NLG: న్యాయవాదుల రక్షణ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల డీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ శేపూరి మధుసూదన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం శ్రద్ధ చూపడం శుభ పరిణామం అని పేర్కొన్నారు.
NLG: అసెంబ్లీ ముట్టడి పిలుపు నేపథ్యంలో ఎంజీయూ విద్యార్థి నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో ఎస్ఎఫ్ఎ కార్యదర్శి రవికుమార్, పీడీఎస్యూ ఎంజీయూ అధ్యక్షుడు హర్షవర్ధన్, వినోద్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
KMR: జిల్లాలో ప్రస్తుతం కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ(సగభాగం), జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నూతన జనాభా గణాంకాల ఆధారంగా అసెంబ్లీ స్థానాల పెంపుదల జరిగితే కామారెడ్డిలో 1-2 వరకు అసెంబ్లీ స్థానాలు పెరగవచ్చు. దోమకొండ, గాంధారి ప్రాంతాల్లో నియోజకవర్గ పెంపుదల ఉంటుందని, బాన్సువాడ పూర్తిస్థాయి సెగ్మెంట్ జిల్లాలోకి వస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కామారెడ్డి: గాంధారి మండలం ఎక్కకుంట తండా ఎంపీపీఎస్ విద్యార్థులు మంగళవారం వెలువడిన గురుకుల ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫలితాల్లో సత్తా చాటారు. 9 మంది ఎగ్జామ్ రాయగా ఏడుగురు సీట్లు రావడం గమనార్హం. మారుమూల తండాలో, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
MBNR: ‘రైతుభరోసా’ పథకం డబ్బులు పొందాలంటే దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ అని పెద్దవార్వాల్ AEVO శివలీల తెలిపారు. ఫిబ్రవరి 28 వరకు కొత్త పాస్ బుక్ పొందిన రైతులు, ఇప్పటివరకు రైతు భరోసా పొందని, బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు అప్లై చేయాలి. అప్లికేషన్తో పాస్ బుక్, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్ జిరాక్స్, మొబైల్ నంబర్ వివరాలు సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
BHPL: జిల్లా కోర్టులో ఈనెల 28న జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా SP సంకీర్త్ గౌడ్ అన్నారు. రాజీ పడదగిన క్రిమినల్, సివిల్, కుటుంబ వివాదాలను పరస్పర సమ్మతితో పరిష్కరించుకోవచ్చని, దీని వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని ఆయన తెలిపారు. రాజీ మార్గమే రాజా మార్గమని ఆయన పేర్కొన్నారు.
KNR: చిగురుమామిడి మండలం ముల్కనూర్ గ్రామంలో గర్భిణీలకు పౌష్టికహారం ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సుల్తానా, ప్రణీత గర్భిణీలు తీసుకోవలసిన సమతుల్య ఆహారం, పోషకాహారం,నియమిత ఆరోగ్య పరీక్షల అవసరం, మాత, శిశువు ఆరోగ్య సంరక్షణపై వివరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భారతమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
RR: వనస్థలిపురం డివిజన్ ఆఫీసర్స్ కాలనీలోని శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ గోపురానికి బంగారు కలశాన్ని బీజేపీ BNరెడ్డి డివిజన్ ప్రధాన కార్యదర్శి గంగం ప్రేమ్ నాథ్ బహుకరించారు. ఆయన స్థాపించిన ఆలయానికి ప్రత్యేక కానుక అందజేసి భక్తి చాటారు. రానున్న రోజుల్లో టెంపుల్ను మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కాలనీ అధ్యక్షుడు ప్రొ.బాలాజీ, వెంకట్ బెజవాడ, తదితరులు ఉన్నారు.
KNR: సైదాపూర్(M) సర్వాయిపేట గ్రామంలో మంగళవారం విద్యుత్ షాక్తో గొర్రెల కాపరి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. స్థానికులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేట శివారులో మాందాపూర్ గ్రామానికి చెందిన రైతులు కోతుల బెడద కోసం విద్యుత్తు తీగలు అమర్చగా గమనించకుండా వెళ్లిన గొర్రెల కాపరి బొల్లి సమ్మయ్య (52)తో పాటు రెండు మేకలు మృతి చెందినట్లు తెలిపారు.
SDPT: పట్టణంలోని పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీగా బారులు తీరారు. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్న వార్తలతో ఒక్కసారిగా రద్దీ పెరగడంతో, వాహనదారులు దాదాపు రెండు గంటల పాటు క్యూలో నిలబడాల్సి వస్తోంది. కొన్ని బంకుల్లో స్టాక్ అయిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి సరఫరాను క్రమబద్ధీకరించాలని ప్రజలు కోరుతున్నారు.
JGL: వెల్లుల్ల శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరినట్లు ఈవో కాంతారెడ్డి తెలిపారు. వివిధ సేవా టికెట్ల విక్రయం ద్వారా రూ.29,900, హుండీ కానుకల ద్వారా రూ.6,298 కలిపి మొత్తం రూ. 36,198 ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఆదాయ లెక్కింపు కార్యక్రమంలో దేవాదాయ శాఖ సిబ్బంది కల్వకుంట్ల అనిల్ రావు, కూకట్ల రాజేందర్, మ్యాత లక్ష్మి పాల్గొన్నారు.
KMM: ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో భూసర్వే నిర్వహించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. పైలెట్ ప్రాజెక్టు కింద 5 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి భూ సర్వే పూర్తి చేశామని, రాబోయే రోజుల్లో 32 జిల్లాల్లో ప్రతి జిల్లాకు 70 గ్రామాలను గుర్తించామని అన్నారు.
NRML: విద్యారంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను మెరుగుపరిచేందుకు వారిని విదేశీ పర్యటనలకు పంపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లా నుండి మొత్తం 40 మంది ఉపాధ్యాయులు ఫిన్లాండ్ పర్యటనకు ఎంపికయ్యారు. మొదటి విడతగా నలుగురు ఉపాధ్యాయులు త్వరలోనే విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు.
NZB: రెంజల్ మండలం కందకుర్తిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రామంలో శ్రీరామ మందిరంలో బుధవారం రాత్రి 12 గంటలకు రథోత్సవం, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరాముని జన్మోత్సవం, అనంతరం అన్నప్రసాద వితరణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.