సత్యసాయి: సోమందేపల్లి మండల ఎస్ఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన సుధాకర్ యాదవ్ మంత్రి సవితను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సోమందేపల్లిలో శాంతిభద్రతలు కాపాడేందుకు తమవంతు కృషి చేస్తానని ఎస్ఐ తెలిపారు. మంత్రి సవిత ఆయనకు అభినందనలు తెలియజేసి విధుల్లో సమర్థంగా పనిచేయాలని సూచించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి శుక్రవారం రావులపాలెం వాస్తవ్యులు కాశీ విశ్వనాధ రవి కుమార్ కుటుంబ సభ్యులు రూ.51, 116 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిబ్బంది వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
కోనసీమ: ఆలమూరులో కుంగ్ఫూ, కరాటే మాస్టర్ క్లబ్ల బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని మాట్లాడారు. కలవచర్ల గ్రామానికి చెందిన వాడవిల్లి అంజి బాబు చిన్ననాటి నుండి కుంగ్ఫూ, కరాటే పై ఆసక్తితో బ్లాక్ బెల్ట్ వరకు శిక్షణ పొంది ఫైట్ మాస్టర్గా ఎదగడాన్నారు. అంజిబాబు మన ప్రాంతం యువకుడు అవడం అభినందనీయమన్నారు.
VSP: హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన యువతి అంజలి జగదాంబ జంక్షన్లో బంధువుల ఇంటికి వెళ్లింది. అనంతరం తన వదినతో కలిసి ఆటోలో వేపగుంట ఫంక్షన్ హాల్కు వెళ్లే క్రమంలో ఆటోలో లగేజ్తో పాటు బంగారం ఉన్న బ్యాగును మరిచిపోయింది. పెందుర్తి క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సూరిబాబు తన సిబ్బంది, సాంకేతిక పరిజ్ఞానంతో ఆటోను గుర్తించి, బాధితురాలికి తన వస్తువులను అప్పగిచారు.
బాపట్ల: వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతి పరిధిలో లక్ష్మీపురం గ్రామంలో రూ. 30 లక్షలతో శుక్రవారం సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధ్యక్షులు జంగిలి రాముడు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాలకొండయ్య ఆదేశాల ప్రకారం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు.
KRNL: ఆదోని-ఆస్పరి రోడ్డు గుంతలమయమై ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారింది. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేసినా.. సంబంధిత అధికారులు కేవలం గరుసు పోసి కాలక్షేపం చేస్తున్నారని వాహనదారులు, స్థానికులు మండిపడుతున్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారుల్లో చలనం లేదని, ఆదోని MLA పార్థసారథి వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు.
KKD: జిల్లా నుంచి పెద్దపులి తిరిగి పోలవరం జిల్లాకు వెళ్లిపోయింది. రాజఒమ్మంగి మండలం వద్ద పులి సంచారాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పలు మండలాలకు ఏ దారిలో వచ్చిందో, తిరిగి అదే దారిలో పోలవరం వైపు వెళ్లిపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులి భయం తొలగిపోవడంతో నియోజకవర్గ ప్రజలు ఊరట చెందుతున్నారు.
విశాఖ ప్రజలు ప్రతి శుక్రవారం ‘డ్రైడే’ పాటించాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ సూచించారు. ఇంటి బయట పూల కుండీలు, కొబ్బరి బొండాలు, ఖాళీ బాటిళ్లలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. వాటర్ ట్యాంకులపై మూతలు పెట్టాలన్నారు. దీర్ఘకాలికంగా నీటి నిల్వ ఉన్నచోట దోమలు వృద్ధి చెందుతాయన్నారు. విశాఖను దోమల రహిత నగరంగా తీర్చి దిద్దుద్దామని పిలుపునిచ్చారు.
SKLM: మండల కేంద్రంలో జలుమూరులో రెండు దశాబ్దాల క్రితం లక్షలాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన బస్సు సెంటర్ నేడు శిథిలావస్థకు చేరింది. ఏ క్షణాన నేలమట్టమై ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు వాపోతున్నారు. ప్రారంభం నుంచి నేటి వరకు షెల్టర్ ఉందే తప్ప ఒక్క బస్సు ఆగలేదని గ్రాయస్తులు తెలిపారు.
NLR: జిల్లాలో 48వ డివిజన్ ఖతీజా మసీదు ఇఫ్తార్ విందులో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మసీదు సోలార్ యూనిట్ కోసం రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఇమామ్లు, మౌజాంలకు రంజాన్ తోఫాగా నూతన వస్త్రాలు, రూ. 10 వేల నగదు అందజేశారు. ముస్లిం సోదరులతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముస్లింల సంక్షేమానికి పాటుపడతానని మంత్రి భరోసా ఇచ్చారు.
ప్రకాశం: రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలో మొక్కజొన్న రైతులు ఆర్గనైజర్ల మోసానికి గురయ్యారు. అధిక దిగుబడి వస్తుందని నమ్మబలికి విత్తనాలు ఇచ్చినప్పటికీ, పంట కోతకు కేవలం అరటన్ను మాత్రమే దిగుబడి రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ఒక్కో ఎకరానికి సుమారు రూ.35,000 వరకు నష్టపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సత్యసాయి: గత వైసీపీ యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా యువతను మోసం చేసిందని మంత్రి సవిత విమర్శించారు. శుక్రవారం సోమందేపల్లి టీడీపీ కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఉగాది సందర్భంగా మంత్రి లోకేశ్ 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
E.G: యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన ప్రకారం ఉగాదిని పురస్కరించుకుని 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ చేసినట్లు రాజానగరం MLA బత్తుల బలరామకృష్ణ శుక్రవారం తెలిపారు. ఇప్పటి వరకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయుల పోస్టులు, 6 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ ప్రభుత్వ శాఖల్లో 9 వేల పోస్టులను కూటమి ప్రభుత్వం భర్తీ చేసిందన్నారు.
ప్రకాశం: చంద్రశేఖరపురం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈనెల 25న బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ఎల్ బ్రహ్మయ్య తెలిపారు. మండలంలో ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరు కావాలని కోరారు.
GNTR: కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే 6.28 లక్షల ఉద్యోగాలు కల్పించిందని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో 25 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం భారీ పెట్టుబడుల ఒప్పందాలు చేసుకుందని వివరించారు. గ్రూప్-1, 2, పోలీస్, విద్య, పరిశ్రమల విభాగాల్లో పెద్ద ఎత్తున నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు.