W.G: ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామ కాలువ గట్టుపై నివాసం ఉంటున్న వారికి న్యాయం చేయాలంటూ సీపీఎం నాయకులు, బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేదలకు ఇంటి స్థలాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెంకి అప్పారావు, బొడ్డుపల్లి రాంబాబు పాల్గొన్నారు.
KDP: వేంపల్లిలో ఈనెల 6వ తేదీన జాబ్ మేళా జరగనుంది. డిక్సన్ టెక్నాలజీలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తామని మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి( బీటెక్ రవి )వెల్లడించారు. ఆరోజు జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు నిరుద్యోగులు హాజరు కావాలని పేర్కొన్నారు.
E G: ఈ నెల 5వ తేదీన గోపాలపురం నియోజకవర్గ YCP విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు గోపాలపురం YCP ఇంఛార్జ్ మాజీ హోంమంత్రి తానేటి వనిత గురువారం పేర్కొన్నారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు బియర్నగూడెంలో సమావేశం ప్రారంభమవుతుందన్నారు. ఈ సమావేశంలో జిల్లా YCP అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాల్, జక్కంపూడి రాజా, గూడూరి శ్రీనివాస్ తదితరులు హాజరవుతారన్నారు.
VZM: గ్రామ పంచాయతీ కార్యదర్శులు తప్పనిసరిగా కార్యాలయ పనివేళలు పాటించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సూచించారు. గురువారం ఆమె MPDO, EO PRD, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామ పంచాయతీల పనితీరు, ప్రజా సమస్యల పరిష్కారం, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ప్రకాశం: పుల్లలచెరువు మండలం పిడికిటివారి పల్లిలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. పెద్దిరాజు అనే గొర్రెల కాపరికి చెందిన 15 గొర్రె పిల్లలను గురువారం దాడి చేసి హతమార్చాయి. దీంతో ఆ రైతుకు దాదాపు లక్ష వరకు ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరో 8 గొర్రె పిల్లలు తీవ్రంగా గాయపడి మృతి చెంది అవకాశం ఉందని తెలిపాడు.
BPT: రేపల్లె టీడీపీ కార్యాలయంలో గురువారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు , వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వం దివ్యాంగుల శ్రేయస్సు కోసం అన్ని విధాలా కృషి చేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
W.G: వచ్చే నెల 6, 7వ తేదీల్లో ఉండిలో జరుగనున్న సీపీఐ 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో జరిగిన సీపీఐ తణుకు ఏరియా మహాసభలో భీమారావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ మహాసభకు సీపీఐ నాయకుడు చుండ్రు వెంకట్రావు అధ్యక్షత వహించారు.
NLR: చేజర్లలో గురువారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
NLR: హర్యానా రాష్ట్రం, మానసర్లో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ( ICAT)లో గురు, శుక్రవారాల్లో పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధుల జాతీయ స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి నెల్లూరు డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించారు.
ATP: పామిడి మండలంలో ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలని కోరుతూ గురువారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఎంఈవో జయ నాయక్కు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు వినోద్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల బస్సుల సౌకర్యం నిర్లక్ష్యంగా ఉందని వారు పేర్కొన్నారు.
CTR: కుప్పం ఏరియా ఆసుపత్రిలోని టాటా డీజీ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈసేవలు అందించేందుకు సిబ్బంది కొరతపై ఆరా తీశారు. అదనంగా రెండు వేల మంది సిబ్బంది అవసరమని వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ కృష్ణబాబు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పీహెచ్సీలలో డీజీ నెర్వ్ సెంటర్ సేవల తీరును సీఎం వర్చువల్గా పరిశీలించారు.
KDP: రీ కాల్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమాన్ని YCP నేతలు నాయకులు విజయవంతం చేయాలని కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ భాషా పిలుపునిచ్చారు. గురువారం కడప నగరం రామాంజనేయపురంలోని నూతన YCP కార్యాలయంలో జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
VZM: APSRTC ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5వ తేదీల్లో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ భానుమూర్తి తెలియజేశారు. గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడుతూ.. ఉద్యోగులందరికీ గత ఆరేళ్లుగా పెండుంగ్లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలని, ఖాళీగా ఉన్న 10 వేల మంది సిబ్బంది నియామకాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ATP: బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పొగాకు వినియోగ వ్యతిరేక సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పొగాకు వ్యతిరేకంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం DMHO దేవి మాట్లాడుతూ.. జూలై 1 నుంచి 21 వరకు పొగాకు వ్యతిరేకంగా సంతకాలు సేకరించాలన్నారు.
KRNL: నందవరం మండలం మిట్ట సోమాపురంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. పింఛన్లు, రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటి సమస్యలపై ప్రజలు విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించే విధం కృషి చేస్తానని తెలిపారు.