AKP: దోమలను నియంత్రించినప్పుడే మలేరియాను నిర్మూలించవచ్చునని అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. మలేరియా నివారణ దినోత్సవం సందర్భంగా ఇవాళ అనకాపల్లి గాంధీ నగరంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో కలిసి ఆయన అవగాహన సదస్సును నిర్వహించారు. మలేరియాపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ వ్యాధిని అరికట్టవచ్చునని అన్నారు.
NLR: జిల్లాలో రానున్న పంటకాలానికి సాగునీటిని విడుదల చేసే లోపు కాలువల పూడికతీత, మరమ్మత్తు పనులను తక్షణమే చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి సాగునీరు అందాలంటే ముందస్తు చర్యలు అత్యవసరమని స్పష్టం చేశారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతన్నకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు.
CTR: కుప్పం (M) గుట్టపల్లి కాలనీ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న రెండు క్వారీలను సీజ్ చేసినట్లు DSP పార్థసారథి, అర్బన్ CI శంకరయ్య తెలిపారు. అక్రమ క్వారీల్లో రెండు హిటాచి వాహనాలతో పాటు ఓ గ్రానైట్ లారీని సీజ్ చేసి మైనింగ్ అధికారులకు అప్పగించినట్లు వారు తెలిపారు. సుమారు 26 గ్రానైట్ బ్లాక్లను సైతం సీజ్ చేశామన్నారు.
GNTR: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ఇమామ్లు, మౌజన్ల పారితోషికాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు. మసీదుల అధ్యక్షులు, ముతవల్లీలు రిజిస్టర్ పత్రాలను ఏప్రిల్ 30 లోపు ఇవ్వాలన్నారు. గుంటూరు కలెక్టరేట్లోని వక్ఫ్ బోర్డు ఆఫీసులో వీటిని అందజేయాలని మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ పార్థసారథి శనివారం చెప్పారు. సందేహాలుంటే గుంటూరు, బాపట్ల వక్ఫ్ ప్రతినిధులను కలవాలని సూచించారు.
E.G: రాజమండ్రిలో కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. శనివారం దానవాయిపేటలో భారత్ పెట్రోల్ బంకులు పెట్రోల్ లేదని సిబ్బంది చెప్పడంతో వాహనదారులు నిరాశతో వెను తిరుగుతున్నారు. ప్రస్తుత రోజుల్లో ఏ చోటుకి వెళ్లాలన్నా వాహనాల్లో ఇంధనాన్ని నింపాలి. ప్రభుత్వం నుంచి ఎటువంటి హెచ్చరికలు రాకపోయినా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ అనడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురి అవుతున్నారు.
మార్కాపురం జిల్లా కనిగిరి కేటీఆర్ టెక్నో స్కూల్ ప్రాంగణంలోని లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం పల్లకి సేవలు వైభవంగా నిర్వహించారు. అర్చకులు చోడా వీరభద్రస్వామి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మాజీ మున్సిపల్ ఛైర్మన్ పులి శాంతి, గోవర్ధన్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
కాకినాడ జిల్లా అన్నవరం సమీపంలో మండపం జంక్షన్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి ఎలమంచిలిలో ఉన్న బంధువుల ఇంటికి పెళ్లి పత్రికలు పెంచడానికి బైక్ పై వెళ్తుండగా లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
BPT: కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో శనివారం చలివేంద్రాన్ని ప్రారంభించారు. స్థానిక పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వేసవి తాపాన్ని తీర్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బాపట్ల డీఎస్పీ హెచ్.చంద్రమౌళి విచ్చేసి చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా ప్రజలు, ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని పోలీసులు కోరారు.
ATP: రాయదుర్గం మండలం వేపరాళ్ల వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం నీటి కుంటలోకి వెళ్లిన పదో తరగతి విద్యార్థి శరత్ ప్రమాదవశాత్తు మునిగి మరణించాడు. కోనాపురం గ్రామానికి చెందిన ఈ విద్యార్థి మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో శోకసంద్రం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
CTR: పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి నివాసానికి ఆంధ్రప్రదేశ్ శాసన సభ మాజీ ఉపసభాపతి, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ శనివారం విచ్చేశారు. ప్రైవేట్ కార్యక్రమం నిమిత్తం వచ్చిన బుద్ధ ప్రసాద్ను అల్పాహార విందుకు ఆహ్వానించగా, ఆయన అమర్ ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అతిథిని ఆత్మీయంగా సత్కరించారు.
PLD: నకరికల్లు మండలం శాంతి నగర్ వద్ద ఉన్న మంచి నీరును మున్సిపల్ కమిషన్ రమ్య కీర్తన పరిశీలించారు. వేసవికాలం సమీపించడంతో నీటి పరిశుభ్రత నాణ్యత పరిమాణాలు పరిశీలించాలన్నారు. ప్రజలకు మంచి నీటిని అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ అధికారి రఫీ, స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.
SKLM: భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈనెల 27న శ్రీకూర్మ నాథుని దర్శించుకోనున్నారు. దీంతో ఆలయంత్రాంగం అప్రమత్తమైంది. ఆలయంలో ఉపరాష్ట్రపతి దర్శనానికి సంబంధించిన ప్రోటోకాల్ ఏర్పాట్లను ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్, సంబంధిత అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కూర్మ నాథుడి వార్షిక కళ్యాణ ముహూర్తం అదే రోజు ఉండటంతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరిస్తున్నారు.
KDP: మాజీ డిప్యూటీ సీఎం ఎస్.బి. అంజాద్ భాష విలేకరుల సమావేశంలో పెద్ద దస్తగిరి హత్యకు పోలీసుల వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఘటన జరిగిన వెంటనే సమాచారం ఇచ్చినా రక్షణ కల్పించలేదని విమర్శించారు. స్వయంగా ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదన్నారు. దస్తగిరి కాల్ డేటా ఆధారంగా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ATP: గుత్తి ఆదర్శ పాఠశాలలో శనివారం పాలిసెట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే విద్యార్థులు చేరుకున్నారు. ఉదయం 11 నుంచి 1:00 వరకు ఈ పరీక్షలు జరుగుతాయని పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశస్తకుమారి తెలిపారు.
సత్యసాయి: జిల్లాలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఇంజనీరింగ్ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఆర్ అండ్ బీ, హెచ్ఎల్సీ, హెచ్ఎన్ఎస్ఎస్ వంటి విభాగాల పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. జూలై నెలాఖరులోగా హెచ్ఎన్ఎస్ఎస్ పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు.