VSP: రాబోయే ఏ ఎన్నికల్లోనైనా భీమిలిలో వైసీపీ ఘనవిజయం సాధించి జెండా ఎగరవేయడం ఖాయమని భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర (సిరమ్మ) ధీమా వ్యక్తం చేశారు. అవనాంలో జరిగిన మండల స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామ కమిటీలను వెంటనే పూర్తి చేసి పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
SKLM: ఎచ్చెర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్ అన్నారు. సోమవారం నియోజకవర్గ కార్యాలయంలో ఆయన సమావేశం నిర్వహించారు. పార్టీని బూత్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు బలోపేతం చేయడం లక్ష్యంగా సభ్యత్వాన్ని 25 వేల సంఖ్యకు చేర్చాలని సూచించారు.
ASR: నేరాల నియంత్రణ, నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించడంలో మహిళా పోలీసుల పాత్ర ముఖ్యమైనదని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. సోమవారం అరకులోయలో అరకులోయ, డుంబ్రిగూడ, అనంతగిరి మండలాల మహిళా పోలీసులతో నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. మహిళా పోలీసులు గ్రామాలలో నాటు సారా, గంజాయి సాగు, రవాణా, వినియోగం చట్టరీత్యా నేరమని ప్రజలకి అవగాహన కల్పించాలని సూచించారు.
ELR: బుట్టాయిగూడెం మండలం K.R.పురం ఐటీడీఏ వద్ద యువజన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. మండల కేంద్రంలో ఎస్టీ బాలుర కళాశాల హాస్టల్ స్థలంలో నిర్మిస్తున్న వ్యాపార భవన నిర్మాణాలను ఆపివేయాలన్నారు. యధావిధిగా అదే స్థలంలో హాస్టల్ భవన నిర్మాణాలు చేపట్టాలని, గిరిజన విద్యార్థులను విద్యకు దూరం చేయొద్దని పిఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.
CTR: విజయపురం మండలం కొసలనగరం మీట్టురు ఆశ్రమం నందు మంగళవారం శ్రీ రామక్కమ్మ 46వ ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఆశ్రమ నిర్వాకులు వాసుదేవస్వామి పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఉత్సవాలు అఖండనామ భజనలతో ప్రారంభమవుతాయాని తెలిపారు. ఈ సందర్భంగా యజ్ఞం, కోలాటభజనలు, వీధినాటకాలు, ప్రదర్శనలు అమ్మవారి ఊరేగింపు అన్నదానం కార్యక్రమాలు ఉంటాయని వాసుదేవస్వామి వెల్లడించారు.
కడప: జిల్లా పులివెందులలో మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్ రేపటి నుంచి రెండు రోజుల పర్యటన చేపట్టనున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ఈ నెల 25న నందిపల్లిలో నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొననున్నారు.పర్యటన సందర్భంగా స్థానిక నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు.
KRNL: నందవరం మండల టీడీపీ కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల కన్వీనర్ ఖాసింవలి వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం ద్వారా జగన్ ప్రభుత్వం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. పవిత్రమైన తిరుమల ప్రతిష్ఠను మంటగలిపేలా అప్పటి పాలకులు వ్యవహరించారన్నారు.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని రాష్ట్ర స్టేట్ కమిషన్ సభ్యుడు మల్లేశ్వరరావు సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది కొరతపై అసహనం వ్యక్తం చేసి, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామ సర్పంచ్ బొత్తాడ గౌరీ శంకర్ సమక్షంలో రికార్డులను పరిశీలించి, ప్రజలకు అన్ని సేవలు సమయానికి అందించాలని సూచించారు.
అన్నమయ్య: రాయచోటిలో అర్ధరాత్రి ఘర్షణ చోటుచేసుకుంది. కొత్తపల్లి ప్రాంతానికి చెందిన ఖలీద్ (22) పై కత్తితో దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన ఖలీద్ను మొదట ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తరలించారు. పాత కక్షల నేపథ్యంలో దాడి జరిగిందని బాధితుడు తెలిపినట్లు పేర్కొన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
PLD: విద్యార్థులు మంచి ప్రవర్తన కలిగి ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని కారంపూడి సీఐ పి. శరత్ బాబు సూచించారు. సోమవారం కారంపూడిలోని ఓ పాఠశాలలో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాల గురించి విద్యార్థులకు వివరించారు. ఈగల్ క్లబ్స్ ప్రతి ఒక్క స్కూల్లో ఏర్పాటు చేయాలని ఈగల్ క్లబ్ ప్రాముఖ్యతను వివరించారు.
ప్రకాశం: కంభం పట్టణ పరిధిలో మైనర్ డ్రైవింగ్ మరియు మోటారు వాహన చట్టం (MV Act) ఉల్లంఘనలపై పోలీసులు సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై శివకృష్ణ రెడ్డి మాట్లాడుతూ.. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకై ఇటువంటి తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై తెలిపారు.
GNTR: పొన్నూరు పట్టణం 8వ వార్డు నార్త్ క్యాబిన్పేటకు చెందిన ఇఊరి శ్రీనివాసరావు (27) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎలక్ట్రిషన్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆయన నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
BPT: రేపల్లె మండలంలోని ప్రభుత్వ మరియు జెఎల్బి జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ పరీక్షా కేంద్రాలను సోమవారం ఆర్డీవో రామలక్ష్మి పరిశీలించారు. పరీక్ష గదులు, సీసీ కెమెరాలు, తాగునీటి సౌకర్యం వంటి ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిబంధనల ప్రకారం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించారు.
AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీలు, మహిళా సంఘాలు, చిన్నారులు పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని బాలికల ఆరోగ్యం క్షీణించకూడదని, ఎవరు బాల్యవివాహాలను ప్రోత్సహించరాదు అని హెచ్చరించారు.
అనంతపురంలోని SSBN కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.