NGKL: తూర్పు మిషన్లు, తరుగు పేరుతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అధికారులు రైతులను మోసం చేస్తున్నారని రైతు సంఘం మండల కార్యదర్శి బాలపిరు ఆరోపించారు. కొల్లాపూర్ మండలం నార్లాపూర్, ముక్కిడి గుండం గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతు సంఘం నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రానికి రైతులు ధాన్యం తీసుకొచ్చి 15 రోజులు అవుతున్న కొనుగోలు చేయడంలేదన్నారు.
BDK: జూలూరుపాడు మండలంలో ఈరోజు పర్యటనకు వచ్చిన వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ను సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల కమిటీ నాయకులు కలిశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. సీతారామ ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని, శాశ్వత మార్కెట్ నెలకొల్పాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొన్నారు.
JGL: మెట్పల్లి మండలం వెల్లుల్లలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి రైతులు అక్కడి సమస్యలను విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రాల్లో గన్ని సంచుల కొరతతో పాటు లేబర్ సమస్య చాలా ఉందన్నారు. ప్రభుత్వం అధికారులు రైతులకు సమస్యలు లేకుండా ధాన్యాన్ని తొందరగా కొనుగోలు చేయాలని అన్నారు.
SRCL: రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు కూడా పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకుపోతారేమనని దొంగలాగా చూస్తూ అపాయిట్ మెంట్ కూడా ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
BDK: మణుగూరు మండలంలో ఉపాధి హామీ పథకం కింద చెరువులు, కుంటలు, పంట పొలాల కాలవల పూడిక తీయాలని మంగళవారం సామాజిక కార్యకర్త కర్నె రవి ఎంపీడీవో శ్రీనివాస్కు వినతి పత్రం అందజేశారు. చెరువుల కింద ఎంతో మంది రైతులు పంటల సాగు చేస్తున్నారని, పూడిక తీయడం వల్ల నీటి నిల్వ పెరిగి పంటలకు అధిక దిగుబడి లభిస్తుందని, దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని వారు పేర్కొన్నారు.
KMM: సత్తుపల్లి మండలం యాతాలకుంట అటవీ ప్రాంతంలో మంగళవారం ఓ ఆటోను అడవి దున్నలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలైయ్యాయి. చుంచుపల్లి మండలం పెనగడపకు చెందిన ఐదుగురు కూలీలు సత్తుపల్లిలో పని నిమిత్తం ఆటోలో వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ శివ, కూలి ఓదేలకు గాయాలయ్యాయి. సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అదిస్తున్నారు.
HYD: షేక్పేట్ డివిజన్ MIM కార్పొరేటర్ మహమ్మద్ రషీద్ మంగళవారం జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలోని పెండింగ్ అభివృద్ధి పనులు, కొనసాగుతున్న పనులపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా ప్రారంభించేలా కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. ప్రస్తుతం నడుస్తున్న పనుల్లో వేగం పెంచేలా చూడాలన్నారు. గడువులోగా పనులన్నీ పూర్తి చేయాలన్నారు.
KMM: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించాలని, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ప్రతాపనేని వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రఘునాధపాలెం మండల పరిధిలోని మంచుకొండ గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించారు. కూలీలకు రోజుకి రూ 600 ఇవ్వాలని అన్నారు. అనంతరం కూలీలకు ఓఆర్ఎస్ పాకెట్స్ అందజేశారు.
MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పరిధిలోని 4 సంవత్సరాల బీఎస్సీ బీఈడీ, బీఏ బీఈడీ సెమిస్టర్ 2, 4, 6 రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం అధికారి రాజకుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ప్రకటన విడుదల చేశారు. పరీక్షల తేదీలను త్వరలో వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు పేర్కొన్నారు.
NRML: ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పలు మండలాల్లో ప్రతిరోజూ సాయంత్రం వరకు 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. అనంతరం ఆకాశంలో మబ్బులు ఏర్పడి ఒక్కసారిగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ధాన్యం తడిసిపోవడం, మామిడికాయలు రాలిపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
NZB: ప్రభుత్వం ఉద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా బెదిరింపు ధోరణితో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తప్పుపట్టారు. ఉద్యోగులను అవమానించేలా, బెదిరించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో, పునర్నిర్మాణంలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు.
ADB: నీట్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఉట్నూరుకు చెందిన రాయి మనోజ్ కుమార్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై మనోహర్ తెలిపారు. మొన్న జరిగిన నీట్లో విద్యార్థి HYDలో పరీక్ష రాసి సోమవారం ఉట్నూర్ వచ్చాడు. పరీక్ష బాగా రాయలేదని మనస్తాపం చెంది తన రూమ్లో ఫ్యానుకు ఉరేసుకున్నాడు.
MNCL: బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంగళవారం తాండూర్, కన్నెపల్లి మండలాల్లో పర్యటించనున్నారని ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10 గంటలకు తాండూర్ ఎంపీడీఓ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ అనంతరం మండల కేంద్రంలో జై బాబు, జై భీమ్, జై సమ్మిదాన్ కార్యక్రమంలో పాల్గొంటారు. కన్నెపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు.
ADB: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం DOST నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ADB జిల్లా విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్లో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ జె. సంగీత తెలిపారు. మే 3 నుంచే ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ సెంటర్ను సందర్శించాలన్నారు.
SRPT: సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు అరికట్టే అవకాశం ఉందని సీఐ రఘువీర్ రెడ్డి అన్నారు. సోమవారం తిరుమలగిరిలో ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, సీసీ కెమెరాల వల్ల భద్రత ప్రమాణాలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాల నివారణకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.