SRPT: మునగాలలో మురికినీరు రోడ్డుపై పారుతుండటంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. మురికినీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
NLG: చిట్యాల మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది.నేరడ గ్రామంలో పొలం పనులు చేస్తుండగా మూర్చ రావడంతో ఓ రైతు మృతి చెందాడు. ఎస్సై రవికుమార్ తెలిపిన వివరాలప్రకారం ఇవాళ సాధారణంగా పొలంలో పని చేస్తున్న సమయంలో రైతుకు అకస్మాత్తుగా మూర్చ వచ్చి మడిలో పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలుస్తుంది. మృతుడి భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
NLG:- ఈనెల 14న తిరుమలగిరి మండలం మాలిపురంలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సామేలు కోరారు. గురువారం శాలిగౌరారంలో నిర్వహించిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో గురువారం ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, అలవాట్లలో మంచి మార్పులు తీసుకురావడానికి కార్యక్రమం చేపడుతున్నామని ప్రిన్సిపాల్ ప్రశాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కరీం, రాజేంద్రప్రసాద్, అయ్యుబ్ ఖాన్, వెంకటేశ్వర్ పాల్గొన్నారు.
MBNR: మహబూబ్నగర్ రూరల్ మండలం మణికొండ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికరెడ్డి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ కాపీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లను ప్రజలు నాణ్యతగా కట్టుకోవాలని సూచించారు.
KMM: సత్తుపల్లి నూతన సీఐగా తుమ్మలపల్లి శ్రీహరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం మహిళ పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన శ్రీహరి బదిలీపై సత్తుపల్లికి వచ్చారు. ఇక్కడ సీఐగా పనిచేసిన కిరణ్ను ఐజీ కార్యాలయానికి అటాచ్ చేశారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిను నూతన సీఐ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.
ADB: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మగవారిపై ఆర్థిక భారం పెరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా బోథ్ ఇన్ఛార్జ్ మజార్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. గతంలో జిల్లా నుంచి గుడిహత్నూరు వరకు రూ.30 ఉన్న టికెట్ ధరను రూ.50కి పెంచారని అన్నారు. దీంతో ప్రతిరోజు ప్రయాణించే పురుషులకు అదనపు ఆర్థిక భారం పెరుగుతుందని పేర్కొన్నారు.
HYD: జులై 4న ఎల్బీ స్టేడియంలో జరిగే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ బహిరంగ సభను విజయవంతం చేయాలని PCC వైస్ ప్రెసిడెంట్ బొంతు రామ్మోహన్, నారాయణపేట MLA పర్ణికారెడ్డి కోరారు. చేవెళ్ల MLA కాలె యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరవుతారని, స్థానిక ఎన్నికల విధానాలపై చర్చిస్తారని తెలిపారు.
KMR: గాంధారి మండల కేంద్రంలోని CHCలో కంటి వైద్య శిబిరాన్ని గురువారం రోజున నిర్వహించారని ఆప్తాల్మిక్ ఆఫీసర్ డా.హరికిషన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేకించి వృద్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. చూపు మందగించకుండా ఉండడం కోసం ప్రతిరోజు వ్యాయామం చేయడం, ఆకుకూరలు తినడం లాంటివి చేయాలని అవగాహన కల్పించారు. చూపు మందగించిన వారు అద్దాలు తీసుకోవాలని కోరారు.
MNCL: కన్నేపల్లి మండలం మెట్ పల్లి గ్రామంలో గురువారం దారుణం హత్య చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే ముడిమడుగుల తిరుపతి అనే వ్యక్తి తన భార్య ముడిమడుగుల తులసిని (30) గొడ్డలితో నరికి హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు SI గంగారాం ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో చంపినట్టు పోలీసులు భావిస్తున్నారు.
MHBD: విద్యుత్ షాక్తో ఓ కార్మికుడు మృతి చెందిన ఘటన జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని ఈదులపూసపల్లిలో గురువారం ఉదయం జరిగింది. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికుడు కరుణాకర్ రెడ్డి ఈరోజు ఉదయం విద్యుత్ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురయ్యాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి బుధవారం ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజల బలం ఉంది. ఎన్నో కేసులను ఎదుర్కొన్నా భయపడలేదు. భయం లేదని మొదటి నుంచి చెబుతున్నా. వరంగల్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా కృషి చేస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు.
WNP: పట్టణంలోని పలు కాలనీలలో సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. మర్రికుంటలోని ఓ రెస్టారెంట్ ముందురోడ్డులో గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రోడ్డుపైనే వర్షపు నీరు నిలువడంతో కాలనీవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీకి చెందిన ఆర్టీసీ ఉద్యోగి జే.వి.స్వామి కోరారు.
MBNR: బాలానగర్ మండల కేంద్రంలో కుక్కలు రోడ్లపై స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇబ్బందులు కలిగిస్తున్నాయని గురువారం ప్రజలు వాపోయారు వృద్ధులు, విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. కుక్కలు బాటసారులు, వాహనదారుల మీద దాడులు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.
BDK: దమ్మపేట మండలం శ్రీరాంపురం గ్రామంలో గురువారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఇందిరమ్మ ఇంటి పనులను పరిశీలించారు. వారు మాట్లాడుతూ… వర్షాకాలం సమీపిస్తు ఉండడంతో నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇంటి బిల్లులు మూడు దఫాలుగా వస్తాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.