• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘ఆశా వర్కర్లను అక్రమ అరెస్టులు చేయడం అన్యాయం’

SRCL: తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన తెలిపేందుకు హైదరాబాద్ వెళ్తున్న ఆశా వర్కర్లను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ మండిపడ్డారు. ఈరోజు ‘ఛలో హైదరాబాద్’ ఇందిరాపార్క్ మహాధర్నాను భగ్నం చేయాలని జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆశా వర్కర్లను ముందస్తు అరెస్టులు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.

March 28, 2026 / 03:50 PM IST

సిరికొండలో పర్యటించిన ఆడే గజేందర్

ADB: సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ శనివారం పర్యటించారు. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోడసం భూపతి తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న గజేందర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 28, 2026 / 03:44 PM IST

‘ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ విజయవంతం చేయాలి’

MNCL: ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీ విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి అన్నారు. శనివారం మంచిర్యాలలో లెర్నింగ్ స్టడీ ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు రెండో రోజు శిక్షణలో ఆయన మాట్లాడుతూ.. సర్వేకు జిల్లాలో నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

March 28, 2026 / 03:42 PM IST

పరీక్షలపై అదనపు కలెక్టర్ ఆదేశాలు

GDWL: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆయన శనివారం గద్వాలలోని విశ్వేశ్వరయ్య, విశ్వభారతి పాఠశాలల కేంద్రాలను తనిఖీ చేశారు. వైద్య శిబిరాలు, మౌలిక వసతులు ఉండేలా చూడాలని సూచించారు. ప్రశ్నపత్రాలను పోలీస్ ఎస్కార్ట్‌తో తరలించి, జవాబుపత్రాలను తపాలా కార్యాలయంలో భద్రపరచాలని తెలిపారు.

March 28, 2026 / 03:41 PM IST

రాజీ మార్గమే రాజమార్గం:DCP

HNK: రాజీ మార్గమే రాజమార్గమని, లోక్ అదాలత్ ద్వారా సమన్యాయం సత్వర పరిష్కారం జరుగుతుందని సెంట్రల్ జోన్ DCP దార కవిత అన్నారు. ఇవాళ జిల్లా కోర్టులో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్‌ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ పడదగిన కేసులో కక్షిదారులు రాజీ పడాలని సూచించారు.

March 28, 2026 / 03:37 PM IST

అంబట్పల్లిలో మెగా హెల్త్ క్యాంప్

NGKL: అంబట్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గైనకాలజీ, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్ వివిధ విభాగాల నిపుణులు రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్యాధికారి డాక్టర్ జే.సీ.పీ. యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ లక్ష్మమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

March 28, 2026 / 03:35 PM IST

అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ

NRPT: కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీల పరిసర ప్రాంతాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఎంపీడీవో సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కే.అశ్విని మహేశ్, కార్యదర్శి మహేశ్ పాల్గొన్నారు.

March 28, 2026 / 03:35 PM IST

జాతీయ లోక్ అదాలత్ ప్రారంభం

KMR: జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్‌ను జిల్లా న్యాయమూర్తి డా. CH.VVR. వరప్రసాద్, ఎస్పీ యం. రాజేష్ చంద్ర ప్రారంభించారు. పెండింగ్ కేసులను కక్షిదారులు పరస్పర సమ్మతితో, సామరస్యపూర్వకంగా త్వరితగతిన పరిష్కరించుకోవాలని ఎస్పీ సూచించారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయని, రాజీ మార్గమే ఉత్తమమని ఆయన పేర్కొన్నారు.

March 28, 2026 / 03:30 PM IST

నీటి కోసం అల్లాడుతున్న స్థానికులు

SRPT: సూర్యాపేట మున్సిపల్ పరిధిలోని 12వ వార్డులో నీటి కష్టాలు అంబరాన్నంటుతున్నాయి. వేసవి వేళ నల్లాలు రాక, వాటర్ హౌస్‌లు ఖాళీ కావడంతో ప్రజలు అల్లాడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

March 28, 2026 / 03:30 PM IST

స్కూల్ పనులను తనిఖీ చేసిన కలెక్టర్

KMR: మద్నూర్ మండలంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా నిర్మాణంలో అత్యుత్తమ నాణ్యత పాటించాలని, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ స్కూల్ మ్యాప్‌ను పరిశీలించారు.

March 28, 2026 / 03:30 PM IST

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

BHNG: రామన్నపేట మండలం పల్లివాడ గ్రామంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో సీపీఎం నాయకుడు బైకాని నరసింహ మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన గ్రామ సర్పంచ్ కంభంపాటి శ్రీనివాసులు గౌడ్ ఇవాళ కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ పార్టీకి అందించిన సేవలను గుర్తు చేశారు. పార్టీ కార్యకర్తల సహకారంతో రూ.37 వేల ఆర్థిక సహాయం అందించారు.

March 28, 2026 / 03:30 PM IST

భక్తి భావం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది: మాజీ ఎమ్మెల్యే

NLG: జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని, దైవ దర్శనంతోనే మానసిక ప్రశాంతత పొందవచ్చని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శనివారం దేవరకొండ మండలం మాల్‌గడ్డ ముత్యాలమ్మ తల్లిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తి భావం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని ఆయన పేర్కొన్నారు.

March 28, 2026 / 03:30 PM IST

ఉమ్మడి జిల్లాలో 108 సేవలు భేష్

MBNR: ఉమ్మడి జిల్లాలో 108 అంబులెన్స్ సేవలు ఆపద్బాంధవులుగా నిలుస్తున్నాయి. జిల్లాలో 71 అంబులెన్సులు సగటున 15 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుతున్నాయని ప్రోగ్రామ్ మేనేజర్ రవి తెలిపారు. మార్చి 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు మొత్తం 81,540 మందికి అత్యవసర వైద్య సేవలు అందించామని వెల్లడించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అనేక మందిని సకాలంలో చేరుకుని రక్షించగలిగామని పేర్కొన్నారు.

March 28, 2026 / 03:30 PM IST

‘పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేపట్టాలి’

MDK: యాసంగి వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారుల‌కు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లై, వ్యవసాయ, పోలీస్, గ్రామీణ అభివృద్ధి, రెవెన్యూ, రవాణా, రైస్ మిల్లర్ అసోసియేషన్ యాజమాన్యాలతో యాసంగి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో రైతులు దళారులను ఆశ్రయించవద్దన్నారు.

March 28, 2026 / 03:29 PM IST

అగ్రికల్చరల్ యూనివర్సిటీలో యువకుడు ఆత్మహత్య

HYD: రాజేంద్రనగర్ ప్రొ. జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆవరణలో గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి హత్య..?, ఆత్మహత్య..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

March 28, 2026 / 03:27 PM IST