కర్నూలు: జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్ బోర్డు అధికారి లాలప్ప ఇవాళ తెలిపారు. 16,116 మంది పరీక్ష రాయాల్సి ఉండగా 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు. పరీక్షలు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.
NDL: మహానంది మండలంలో అన్నదాత సుఖీభవ మూడో విడత కింద 4,200 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని ఏవో నాగేశ్వరరెడ్డి ఇవాళ తెలిపారు. మండలంలోని 13 గ్రామ పంచాయతీల రైతులకు రూ. 2.47 కోట్లు మంజూరైనట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.4 వేలు,కేంద్రం నుంచి రూ.2 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతాయని అన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఈ సాయం అందుతుందని ఆయన పేర్కొన్నారు.
AP: కేబినెట్లో అజెండా అంశాలు ముగిసిన తర్వాత వివిధ విషయాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. మంత్రులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని తెలిపారు. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని చెప్పారు. యుద్ధం ఎఫెక్ట్ పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యాస్ సమస్యపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. MSMEలపై ప్రతినెలా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
సూర్యాపేట: పదో తరగతి పరీక్షల నేపథ్యంలో జిల్లాలోని 69 కేంద్రాల్లో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ డాక్టరు పెండెo వెంకటరమణ తెలిపారు. సూర్యాపేటలో 41, కోదాడలో 28 కేంద్రాల్లో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులు అల్పాహారం తీసుకుని, వెంట మంచి నీళ్ల బాటిల్ తెచ్చుకోవాలని సూచించారు.
ఏలూరు: ఎమ్మెల్యే బడేటి చంటి కవయిత్రి ఆతుకూరి మొల్ల జీవితం నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మొల్లమాంబ జయంతి నిర్వహించారు. తెలుగులో ఉన్న రామాయణాల్లో మొల్ల రామాయణం చాలా సరళంగా ఉండి, సామాన్యులకు సులభంగా అర్థమయ్యే విధంగా రచించబడిందని ఆయన పేర్కొన్నారు.
CTR: పులిచెర్ల మండలం కల్లూరు, మంగలం పేటలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను శుక్రవారం ఎంఈవోలు సిద్ధరామయ్య, పోకల తాతయ్య తనిఖీ చేశారు. కల్లూరు పరీక్ష కేంద్రంలో 219 మంది, మంగళంపేట పరీక్ష కేంద్రంలో 90 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, గాలి, వెలుతురు, విద్యుత్ సరఫరా, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు.
KMR: పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం 247 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 0.695 టీఎంసీల నీటిని వదిలినట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 0.870 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.
W.G: భీమవరం (M) డేగాపురం యనమదుర్రు పంచాయతీ నుంచి కొమరాడ వరకు సీసీ రోడ్డు వేయడానికి 2 గ్రామాల ప్రజలు ముందుకు వచ్చి రూ.18 లక్షలు సహకారం అందించడం హర్షించ దగ్గ విషయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే కార్యాలయంలో గ్రామస్థులు అందించిన రూ.18 లక్షలను కాంట్రాక్టర్కు ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు.
VSP: భీమిలి గ్రామదేవత నూకాలమ్మ ఉత్సవాల పోస్టర్ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆవిష్కరించారు. అమ్మవారు భీమిలి ప్రజల గుండెచప్పుడు అని, 300 ఏళ్లుగా రక్షణగా ఉన్నారని ఆయన కొనియాడారు. మార్చి 17-20 వరకు జరిగే ఉత్సవాల్లో 11 స్టేజ్ కార్యక్రమాలు, భారీ ఊరేగింపు ఉంటాయని ఉత్సవ కమిటీ తెలిపింది.
NRML: నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీ గ్రామంలో శుక్రవారం నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూ. 72 లక్షల విలువగల పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రూ. 20 లక్షలతో రెండు VO భవనాల నిర్మాణం, రూ.20 లక్షలతో రెండు VO వర్కింగ్ షెడ్ల నిర్మాణానికి, రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి, రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
CTR: నగరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో నగరి ఆర్డీవో అనుపమ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. వినియోగదారులు గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు గ్యాస్ సిలిండర్ల పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
PDPL: ధర్మారం మండలం కటికనపల్లి, బొమ్మరెడ్డిపల్లి, ధర్మారంలలో శుక్రవారం మేడారం పీహెచ్సీ ఆధ్వర్యంలో టీబీ ముక్తి విలేజెస్, కొత్త టీబీ యాక్టివిటీస్ గురించి అధికారులు అవగాహన కల్పించారు. అలాగే టీబీ చాంపియన్స్ చేసిన యాక్టివిటీస్కి డాటా క్వాలిటీ ఎనాలసిస్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైద్య సిబ్బంది, టీబీ చాంపియన్స్ పాల్గొన్నారు.
ASF: బెజ్జూర్ మండలం మర్తిడి శివారులో గల భూముల కొలతలను వెంటనే నిలిపివేయాలని శుక్రవారం రైతులు డిమాండ్ చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అధికారులు సర్వే చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై కోర్టులో కేసు పెండింగ్లో ఉందని, ఇలాంటి సమయంలో సర్వే చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అనంతరం MROకు వినతిపత్రం అందజేశారు.
MDK: ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 18 వేల రూపాయలు అమలు చేయాలని సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు కడారి నాగరాజు డిమాండ్ చేశారు. నర్సాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆశ వర్కర్ల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆశ వర్కర్లకు 18000 కనీస వేతనం అమలు చేసే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కోరారు.
SRCL: మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్లలోని నెహ్రు నగర్లో శుక్రవారం మహిళల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలపై హింస, లైంగిక దాడులు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.