ELR: పెదపాడు సెంటర్లో రహదారి ప్రమాదాల నివారణకు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినారు. పెదపాడు ఎస్ఐ ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ వాహనదారుల్లో చైతన్యం తీసుకురావడానికి, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించే ఫ్లెక్సీలను ఏర్పాటు చేశామన్నారు. అతివేగం, అజాగ్రత్త, హెల్మెట్ లేకపోవడం మీకు మాత్రమే కాకుండా ఎదుటివారికి కూడా ప్రాణాపాయం కలుగుతుందని స్పష్టం చేశారు.
TPT: APWJF ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన ప్రథమ మహాసభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్ట్లకు త్వరలోనే ఇంటి స్థలాలు మంజూరు చేయిస్తామన్నారు. తిరుపతి రూరల్ ప్రెస్ క్లబ్ కోసం 25 సెంట్లు స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు, విలేకరులు పాల్గొన్నారు.
AKP: స్టీల్ ప్లాంట్ రాకతో అనకాపల్లి జిల్లా రూపురేఖలు మారతాయని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆదివారం నూకాంబిక అమ్మవారి ఆలయం వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, కూటమి నాయకులతో కలిసి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనపై కరపత్రాలతో ప్రచారం నిర్వహించారు. నిరుద్యోగ యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు.
W.G: పన్నెండేళ్లకు ఒకసారి జరిగే తాడేపల్లిగూడెం పట్టణ పుర దేవత బలుసులమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఆదివారం అమ్మవారిని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ దర్శించుకున్నారు. అనంతరం స్థానిక మాగంటి కళ్యాణమండపంలో టీడీపీ ఇంఛార్జ్, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఛైర్మన్ వలవల బాబ్జి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో హాజరయ్యారు.
NTR: నందిగామ పట్టణంలోని కమ్మ కళ్యాణ మండపంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి & పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ప్రారంభించారు. ప్రాణాంతక వ్యాధులపై ముందస్తు నిర్ధారణ ఎంతో ముఖ్యమని, క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే సమర్థవంతమైన చికిత్స అందించవచ్చని తెలిపారు.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు, మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలను meekosam.ap.gov.in వెబ్సైట్లో ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: నీరు మనిషి జీవనానికి ప్రాణాధారమని, నీరు లేకుండా జీవనం అసాధ్యమని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ జల దినోత్సవం సందర్భంగా రామచంద్రపురంలో ఆదివారం మంత్రి రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. భవిష్యత్ తరాలకు నీటి కొరత రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను తమ బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
VZM: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల సమరానికి సమాయత్తం కావాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఆదివారం బొండపల్లి మండలంలోని నెలవాడలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గజపతినగరం నియోజకవర్గస్థాయిలో పలువురు ప్రజాప్రతినిధులకు మంత్రి శ్రీనివాస్ సత్కారం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా నాయకులు ప్రజలుకు అందుబాటులో ఉండాలని సూచించారు.
అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల వేదికగా 1975–1978 బీకామ్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి పాల్గొని పాత మిత్రులతో కలిసి సందడి చేశారు. కళాశాల రోజులను గుర్తు చేసుకుంటూ వారితో సమయం గడపడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
WG: మొగల్తూరు మండలం కేపీ పాలెం నార్త్ ప్రాంతంలో గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన ఐరన్ సరైన సంరక్షణ లేక తుప్పు పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గాలిలో తేమ వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తూఫాన్ బిల్డింగ్ ఆవరణలో ఐరన్ కడ్డీలపై ఎటువంటి కవర్లు, షెడ్లు లేకపోవడంతో వర్షానికి తడిసి ఐరన్ వృథా అవుతుందని వాపోతున్నారు.
PLD: రెంటచింతల మండలంలోని గోలి గ్రామం వద్ద గోలి వాగుపై ఉన్న చప్టా బ్రిడ్జిని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పరిశీలించారు. వాగులో వృథాగా పోతున్న మిగులు జలాలను నిల్వ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడిన ఎమ్మెల్యే, గోలి వాగుపై నూతన చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
CTR: ఇవాళ పెరుమాళ్ళపల్లెలో జరిగిన విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా తుడా ఛైర్మన్ దివాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుడా ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు. విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు.
KRNL: నగరంలోని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వెంకట సుజాత ఆధ్వర్యంలో మాస మసీద్కు చెందిన కె. నాగశేషు, ముజాఫర్ నగర్కు చెందిన కె. కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస, మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీకృష్ణ వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
SKLM: నరసన్నపేట పట్టణంలోని నెయ్యిల వీధిలో పేకాట శిబిరంపై ఎస్సై గణేష్ ఆదివారం దాడిలు నిర్వహించారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోనికి తీసుకొని, వారి వద్ద నుంచి రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ నెల 23న అనంతగిరిలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో ప్రభాకరరావు ఆదివారం తెలిపారు. ఈ రక్తదాన శిబిరం అనంతగిరి వెలుగు ఆఫీసులో జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో రక్త నిల్వలను పెంచడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన తెలిపారు.