ADB: రైతుల పండించిన మొక్కజొన్న, శనగ పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని జిల్లా రైతు సంఘం నాయకుడు బండి దత్తాత్రీ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ సమావేశంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆర్డీవో స్రవంతిని కలిసి వినతి పత్రం అందజేశారు. అన్నదాతలు ప్రైవేటు వ్యాపారస్తులకు పంటలను విక్రయించడం ద్వారా తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు.
MLG: ములుగు మండలం ఇంచర్ల గ్రామ శివారులోని గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల & కళాశాలను జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్ సోమవారం తనిఖీ చేశారు. విద్యార్థుల వసతి గదులు, కిచెన్, స్టోర్రూమ్ పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించడంతో పాటు వసతి గృహాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
KMR: పిట్లం మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో HP గ్యాస్ వినియోగదారులు అదనపు వసూళ్లతో అల్లాడిపోతున్నారు. గ్యాస్ సిలిండర్ డెలివరీ చేసే క్రమంలో డెలివరీ బాయ్స్ సామాన్యుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అదనపు మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
KNR: మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ గంకిడి లక్ష్మారెడ్డితో కలిసి మూడు వివో భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణాలకు భూమిపూజ చేశారు.
WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్లో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.
MDCL: అల్వాల్ సఖీ కేంద్రంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వికలాంగుల సహకార సంస్థ, మహిళా శిశు, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లు, బ్యాటరీ వీల్ చైర్లు, మోటార్ వాహనాలు పంపిణీ చేశారు. జిల్లా కలెక్టర్ మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, MRO, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని కలెక్టర్ కె. హరిత తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్తో కలసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి EVM గోదాంను పరిశీలించారు. గోదాం వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, CC కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.
MDK: జిల్లాలో ప్రతి ఒక్కరూ పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. సోమవారం తూప్రాన్ పట్టణంలో ఛైర్ పర్సన్ రజని రాఘవేందర్ గౌడ్, ఆర్డీవో జయచంద్ర రెడ్డి, కమిషనర్ గణేష్ రెడ్డిలతో కలిసి పట్టణంలో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. తడి పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించి సేకరించాలని సూచించారు.
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వసతులు, విద్యాబోధన తీరును ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులకు అందుతున్న భోజనం, వసతుల గురించి ఆరా తీశారు.
SDPT: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లా వ్యాప్తంగా 99 రోజులు చురుగ్గా నిర్వహించాలని కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నఈ కార్యక్రమాన్ని జిల్లాలో ప్రభావవంతంగా చెయ్యాలన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, మూకమామిడి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, భోజనశాల, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతపై ఆరా తీశారు.
MNCL: విద్యార్థులకు విద్యాపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా అందరికీ అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తానని MLA ప్రేమ్ సాగర్ రావు హామీ ఇచ్చారు. సోమవారం మంచిర్యాల ITI కాలేజీలో ఏర్పాటు చేసిన షార్ట్ టర్మ్ కోర్సులను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వం అందించిన విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని MLA పిలుపునిచ్చారు.
ADB: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని విద్యాశాఖ కార్యాలయం ముందు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకంలో 30% వెయిటేజ్, కనీస వేతనం, ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డులను అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఉద్యోగులు దేవదర్శన్, మంజుల, ప్రియాంక, తేజస్వి, కాశీనాథ్, అశ్వక్, తదితరులు పాల్గొన్నారు.
JN: జనగామ జిల్లా కలెక్టరేట్లో ఈరోజు నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్తో కలిసి ప్రజల నుంచి 157 అర్జీలను స్వీకరించారు. వచ్చిన వినతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కారం చూపాలని కలెక్టర్ ఆదేశించారు.
GDWL: జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు ప్రజల నుంచి 96 దరఖాస్తులను స్వీకరించారు. ప్రజల ఫిర్యాదులను ఏమాత్రం జాప్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.