MDK: RTC బస్సు కోసం మహిళలు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అల్లాదుర్గం మండలంలోని ఐబి చౌరస్తా వద్ద ఇవాళ మహిళలు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా బస్సులను విడుదల చేసిందని ప్రకటించినప్పటికీ సామాన్య ప్రజలకు మాత్రం తిప్పలు తప్పడం లేదు ప్రయాణీకులు పేర్కొన్నారు. తమకు సరిపడా బస్సులు నడపాలని కోరుతున్నారు.
VZM: రామభద్రపురం మండలం కొట్టక్కి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమణకు గురైన చెరువును సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పి.శంకరరావు, మండల కార్యదర్శులు బి.శ్రీనివాసరావు, ఎస్.గోపాలం అదివారం పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులను కాపాడాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చుస్తుందన్నారు. చెరువు ఆక్రమణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
MHBD: సీరోలు మండల కేంద్రంలో అక్రమంగా ఓ వాహనంలో తరలిస్తున్న నిషేధిత 8 క్వింటాళ్ల నల్ల బెల్లం పోలీసులు పట్టుకున్నారు. నాటుసారా తయారీకి ఉపయోగించడం కోసం ఇద్దరు వ్యక్తులు వాహనంలో నల్లబెల్లం తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పట్టుకుని ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ELR: ముసునూరు మండలం వేల్పుచర్ల గ్రామంలో శ్రీ అంకమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ కమిటీ సభ్యులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. అన్నదాన కార్యక్రమంలో మంత్రి ూలనంేయు భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.
NZB: పట్టపద్దుల MLC అభ్యర్థి అంజిరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ మేరకు ఇవాళ మోస్రా మండల కేంద్రంలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఉమ్మడి ఇన్ఛార్జ్ పెద్దల గంగారెడ్డి తదితరులు ఉన్నారు.
MNCL: నేరగాళ్ల నుంచి ఏదైనా ముప్పు వాటిల్లితే వెంటనే 100 లేదా 112కు కాల్ చేయాలని జన్నారం ఎస్ఐ గుడెంటి రాజవర్ధన్ తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కాపాడతారని ఆయన చెప్పారు. నేరాలకు పాల్పడితే ఎవరైనా ఉపేక్షించేది లేదు ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నాం. అలాగే పిల్లలు ఏంచేస్తున్నారో తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి. సమాజం బాధ్యత తీసుకోవాలని పేర్కొన్నారు.
JN: స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య మొక్కలు నాటారు. మాజీ ఎంపీ సంతోష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి విరివిగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల కుమార్ తదితరులు పాల్గొన్నారు.
NLR: నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కులో రూ. 40 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ ఎక్విప్మెంట్ స్థాపనకు మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 14వ డివిజన్ AC నగర్ పార్కులో రూ.30 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు కమిషనర్ సూర్య తేజ, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.
HYD: ఘట్కేసర్ పరిధి జగదాంబ థియేటర్ పరిసర ప్రాంతాల్లో కిన్లి డూప్లికేట్ వాటర్ బాటిళ్లలో వాటర్ పోసి పలువురు విక్రయిస్తున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఇంకా వాటర్ బాటిల్ సీల్ తీసి ఉంటుందని ఆయన గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఘట్కేసర్ పోలీసు అధికారులు, డూప్లికేట్ కిన్లి బాటిల్ తీసుకొని వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.
KMR: పిట్లం మండలం ఖంబాపూర్ గ్రామంలో ఈ ఏడాది వ్యవసాయ బోరు భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. బోరుబావుల్లో నీరురాక వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. యాసంగిలో రైతులు ఎక్కువగా వరి, మొక్కజొన్న సాగుచేశారు. బోరుబావుల్లో నీరు తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయి. పంటలు ఎండిపోవడంతో కొత్తగా బొర్లు వేసిన నీరు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
HYD:మూసీలో పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగింపునకు చర్యలు చేపట్టామని GHMC శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అత్తాపూర్ నుంచి చాదరాఘాట్ వరకు ఈనెల 3నుంచి 14వరకు నదిని శుభ్రం చేసే పనులు చేట్టామని చీఫ్ ఎంటమాలజిస్ట్ ఎస్. పంకజ అన్నారు. గుర్రపుడెక్కను తొలగించడం,నదిలో దోమలమందు పిచికారీ,సమీప కాలనీలలో ఉస్మానియా ఆసుపత్రి, ప్రాంతాల్లో ఫాగింగ్ వంటివి నిర్వహంచామన్నారు.
HYD: పాతబస్తీలో జరిగిన ఓ విషాద గాథ ఆలస్యంగా వెలుగుచూసింది. సంతోష్నగర్ పోలీసుల వివరాలు.. PS పరిధిలో ఉండే మహ్మద్ ఇమ్రాన్, చాంద్రాయణగుట్టకు చెందిన యువతి ప్రేమికులు. వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసింది. దీంతో ఆమె తండ్రి ఇమ్రాన్ పై కోపంతో తన కూతురిని వేధిస్తున్నట్లు ఫిర్యాదు చేయించాడు. ఈక్రమంలో మనస్తాపంతో ప్రియుడు ఉరేసుకున్నాడు.
WGL: నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల గ్రామ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలను పూడ్చాలని ప్రజాసంఘాల నాయకులు నిరసన చేపట్టారు. నాయకుడు ప్రతాప్ నరేష్ మాట్లాడుతూ.. ఈ సమస్యను ఆరు నెలలుగా రవాణా శాఖ అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు. స్థానికులు కలెక్టర్ తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని కోరారు.
CTR: మార్చి 15న నగరంలోని ప్రముఖ పొన్నియమ్మన్ ఆలయ మహా కుంభాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సీకే లావణ్య బాబు తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 15, 16, 17 తేదీల్లో కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రులు కావాలని కోరారు.
HNK: వరంగల్-ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో కాంగ్రెస్పై విసుగు చెందిన ప్రజలు బీజేపీ అభ్యర్థులను గెలిపించబోతున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.