SKLM: కర్నూల్లో 28,29 తేదీల్లో జరిగిన అండర్-18 మహిళా రగ్బీ టోర్నీలో తిరుమల జూనియర్ కాలేజ్, శ్రీకాకుళం విద్యార్థినులు బి.గీతిక, కే.షాలిని పాల్గొన్నారు. బి.గీతిక ఉత్తమ ప్రతిభ కనబరిచి నేషనల్ లెవెల్కు ఎంపిక కాగా, షాలిని స్టేట్ లెవెల్లో మెడల్ సాధించింది. ప్రిన్సిపాల్ వి.టి. నాయుడు, డైరెక్టర్లు, ఏఓ వీరిని సన్మానించారు.
కృష్ణా: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్లోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వారాహి చండి మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మహాయజ్ఞం జూలై 2, 3 తేదీల్లో కొనసాగనుందని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.
కృష్ణా: గన్నవరం క్లస్టర్ పరిధిలోని ముదునూరు సొసైటీ వద్ద మంగళవారం కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సంఘాల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొని సూచనలు, సలహాలు అందించారు. పాలకవర్గ సభ్యులు ఛైర్మన్ ఆంజనేయులను సన్మానించారు. సంఘాధ్యక్షులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
NDL: ఆల్ ఇండియా పర్మిట్ లేని బస్సులపై డోన్ MVI క్రాంతికుమార్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. రోడ్డు పన్ను చెల్లించని ఆరెంజ్ ట్రావెల్స్కు చెందిన బస్సుపై రూ. 2.09 లక్షల భారీ జరిమానా విధించి, బస్సును ఆర్టీసీ డిపోకు తరలించారు. అలాగే, పత్రాలు లేని ఆరు సరుకు రవాణా వాహనాలపై సుమారు రూ. 30,000 జరిమానా విధించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.
కృష్ణా: అవనిగడ్డలో జాతీయ విద్యుత్ భద్రతా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మంగళవారం విద్యుత్ శాఖ అవనిగడ్డ డీఈఈ ఎన్ సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అవగాహనా ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రజలకు అవగాహన కలిగించారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎస్.వీ.వీ సత్యనారాయణ, గోపీచంద్, జీవీ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
NDL: శిరివెళ్ళ జీటీఆర్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోటనీ, పొలిటికల్ సైన్స్ గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. జీ.ఇంద్రావతి తెలిపారు. పీజీలో 55% మార్కులు సాధించిన వారు అర్హులు. నెట్, సెట్, పీహెచ్డీ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. జూలై 8న డెమో ఇంటర్వ్యూకు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని పేర్కొన్నారు.
VSP: జులై 9న జరగబోయే గిరి ప్రదక్షిణ మార్గాన్ని జీవీఎంసీ కమీషనర్ కేతన్ గార్గ్ మంగళవారం పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం నడక మార్గంలో కావలసిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లుంబిని పార్క్ బీచ్ ప్రాంతం నుంచి సీతమ్మధార మాధవధార మాధవ స్వామి దేవాలయం మీదుగా గిరి ప్రదక్షిణ నడక మార్గాన్ని పరిశీలించారు.
NDL: వెలుగోడు మండలం మోత్కూరు, మాధవరం గ్రామాలలో ఏవో స్వాతి ఆధ్వర్యంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా వరిలో సూడోమోనాస్ అనే బయో శిలీంద్ర నాశిని వాడకం గురించి రైతులకు డీఆర్సీ నంద్యాల ఏడీఏ సరళమ్మ వివరించారు. వరి చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు సుడోమోనాస్ స్ప్రే చేసుకోవడం వలన మెడ విరుపు తెగులు, మచ్చ తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చనన్నారు.
SKLM: టెక్కలిలో నిర్మాణం జరుగుతున్న మూలపేట పోర్టు రోడ్డును మంగళవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోర్టు రోడ్డు నిర్మాణం జరుగుతున్న బన్నువాడ, పిఠాపురం, అయోద్యపురం తదితర గ్రామాల వద్ద రైతులతో మాట్లాడారు. పోర్టు రోడ్డు నిర్మాణ ప్రాంతాల్లో సాగునీటి కాలువలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
ప్రకాశం: ఈనెల 6న ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా ప్రకాశం జిల్లాలోని పశువైద్యశాలలో కుక్కలకు రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేయటం జరుగుతుందని జిల్లా పశు వైద్య శాఖ అధికారి బేబీ రాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు టీకాలు వేస్తామని చెప్పారు. శునక ప్రేమికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.
ELR: ఏలూరు నగరంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించారు. జిల్లాలో ఉన్న 2,58,098 మంది పింఛన్దారులకు ప్రభుత్వం రూ.112.72 కోట్లు విడుదల చేసిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం నాటికి 2,34,760 మంది పింఛన్దారులకు రూ.102.16 కోట్లు(91శాతం) పంపిణీ చేయడం జరిగిందన్నారు.
ప్రకాశం: మద్దిపాడు మండలంలోని గార్లపేటలోనీ పొగాకు వేలం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా మంగళవారం సందర్శించారు. వేలం కేంద్రంలో పొగాకు అమ్మకాలను ఆమె పరిశీలించారు. వేలం నిర్వహణ అధికారి శ్రీనివాస్తో మాట్లాడి ధరలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చేలా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.
BPT: రేపల్లె ప్రభుత్వ ABR డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో ఓపెన్ జిమ్, స్ట్రీట్ లైటింగ్ ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. స్థానికులు వినియోగించే ఈ ప్రదేశాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేందుకు టీడీపీ నాయకుడు అనగాని శివప్రసాద్ బుధవారం స్థలాన్ని పరిశీలించారు. వాకర్స్కు అనువుగా ఉండేలా జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జూలై 1న రాయచోటి క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వారి సమస్యలకు తక్షణ పరిష్కార సూచనలు చేశారు. సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
అన్నమయ్య: జూలై 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమాన్ని పురస్కరించుకుని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్లు, యూనిట్ ఇంఛార్జిలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంచి ప్రభుత్వ పథకాలు ప్రజలకు తెలియజేయాలని సూచించారు.