కృష్ణా: పెడన(మం) చెన్నూరులోని ZP హై స్కూల్లో కళావేదిక జాతీయ జెండా దిమ్మను ఎమ్మెల్యేలు పులపర్తి రామాంజనేయులు కాగిత కృష్ణ ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో గత మూడు సంవత్సరాలుగా పదవ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
VSP: నగర పోలీసు కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 75 ఫిర్యాదులు అందాయి. కుటుంబ కలహాలు, భూ వివాదాలు, మోసాలు, సివిల్ కేసులకు సంబంధించిన ఫిర్యాదులను సీపీ పరిశీలించి, సంబంధిత అధికారులకు చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసినా, నిల్వ ఉంచినా, పంపిణీ చేసినా కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమీషనర్ శ్రీధర్ అన్నారు. ఇవాళ మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని వర్తక, వ్యాపార సముదాయాల యజమానులకు సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను అమ్మిన, నిల్వ ఉంచిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
E.G: రాజానగరం మండలం రామస్వామిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మానం వీరబాబు (47) దుర్మరణం పాలయ్యారు. అనపర్తిలో డ్యూటీ ముగించుకుని అర్ధరాత్రి రంగంపేట పోలీస్ స్టేషన్కు వస్తుండగా.. గూడ్స్ ఆటో వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మరణించడంతో పోలీస్ శాఖలో విషాదం నెలకొంది.
KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో టీడీపీ ఇన్చార్జ్ రాఘవేంద్ర రెడ్డి చేతుల మీదుగా ఇవాళ మంత్రాలయం, పెద్దకడబూరు రెండు మండలాల్లో పశుపోషక రైతులకు మరింత సులభంగా సేవలు అందించేందుకు 1962 ఉచిత పశు అంబులెన్స్ను ప్రారంభించారు. పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పశు యజమానులు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ATP: గుత్తి మండలం బసినేపల్లి గ్రామంలో రైతు చంద్రశేఖర్ రెడ్డికి చెందిన అరటి తోటకు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం నిప్పు పెట్టారు. రైతు మాట్లాడుతూ.. రెండు ఎకరాలలో అరటి పంటను సాగు చేశానని.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోయిందని వాపోయాడు. రూ. 4 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వమే తనని ఆదుకోవాలని వేడుకున్నాడు.
AKP: అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో సోమవారం పర్యటించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ డ్రైనేజీలను పరిశీలించారు. తక్షణం డ్రైనేజ్ కాలువల్లో పూడికతీత పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. డ్రైనేజీలపై అనధికారికంగా వేసిన పలకలను తొలగించాలన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే డ్రైనేజ్ల నిర్మాణాన్ని చేపట్టకుంటా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు.
NTR: వీరులపాడు (M) జుజ్జూరులో సర్పంచ్ రమావత్ కోటీ అధ్యక్షతన సామాజిక తనిఖీ గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా తనీఖీ అధికారులు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను తెలియజేశారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే సభ ముందుకు తీసుకురావాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం: మార్కాపురంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 37 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఇంఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఎస్పీ మీకోసం కార్యక్రమంలో ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
NDL: మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది లోపాలను గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన నలుగురు సిబ్బందిపై ఇవాళ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు.
SKLM: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ నుంచి రెవెన్యూ, పోలీస్, విద్యుత్, ఆర్టీసీ ఆరోగ్య శాఖల అధికారులతో ఆయన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా థియరీ పరీక్షలకు 39,383 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు.
KKD: కాకినాడ నగరాన్ని పర్యాటక-వినోద కేంద్రంగా తీర్చిదిద్దాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇవాళ కాకినాడ నగరంలోని జగన్నాధపురంలో రెండు వంతెనల మధ్య ఉన్న ప్రాంతాన్ని నగర పాలక సంస్థ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే కాకినాడ పర్యాటక రంగానికి కొత్త ఊతమిస్తుందన్నారు.
W.G: ప్రతి విద్యార్థి పాఠశాలకు హాజరయ్యే విధంగా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లాలో బీసీ, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహాలను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడి సౌకర్యాలపై దృష్టి సారించాలన్నారు. సోమవారం కలెక్టరేట్లో విద్యాశాఖాధికారులతో సమీక్షించారు.ఈ కార్యక్రమలో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
AKP: నర్సీపట్నం మండలం యరకన్నపాలెంలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరం డా.పి.నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. శిబిరంలో 42 పశువులకు వ్యాధి నిర్దారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. దూడలు, మేకలు, గొర్రెలకు నట్టల నివారణ మందులు వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాడి రైతులు, పశు వైద్య సిబ్బంది పాల్గున్నారు.
ఏలూరు: మండలం అశోక నగర్ సబ్ స్టేషన్ పరిధిలో మంగళవారం విద్యుత్ తీగల మరమతులు, చెట్ల కొమ్మలు తొలగింపు పనులు చేపట్టనున్నట్లు EE అంబేద్కర్ వెల్లడించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ఫైర్ స్టేషన్ సెంటర్, కట్టా సుబ్బారావువీధి, ఆర్ఆర్పేట, కోర్టు సెంటర్, గో సంరక్షణ ఏరియా, వెంకటేశ్వరస్వామి టెంపుల్ రోడ్డు, విజయ బారు తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.