KNR: శంకరపట్నంలోని స్థానిక మోడల్ స్కూల్లో ప్రవేశాల కోసం ఈనెల 19న పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ కె.ప్రభాకర్ తెలిపారు. ఆరో తరగతి విద్యార్థులకు ఉ.10 నుంచి మ.12 గంటల వరకు, 7, 10వ తరగతి విద్యార్థులకు, మ.2 నుంచి సా.4 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఏప్రిల్ 10 నుంచి https://telanganams .cgg.gov.in డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
SDPT: హుస్నాబాద్ విద్యుత్ డీఈ కార్యాలయం ముందు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల జేఏసీ పిలుపుతో చేపట్టిన నిరవధిక సమ్మె మూడవ రోజుకు చేరింది. సంస్థలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు. కన్వర్షన్ చేసి ఇతర ఉద్యోగుల్లా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు.
MBNR: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈనెల 14న మహబూబ్నగర్లో జరగనున్న ‘బహుజన రాజ్యాధికార ఆత్మగౌరవ సభ’ పోస్టర్ను బీఎస్పీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సభను విజయవంతం చేయాలని శ్రీకాంత్ ముదిరాజ్ కోరారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరై సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని ఎస్పీ వినీత్ తెలిపారు. శుక్రవారం జిల్లాలోని పోలీస్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వారం రోజుల పాటు నిర్వహించే వివిధ రకాల కార్యక్రమాలపై చర్చించారు.
హనుమకొండ కలెక్టరేట్లో “అరైవ్ అలైవ్” కార్యక్రమంపై శుక్రవారం పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, ఏసీపీలు, ఆర్&బీ, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను విజయవంతం చేయాలని వారు కోరారు.
SRCL: ఈ నెల 26 నుంచి స్వీయ గణన ప్రారంభమవుతుందని (self enumeration) జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. జన గణన 2027లో భాగంగా మొదటి దశ ఇండ్ల గణనపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో రాష్ట్ర జనాభా గణన కార్యాలయము జేడీ సుబ్బరాజు, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ముఖ్య ప్రణాళిక శాఖ అధికారులు, ఆర్డీవోలు, ఛార్జ్ అధికారులు తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, పాల్గొన్నారు.
BDK: కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను శుక్రవారం కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా క్యాంటీన్లో లభించే ఆహార పదార్థాల నాణ్యతను ఆయన స్వయంగా పరిశీలించారు. తయారీ విధానం, మెనూ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యాలయానికి వచ్చే ఉద్యోగులు, సామాన్య ప్రజలకు రుచికరమైన ఆహారం అందించాలన్నారు.
MDK: మాసాయిపేట మండలం హకీంపేటకు చెందిన మల్లయ్య (65) తూప్రాన్ లో జరిగిన విందుకు హాజరయ్యాడు. విందు భోజనంలో మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరాడకుండా స్పృహ తప్పాడు. తూప్రాన్ ఆసుపత్రికి తరలించగా సూపరిండెంట్ అమర్ సింగ్ తీవ్రంగా శ్రమించి గొంతులోని మాంసం ముక్క తొలగించడంతో ప్రాణాప్రాయం తప్పింది.
HNK: టాస్క్ ఫోర్స్ బృందం దాడుల్లో పార్కల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం గ్రామంలో 12 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకుంది. రూ.42 వేల విలువైన 26 సంచుల బియ్యాన్ని జలిగపు మహేందర్ వద్ద పట్టుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
NRML: కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో ఈరోజు గ్రామదేవతల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులు భారీగా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సామాజిక ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు.
GDWL: ఎండలు మండుతున్నా ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలకు తాగడానికి చుక్క నీరు కూడా లేకపోవడం దారుణమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేరు నరసింహ విమర్శించారు. శుక్రవారం ధరూరు మండలంలోని యమునోనిపల్లి, పెద్దపాడు, గూడెందొడ్డి తదితర గ్రామాల్లో ఉపాధి పనులను పరిశీలించిన ఆయన, కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
JN: దేవరుప్పుల మండలం పెద్ద తండా గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ గుగులోతు రాధా కోక్యా నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ ధరకు ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దని తెలిపారు.
NZB: గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో శుక్రవారం 6వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 827 విద్యార్థులకు, 813 మంది విద్యార్థులు హాజరయ్యారు. 15 మంది గైర్హాజరయ్యారు. 3వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 210 మంది విద్యార్థులు హాజరయ్యారని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఆచార్య ఎస్. రంగరత్నం తెలిపారు.
VKB: వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా వెంకటాచారి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.
MNCL: మందమర్రి మండలం పొన్నారం గ్రామంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, పారిశుద్ధ్య నిర్వహణ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వ చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు.