NGKL: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని వన్య ప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టింది. అడవిలో మనిషి వెళ్లలేని చోటికి డ్రోన్ కెమెరాలను కృత్రిమ మేధ (ఏఐ) స్మార్ట్ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ స్మార్ట్ కెమెరాల వల్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని గుర్తించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తాయి.
BDK: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా, కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సోమవారం అల్పకాలిక (షార్ట్ టర్మ్) కోర్సులు ప్రారంభించారు. మొత్తం 6 కోర్సులను జూన్ 13 వరకు నిర్వహిస్తామని ఐటీఐ ప్రిన్సిపాల్ రమేష్ తెలిపారు. ఈ కోర్సులకు ఎలాంటి వయోపరిమితి లేదని, ఉపాధి అవకాశాలు పొందాలనుకునే వారందరూ శిక్షణ తీసుకోవచ్చని సూచించారు. నిరుద్యోగులకు ఇది సువర్ణ అవకాశమన్నారు.
SRD: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. అదనపు కలెక్టర్లు పాండు, మాధురి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. జిల్లాని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 41 మంది తమ సమస్యలను విన్నవించారు. దీంతో సంబంధిత అధికారులును ప్రజావాణి ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలని వారు ఆదేశించారు.
JGL: 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ధర్మపురి క్షేత్రంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రి లక్ష్మణ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. గోదావరి తీరంలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా ఉండడంతో పుష్కరాల సమయంలో లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అందుకు అనుగుణంగా ఘాట్ల అభివృద్ది, రహదారుల విస్తరణ చేయాలన్నారు.
KNR: ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచుతామని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం తిమ్మాపూర్లో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, మహిళా సంఘ భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు కొందరు తిమ్మాపూర్లో పలు చోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్లుగా తెలిపారు.
ADB: ఇచ్చోడ మండలం నూతన తహశీల్దార్గా ఇమ్రాన్ నియామకమయ్యారు. ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలకు నూతన తహశీల్దార్ల నియామకం చేపట్టగా సోనాల మండలంలో పని చేస్తున్న ఇమ్రాన్ను ఇచ్చోడకు బదిలీ చేశారు. ఆయన సోమవారం ఇచ్చోడ తహశీల్దార్ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.
NLG: SLBC ప్రాజెక్ట్ పూర్తి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు. సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్బంగా మాట్లాడారు. SLBC ప్రాజెక్ట్ ద్వారా దేవరకొండ ప్రాంతానికి 50 వేల ఎకరాకు సాగునీరు అందిస్తామని తెలిపారు. నిర్విఘ్నంగా నియోజకవర్గం అభివృద్ధి కొనసాగుతుందని, ప్రతి సెంటు భూమికి సాగునీరు అందిస్తామన్నారు.
ASF: జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. TDPS సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. కౌటాల, కెరమెరి ప్రాంతాల్లో అత్యధికంగా 38.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్ 38.1,బెజ్జుర్ 37.9 డిగ్రీలు నమోదయ్యాయి. కాగజ్ నగర్ 36.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
SRCL: మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ అర్బన్ మండలంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పర్యటించారు. వేములవాడ అర్బన్ మండలం అనుపురం మారుపాక చీర్లవంచ గుర్రవానిపల్లి, కోడుముంజ గ్రామాల్లో 50 లక్షలతో ఐదు మహిళా సమైక్య సంఘం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
WNP: జిల్లాలోని 25 కేంద్రాల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా జరిగాయని వనపర్తి డీఐఈవో ఎర్ర అంజయ్య తెలిపారు. 5,613 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,400 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై 213 మంది గైర్హాజరైనట్టు పేర్కొన్నారు. 1,311 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 1,262 మంది విద్యార్థులు హాజరై 49 మంది గైర్హాజరైనట్టు చెప్పారు.
MBNR: జిల్లా వ్యాప్తంగా ఉన్న చెరువులు కుంటలను పరిరక్షించాలని కోరుతూ గత ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించినా ఎవరు స్పందించలేదని తెలంగాణ ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు మెట్టు కాడి ప్రభాకర్ ఆరోపించారు. ఈ విషయమై సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా ఫిర్యాదు చేశారు. వెంటనే తకు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
SRPT: పదవ తరగతి ఫలితాల్లో కోదాడ నియోజకవర్గం జిల్లాలోనే ప్రధమ స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి పిలుపునిచ్చినారు. సోమవారం కోదాడ బాలుర పాఠశాలలో కలెక్టర్ పంపిన పరీక్షా సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులు భయం లేకుండా పరీక్షలు రాయాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.
MNCL: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీని స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది కృషి చేయాలన్నారు.
ADB: ఇందిరమ్మ గృహ అర్హులను L2, L3 నుంచి L1 జాబితాలోకి మార్చి అర్హులకు లబ్ధి చేకూర్చాలని టీపీసీసీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ అన్నారు. సంబంధిత సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. RDO స్రవంతిని సోమవారం కలిసి వినతి పత్రం అందజేశారు. L2, L3 ఉండటం వలన నిరుపేదలైన వారికి అన్యాయం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆర్డీవో సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు.