గణతంత్ర దినోత్సవ వేడుకలు ఈ రోజు తెలంగాణ రాజ్భవన్లో ఘనంగా జరిగాయి. గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పలువురు ప్రముఖులను సత్కరించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాట ఆస్కార్కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి పద్మశ్రీ అవార్డు వరించింది. ఎంఎం కీరవాణి, ఆ పాట రాసిన గీత రచయిత చంద్రబోస్ను గవర్నర్ సన్మానించారు. శాలువా కప్పి, మెమెంటో అందజేశారు. ప్రశంసాపత్రం కూడా ఇచ్చారు.
నాటు నాటు పాట ఇటీవల ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేషన్ పొందింది. మార్చి రెండో వారంలో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. నాటు నాటు పాటకు ఇప్పటికే ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజ, పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరి, భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి వ్యవస్థాపకులు, సివిల్స్ శిక్షకురాలు బాలలతను గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు.