాజరు కావాలని ఆయన కోరారు.
VZM: మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ సీఐ బంగారు పాప సూచించారు. స్థానిక జమ్ము నారాయణపురం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మత్తుకు అలవాటు పడితే జీవితం అస్తవ్యస్తంగా మారుతుందన్నారు. ప్రస్తుతం చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయని వాటిపై అవగాహన పెంచుకోవాలన్నారు.
కోనసీమ: జెడ్.మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్గా నియమితులైన సలాది బాల సుబ్రహ్మణ్యం మంగళవారం మండపేట టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకంతో పీఎసీఎస్ ఛైర్మన్గా నియమించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేను దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు.
VSP: జిల్లాలో చిన్నపాటి వర్షానికే ఫుట్ పాత్ కుంగిపోయిన ఘటన విశాఖలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంవీపీ కాలనీ డబుల్ రోడ్డులో కొద్దీ రోజులుగా భూగర్భ విద్యుత్ కేబుల్ పనుల చేస్తున్నారు. ఫుట్ పాత్ను ఆనుకుని తవ్వడంతో మట్టి జారిపోయి సుమారు వంద మీటర్ల మేర టైల్స్ పక్కకు ఒరిగిపోయాయి. ప్రస్తుతం పాదచారులు ఫుట్ పాత్పై నడిచే వీలు లేకుండా పోయింది అని అసహనం వ్యక్తం చేశారు.
NLR: కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేసి నెల్లూరు జిల్లాని అగ్రస్థానంలో నిలపాలని పార్లమెంటరీ దిశా కమిటీ ఛైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎంపీ మాట్లాడుతూ.. పథకాల అమలులో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు. వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
TPT: ఫేస్బుక్లో ‘వైష్ణవ యాత్రాస్’ పేరిట ప్రభాకరాచార్యులు ఓ పేజీ నడుపుతున్నారు. శ్రీవారి అభిషేకం, ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్, రూ.300 దర్శన టిక్కెట్లు ఇస్తామంటూ అతను ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి నకిలీ వ్యక్తులు, వెబ్సైట్లను నమ్మి మోసపోవద్దని టీటీడీ సూచించింది. టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టిక్కెట్లు బుక్ చేసుకోవాలని భక్తులకు తెలిపింది.
SKLM: మందస, వజ్రపు కొత్తూరు మండలాల్లో మంగళవారం కార్గో ఎయిర్ పోర్టు సర్వే బృందాలు సర్వే చేయడానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఆయా గ్రామాల ప్రజలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు అడ్డుకోవడంతో సర్వే చేపట్టేందుకు వచ్చిన సర్వే బృందాలు తిరిగి వెళ్లిపోయాయి.