MHBD: తొర్రూరు పట్టణంలోని అంబేద్కర్ నగర్కు చెందిన శివార్ల ఎల్లమ్మకు చెందిన ఇంటి తాళాలు పగలగొట్టి 4 తులాల 8 గ్రాముల బంగారం, 130 తులాల వెండి, రూ. 10వేల నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధితురాలు ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గొల్లమూడి ఉపేందర్ తెలిపారు.
SRD: కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో శుక్రవారం విద్యుత్ బిల్లు వసూలుకు స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు లైన్మెన్ విష్ణు పటేల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లించి తమ సిబ్బందికి సహకరించాలని కోరారు. బిల్లు చెల్లించని యెడల ఎలాంటి హెచ్చరికలు లేకుండా విద్యుత్ కలెక్షన్ తొలగించబడుతుందన్నారు.
PDPL: ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్మారం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులు గురువారం ‘ఫుడ్ ఫెస్టివల్’ను ఘనంగా నిర్వహించారు. 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు మక్కగడ్క, జొన్న అంబలి, గారెలు వంటి తెలంగాణ ప్రత్యేక వంటకాలను ప్రదర్శించి, వాటి పోషక విలువలను వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెరుగుతుందన్నారు.
NZB: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించేలా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ టీ. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. లక్ష్య సాధనకు కృషి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
BDK: ఐటీడీఏలో గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసే హెచ్ఎం, వార్డెన్లతో పాఠశాలల పనితీరుపై ఐటీడీఏ పీఓ రాహుల్ గురువారం సమీక్షించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదివే విద్యార్థులకు మంచి విద్యాబోధన తోపాటు వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి ఇప్పటి నుంచూ పదవ తరగతి పరీక్షలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేలా హెచ్ఎం, వార్డెన్ బాధ్యత తీసుకోవాలని అన్నారు.
HYD: త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు.
KMR: మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియకు KMR జిల్లాలో భారీ స్పందన లభిస్తోంది. గురువారం సాయంత్రం వరకు జిల్లాలోని మొత్తం 49 వైన్ షాపులకు 419 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు పేర్కొన్నారు. కామారెడ్డి 15 షాపులకు 104, బాన్సువాడ 9 షాపులకు 84, బిచ్కుంద 10 షాపులకు 79, దోమకొండ 8 షాపులకు 77, ఎల్లారెడ్డి 7 షాపులకు 75 దరఖాస్తులు వచ్చాయన్నారు.
WGL: ధాన్యం, పత్తి, మక్క పంటల కొనుగోలు ప్రక్రియపై వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద గురువారం సమీక్షించారు. రైతుల ప్రయోజనాల కోసం కొనుగోళ్లు పారదర్శకంగా, వేగంగా జరగాలని, కేంద్రాల సౌకర్యాలు, తూక యంత్రాలు, గోదాములు, సమాచారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. సమీక్షలో జిల్లా వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ అధికారులు పాల్గొన్నారు.
KNR: సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ గురువారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఎన్నికల అధికారిగా జగిత్యాల జిల్లా సహకార అధికారి సీహెచ్. మనోజ్ కుమార్ను నియమించింది. సకాలంలో జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడ్డాయి.
GDWL: 2024-25 సంవత్సరానికి సంబంధించిన సీడ్ ప్రత్తి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జిల్లా సీడ్ మెన్ అసోసియేషన్ సభ్యులు గురువారం జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు.. సీడ్ ఉత్పత్తి వ్యవస్థలో పారదర్శకత పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు.
MDK: నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులను తపాలా శాఖ ద్వారా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా మెదక్ జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ రాహుల్ రాజ్, సహాయ ఎన్నికల అధికారులు, తహసీల్దార్ పాల్గొన్నారు.
NGKL: కల్వకుర్తి పట్టణంలోని యూటీఎఫ్ భవన్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు బీసీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కల్వకుర్తి డివిజన్లోని వివిధ పార్టీల బీసీల నేతలు, బీసీ మాజీ ప్రజాప్రతినిధులు, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, మాజీ జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, బీసీ సంఘం నాయకులు తదితరులు హాజరవుతారు.
NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వానాకాలం ధాన్యం సేకరణపై గురువారం ఆమె కంట్రోల్ రూమ్ను ప్రారంభించారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన పవన్ నెంబర్ 9281423653 కు ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.
BDK: ఆళ్లపల్లి, గుండాల మండలాలలో నేడు విద్యుత్ సరఫరా అంతరాయం ఉంటుందని విద్యుత్ అధికారులు తెలిపారు. మామకన్ను ఉపకేంద్రంలో నూతనంగా 33 కేవీ బ్రేకర్ ఏర్పాటు పనులు చేపడుతున్నందున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అన్నారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.
BDK: మతిస్థిమితం లేని వ్యక్తి చెరువు కుంటలో పడి మృతి చెందిన ఘటన బూర్గంపాడులో చోటుచేసుకుంది. సారపాక మేడే కాలనీకి చెందిన ధరావత్ నంద నాయక్(40) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక తిరుగుతుండగా రాత్రి మతిస్థిమితం సరిగా లేకపోవడం, ఫిట్స్ ఉండటం వలన ప్రమాదవశాత్తు తాళ్లగొమ్మూరు గ్రామ శివారు చెరువు కుంటలో పడి చనిపోయాడని ఎస్సై నాగభూషణం తెలిపారు.