KMR: తాడ్వాయి మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్రాహ్మణపల్లి, కరడపల్లి గ్రామాల్లో బోరుబావుల కింద సాగు చేసిన వరి పంటలు ప్రస్తుతం నీరందక ఎండిపోతున్నాయి. చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతుండటంతో పెట్టుబడులు కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
JGL: నీరా కేఫ్ నిర్వహణను లీజుకు ఇచ్చేందుకు గీత కార్మిక సహకార సంఘాల నుంచి బిడ్ల దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి సునీత తెలిపారు. 2026 జనవరి 1 నాటికి నమోదైన సంఘాలు అర్హులని పేర్కొన్నారు. గీత కార్మికుల ఆర్థిక పురోభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ కేఫ్ను నిర్మించిందని, ఆసక్తి గల సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MBNR: ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అనంత మారుతి గార్డెన్లో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఖుష్బూ హాజరయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేయాలని సర్పంచులు, కౌన్సిలర్లు మరియు అధికారులకు కలెక్టర్ దిశానిర్దేశం చేశారు.
NLG: క్లాస్ రూంలు, పుస్తకాలతో కుస్తీ పట్టిన ఇంటర్ విద్యార్థులకు కాస్త ఉపశమనం లభించనుంది. గురువారంతో ఫస్టియర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు ఒక్కసారిగా పరీక్షా కేంద్రాల వద్ద సందడి చేశారు. ప్రథమ సంవత్సర పరీక్షలు ముగియగా, నేడు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు చివరి పరీక్ష జరగనుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వార్షిక పరీక్షల పర్వం పూర్తికానుంది.
KMM: రేపు జరగబోయే పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ సెక్షన్ అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఉదయం 8:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండకూడదని, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తికి రూ.7,300 ధర వచ్చింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ.22,400 పలకగా… వండర్ హాట్(WH) మిర్చి రూ.36 వేలు పలికింది. తేజ మిర్చి ధర రూ.19,800, ఎల్లో మిర్చి రూ.20వేలు పలికాయి. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ADB: గుడిహత్నూర్ మండలంలోని అనంతపూర్, దంపూర్, ధమాన్ గూడా గ్రామాలలో అటవీ శాఖ ఆధ్వర్యంలో అడవుల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడవులను అక్రమంగా నరుకడం వల్ల జంతుజాలం, పర్యావరణానికి కలిగే నష్టాలపై గ్రామస్తులకు వివరించారు. అడవుల ప్రాముఖ్యతను గుర్తించి వాటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అటవీ అధికారులు ప్రశాంత్, ఇమ్రాన్ తెలిపారు.
MDCL: మల్కాజిగిరి కార్పొరేషన్ పరిధిలో డివిజన్లలో రాజకీయం ఉత్కంఠగా మారింది. కాంగ్రెస్లో బోడుప్పల్ సర్కిల్ నుంచి తుంగతుర్తి రవికి సీటు కన్ఫర్మ్ అనే సంకేతం వినిపిస్తోంది. BRS అధికారంలో ఉండగా కాంగ్రెస్కు అన్నీ తానై కాంగ్రెస్ అంటే తుంగతుర్తి రవి అనేలాగా గుర్తింపు పొందారు. మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో ఏదో ఒక దాంట్లో పోటీ చేస్తారని ప్రచారం జోరుగా ఉంది.
BHNG: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడి ప్రజల ప్రాణాలను కాపాడే అత్యవసర వైద్య సేవలైన 108 అంబులెన్స్ సేవల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలలుగా జీతాలు రాకపోవడంతో ఉద్యోగుల కుటుంబాలు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం జీతాలు త్వరగా చెల్లించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
MDK: మనోహరాబాద్ రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు దిగే ప్రయత్నంలో మధ్య ప్రదేశ్ వాసి తీవ్రంగా గాయపడ్డాడు. రామాయంపేటలోని ఓ కంపెనీలో పనిచేసే బిహారీ లాల్ (50), గురువారం రాత్రి మనోహరాబాద్ స్టేషన్లో దిగుతుండగా ప్లాట్ఫారమ్, రైలు మధ్య ఇరుక్కుపోకి కుడి కాలు తెగింది. గమనించిన స్థానికులు అతడిని తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
NLG: పెట్టుబడి కష్టాలతో సతమతమవుతున్న రైతులను ఎరువుల ధరల పెంపు దెబ్బ తీస్తోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారిపై కోలుకోలేని దెబ్బ పడేలా చేసింది. ఈ తాజా నిర్ణయంతో ఎరువుల బస్తాపై ఏకంగా రూ.100 నుంచి రూ.200 వరకు ధరలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాగయ్యే విస్తీర్ణాన్ని బట్టి లెక్కగడితే, సుమారు రూ.35 కోట్లకుపైగా అదనపు భారం పడనుంది.
SDPT: టెన్త్ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలోని పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడడం నిషేధమన్నారు.మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు ప్రతి పరీక్షా రోజూ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.
NRML: సారంగాపూర్ మండలంలోని జామ్ గ్రామంలో ప్రతి ఇంటి నల్లాకు ఆన్ఆఫ్ బటన్లు బిగించారు. గ్రామంలో నీటి వృథా అరికట్టేందుకు సర్పంచ్ కరిపే రవళి విలాస్ ఆధ్వర్యంలో ఈ ఆన్ఆఫ్లు బిగించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కుళాయిలకు ఆన్ఆఫ్ స్విచ్లు లేని వాటికి బిగించారు. వారితో మాట్లాడుతూ.. నీటిని వృథా చేయరాదని తెలిపారు. వేసవి కాలం నీటిని జాగ్రత్తగా వాడుకోవాలన్నారు.
HYD: సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఫిబ్రవరిలో 74 కేసులకు సంబంధించి 117 మందిని అరెస్ట్ చేసినట్లు అదనపు సీపీ శ్రీనివాసులు తెలిపారు. నిందితులందరినీ 16 రాష్ట్రాల్లో గాలించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. గతనెలలో అరెస్టైన 117 మందిపై దేశంలోని వివిధ ఠాణాల్లో నమోదైన 1,081 కేసుల్లో ప్రమేయం ఉన్నట్లు గుర్తించామన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు.
WGL: ఈ నెల 15 నుంచి 23 వరకు శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా జరగబోయే 4 T-20 మ్యాచ్లు, 3 వన్-డే టోర్నమెంట్లో పాల్గొనబోయే HCA కంబైన్డ్ జిల్లాల జట్టులో వరంగల్ జిల్లా క్రీడాకారులు జి. పవన్, వి. వైష్ణవ్ ఎంపికయ్యారు. శ్రీలంకలో జరగబోయే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులు కోరుతున్నారు.