KRNL: ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కే.చంద్రహాస్ నేతృత్వంలో బుధవారం ఓర్వకల్లు మండలం గుమ్మితం తాండ, హుస్సైనాపురం గ్రామాల్లో మెరుపు దాడులు నిర్వహించారు. ఇందులో 45 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ చంద్ర హాస్ తెలిపారు.
NDL: బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల సంతపేట కాలనీకి చెందిన హుసేనాబాషా బుధవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భవన నిర్మాణ కార్మికుడైన ఇతడు కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉరి వేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నదని ఎస్సై మల్లికార్జున్ రెడ్డి తెలిపారు.
NLR: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నగరంలోని బుజబుజ నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. మూడు దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లి వర్గీకరణను సాధించిన మందకృష్ణ మాదిగను శాలువాతో ఘనంగా సత్కరించారు.
KKD: తలసీమియాతో బాధపడుతున్న పిల్లల కోసం గురువారం ఉదయం 10 గంటలు తుని పట్టణంలోని రెడ్ కాన్వెంట్ వీధిలోని రోటరీహాల్లో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు సీహెచ్ మంగరాజు తెలిపారు. రోటరాక్ట్, ఇన్నర్పీల్ క్లబ్బులతోపాటు మమతా అసుపత్రి, మదర్ బ్లడ్ బ్యాంకు ద్వారా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. యువతీ యువకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
KKD:సామర్లకోట అయోధ్య రామపురంలో నేలబావిలో పడి ఓ బాలుడు మృతి చెందాడు. బుధవారం గ్రామానికి సమీపంలో ఆటుకుంటుండగా ప్రమాదవశాత్తూ నేలబావిలో పడిపోయాడు.పోలీసులకు సమాచారం అందించగా రెస్క్యూ బృందాలు బాలుడిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు.అప్పటికే మృతి చెందగా మృతదేహాన్ని బావిలో నుంచి బయటకు తీసిన రిస్క్యూం టీం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KDP: సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్పై జిల్లా ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పౌర రక్షణ -ముందస్తు భద్రతా చర్యలపై సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కడప కలెక్టర్, ఎస్పీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ASR: సెల్ టవర్ నిర్మాణాలను నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుండి అధికారులతో వీసీ నిర్వహించారు. నార్మల్ గ్రామాల్లో సెల్ టవర్ల నిర్మాణానికి, నిర్మాణ సామాగ్రి తరలించడానికి అనువుగా ఉండేలా అవసరమైన రహదారులు నిర్మిస్తామని చెప్పారు. జియో సంస్థకు 512 టవర్ల పనులు అప్పగించగా, 442 పూర్తి చేశారని చెప్పారు.
GNTR: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 20న జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని తాడేపల్లి ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) పిలుపునిచ్చింది. బుధవారం తాడేపల్లిలోని సీతానగరం, ప్రకాష్ నగర్, కుంచనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లకు ఆశా కార్యకర్తలు సమ్మె నోటీసులు అందజేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు.
GNTR: హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెనాలిలో బుధవారం ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ జెండాను దహనం చేశారు. పహల్గాంలో అమరులైన భారతీయ జవాన్లకు నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక సహసంయోజకులు శ్రీనివాసులు, బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవ ఉన్నారు.
BPT: రేపల్లె రైల్వే స్టేషన్లో నూతన భవనాల నిర్మాణ పనులను డీఆర్ఎం సుధీష్ణ సేన్ బుధవారం పరిశీలించారు. పల్నాడు ఎక్స్ప్రెస్, గుంటూరు – తిరుపతి రైళ్లు రావడానికి ప్లాట్ఫాం పొడవు సరిపోవడం లేదని గుర్తించిన ఆమె.. 2, 3 బోగీలకు సరిపడా ప్లాట్ఫాం పొడవు పెంచాలని అధికారులకు సూచించారు. కొత్త స్టేషన్ భవనాల్లో ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు.
NLR: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ బోర్డు మెంబర్, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి హాజరయ్యారు. తిరుమల అభివృద్ధికి సంబంధించిన పలు రకాల అంశాలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, తదితరులు పాల్గొన్నారు.
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును బుధవారం కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. నియోజకవర్గానికి నిధులు కేటాయించాలని కోరారు. మంజూరైన క్రిటికల్ కేర్ హాస్పిటల్ను త్వరగా పూర్తి చేయాలని, పేదల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
PLD: ఎడ్లపాడులోని ఎన్ఎస్ఎల్ నూలుమిల్లులో చిలకలూరిపేట మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు బుధవారం జరిగింది. అసంఘటిత రంగ కార్మికులకు ఉచిత న్యాయ సహాయం అందుబాటులో ఉందని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె. నరేందర్ రెడ్డి తెలిపారు. కార్మిక చట్టాలు, కనీస వేతనాలు, బాల కార్మిక నిషేధ చట్టంపై అవగాహన కల్పించారు.
PLD: అమరావతి మండలం లేమల్లె గ్రామంలో రాజధాని భూసేకరణపై బుధవారం జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. భూసేకరణపై రైతుల అనుమానాలను నివృత్తి చేశారు. భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం రాజధాని నిర్మాణానికి సహకరించాలని కోరారు. అమరావతి మండల రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమని, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
PLD: సత్తెనపల్లి కాకతీయ కల్యాణ మండపంలో నియోజకవర్గ సమీక్షా సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ బాబు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. లక్కరాజు గార్లపాడు రోడ్డు బ్రిడ్జి, నందిగామ బ్రిడ్జి నిర్మాణాలపై చర్చించారు. మంజూరైన ఇళ్లు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.